logo

పెద్దల చేతుల్లో.. డీపట్టా భూములు..!

2003 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీపట్టా భూముల క్రమబద్ధీకరణ నిర్ణయం  జిల్లాలోని కలకలం రేపుతోంది.

Updated : 24 Sep 2023 06:19 IST

క్రమబద్ధీకరణ ప్రకటనతో పేర్ల మార్పునకు పైరవీలు
అర్హుల గుర్తింపునకూ అనేక ఆటంకాలు

రణస్థలం: కోటపాలెం సమీపంలో సాగులో ఉన్న డి.పట్టా భూమి

2003 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీపట్టా భూముల క్రమబద్ధీకరణ నిర్ణయం  జిల్లాలోని కలకలం రేపుతోంది. గత జులై నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో  రెవెన్యూ యంత్రాంగం ఇందుకు సమాయత్తమవుతోంది. అర్హుల జాబితాలు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే డీపట్టా భూముల్లో అధికశాతం నిజమైన లబ్ధిదారుల నుంచి ఎప్పుడో చేతులు మారి పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జిల్లాలోనే అత్యధికంగా వేలాది ఎకరాల డీపట్టా భూములు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ప్రస్తుతం అనుభవంలో ఉన్నవారంతా తమ పేర్లతో జిరాయితీగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు.

 న్యూస్‌టుడే, రణస్థలం  

ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లోనే అత్యధికంగా డీపట్టా భూములున్నాయి. గతంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారికి వేలాది ఎకరాలు డీపట్టాలు అందజేశారు. వీరిలో చాలామంది లబ్ధిదారులు కుటుంబ, ఇతర అవసరాల కోసం భూములను బడాబాబులు, పారిశ్రామికవేత్తలకు చౌకగా విక్రయించేశారు. పేదల భూములన్నీ పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రకటనతో వారంతా పైరవీలు ప్రారంభించారు. ఆయా స్థలాలను తమ పేరున జిరాయితీ భూములుగా మార్చుకునేందుకు ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంతటి పెద్ద ప్రక్రియ ఆదరాబాదరాగా చేయడం ద్వారా ఎక్కడేతప్పులు దొర్లుతాయో, ఎలాంటి లోపాలు తలెత్తుతాయోనని అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు ఇవీ..

నిబంధనలకు విరుద్ధంగా డీపట్టా భూములను కొనుగోలు చేసేవారికి ఎలాంటి హక్కులు ఉండవు. ఒకవేళ పరస్పర అంగీకారంతో కొనుగోలు చేసినా అవి చెల్లవు. 2003కు ముందు పట్టా పొందినవారు, రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదై, వారి పేరునే ఆన్‌లైన్‌లో అడంగల్‌ వచ్చి, క్షేత్రస్థాయిలో ఆ భూమి అనుభవంలో ఉంటేనే క్రమబద్ధీకరణ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ప్రక్రియలో వీఆర్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తహసీల్దారు పరిశీలన చేసి జాబితాలు సిద్ధం చేయాలి. దాని తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాల వివరాలు ప్రదర్శించాలి. లబ్ధిదారులకు సందేహాలుంటే ఏడు రోజుల వ్యవధిలో అభ్యంతరాలు తెలపాలి. ఈ ప్రక్రియ జరిగిన తర్వాత జాబితాల ప్రకారం ఆర్డీవో 5 శాతం, జేసీ ఒక శాతం పరిశీలించాక ఆమోదం తెలుపుతారు.

అర్హుల ఎంపికలోనూ సమస్యలు..

  • నిజమైన అర్హుల విషయంలో అన్యాయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పత్రాలు సమగ్రంగా లేకపోవడంతో ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందోనని ఆందోళన అందరిలో నెలకొంది.
  • లబ్ధిదారుల పేర్లు పూర్తిస్థాయిలో అడంగల్‌లో నమోదు కాలేదు. కొంతమంది పేర్లు నోషనల్‌ ఖాతాల్లో కనిపిస్తున్నాయి. కొంతమందికి అందజేసిన పట్టాల్లో వారి పూర్వీకుల పేర్లు వస్తున్నాయి.
  • భూ లబ్ధిదారుల ఆధీనంలో ఉన్నా వేరే కుటుంబ సభ్యుల పేర్లు మీద ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. కొందరికి పట్టాల స్థానంలో బంజరు, ప్రభుత్వ భూములుగా కనిపిస్తున్నాయి.
  • అప్పట్లో అందజేసిన వాటికి సబ్‌ డివిజన్‌గా చేయకపోవడం ద్వారా ఎవరి భూమి ఎక్కడుందో తెలుసుకోవడం కష్టంగా మారింది.
  • పట్టాలు మంజూరు చేసి చాలాకాలం కావడంతో రెవెన్యూ కార్యాలయాల్లో వీటికి సంబంధించిన దస్త్రాలు అందుబాటులో లేవు.
  • బ్యాంకులు రుణాలిచ్చి వేలం వేసినప్పుడు వాటిని కొనుగోలు చేసుకునే వారి పట్ల రెవెన్యూ యంత్రాంగం ఏం చేయాలో తెలియని పరిస్థితి.

2003 ముందు ఎంతమందికి ఇచ్చారంటే..

  • రణస్థలం మండలంలో 55 గ్రామాల్లో 4,935 మందికి 6,080.90 ఎకరాలకు డీపట్టాలు మంజూరు చేశారు. ఇందులో అధికశాతం ఎస్సీలకు చెందినవే. ఇప్పుడు ఈ భూములు అధిక శాతం చేతులు మారిపోయాయి. సంచాం, తిరుపతిపాలెం, రణస్థలం, కొండములగాం, బంటుపల్లి, జేఆర్‌పురం, వేల్పురాయి, గిరికిపాలెం, చిల్లపేటరాజాం, మెంటాడ, నారువ, పాతర్లపల్లి, కోటపాలెం, వెంకట్రావుపేట, పిసిని, కోష్ట, ఎన్‌జిఆర్‌పురం, మరువాడ ప్రాంతాల్లో అత్యధికంగా మంజూరు చేశారు.
  • జి.సిగడాం: మండలంలో 3,867 లబ్ధిదారులకు 1,697 ఎకరాలు పంపిణీ చేశారు. ఇందులో 894.2 ఎకరాలు ఎస్సీలకు చెందినవే.
  • లావేరు : మండలంలో 42 గ్రామాల్లో 6,174 మందికి 3540.96 ఎకరాలు లబ్ధిదారులకు ఇచ్చారు. లావేరు, అదపాక, బెజ్జిపురం, భరణికాం, తాళ్లవలస, బుడుమూరు, గుమ్మడాం, కేశవరాయునిపాలెం, కొత్తకోట, కొత్తకుంకాం, మురపాక, పెదకొత్తపల్లి గ్రామాల్లో అధికంగా ఈ భూములు ఉన్నాయి.
  •  ఎచ్చెర్ల: మండలంలో 7,242.48 ఎకరాల డీపట్టా భూములు ఉన్నాయి. కుప్పిలి, కొంగరాం, ఎస్‌ఎస్‌ఆర్‌పురం, అరిణాం అక్కివలస, జరజాం, పొన్నాడ, ఎస్‌ఎం.పురం, ముద్దాడ గ్రామాల పరిధిలో అత్యధికంగా పట్టాలు అందజేశారు.

సమగ్ర పరిశీలన చేయాలని చెప్పాం  

డీపట్టా భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నాం. సమగ్ర పరిశీలన చేయాలని ఆయా తహసీల్దార్లు, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించాం. నిబంధనలు అతిక్రమణ, వివాదాలు, సమస్యలున్న భూములను మినహాయిస్తాం. ఈ ప్రక్రియలో తలెత్తే సమస్యల కోసం సమగ్ర పరిశీలన అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. అన్నీ పరిశీలన చేసిన తర్వాతే తుది జాబితాలు సిద్ధం చేస్తాం.

 బి.శాంతి, ఆర్డీవో, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని