logo

మా చెల్లి ఇక్కడ ఉండుంటే బాగుండేది!

మా సోదరి సిమ్లాలో ఇల్లు కట్టుకుంది. అది చాలా అందంగా ఉంది. కానీ ఆమె ఇప్పుడు గుడలూరులో ఉండుంటే బాగుండు. దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతం ఇదని ఆమె తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడి కొండలు, సహజ ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి’ అని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ

Updated : 30 Sep 2022 09:54 IST

 గుడలూరులో కొండలు, ప్రకృతే ఆకర్షణ
 కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ

యువత సందడి..

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-ఆర్కేనగర్‌: ‘మా సోదరి సిమ్లాలో ఇల్లు కట్టుకుంది. అది చాలా అందంగా ఉంది. కానీ ఆమె ఇప్పుడు గుడలూరులో ఉండుంటే బాగుండు. దేశంలోనే అత్యంత అందమైన ప్రాంతం ఇదని ఆమె తెలుసుకుని ఉండాల్సింది. ఇక్కడి కొండలు, సహజ ప్రకృతి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి’ అని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. గురువారం కేరళలో భారత్‌జోడో యాత్రను ముగించుకుని రాష్ట్రంలోని నీలగిరి జిల్లా గుడలూరులో అడుగుపెట్టారు. రాత్రి అక్కడే బసచేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ప్రసంగించారు. గుడలూరుకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. తమిళం, కన్నడ, మలయాళం భాషలకు నిలయంగా, 3 రాష్ట్రాల సంగమంగా ఉంటుందని చెప్పారు. భాషలు, సంస్కృతులపై తమకెంతో గౌరవం ఉందని తెలిపారు. వాటిపై మమకారం ఉందని చెప్పారు. ఇక్కడ నడక సాగించడం ఆనందం, సంతృప్తిని ఇస్తోందన్నారు. దేశం ఐక్యంగా ఉండేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకే యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. తిరిగి రాష్ట్రంలో అడుగుపెట్టడం పెద్ద నదే పారుతున్నట్లుగా ఉందని చెప్పారు. వీటిమధ్య పారుతున్న నది మానవతాహృదయంతో వెళ్తున్నట్లుగా ఉందన్నారు. ఇందులో అన్ని భాషలు, సంస్కృతులతో పాటు పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఉన్నారని వివరించారు. ఈ నది ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తోందని తెలిపారు. విద్వేషం, కోపం, అగౌరవం అనేదే లేదని గుర్తుచేశారు. తమిళ, మలయాళం, కన్నడ మాట్లాడొద్దని కూడా ఎవరూ చెప్పడంలేదని అన్నారు. కొంతమంది, కొన్ని సంస్థలు.. ఈ నదిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆ అలజడుల ప్రభావం పడకుండా యాత్రను చేపట్టామని తెలిపారు. సభలో రాహుల్‌ ప్రసంగిస్తుండగా మధ్యలో ఓ మసీదు నుంచి అజాన్‌ వినిపించడంతో ప్రసంగానికి విరామం ఇచ్చారు. రాత్రికి గుడలూరులోనే బసచేశారు. శుక్రవారం యాత్ర కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. ఈ యాత్రకోసం తమిళనాడు పీసీసీ యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. దారిపొడవునా పోలీసులు భద్రత కల్పించారు.

రాహుల్‌ బస చేసిన ప్రాంతం బయట నేతలు, కార్యకర్తలు

తనని కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు, యువకుడితో రాహుల్‌గాంధీ


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని