logo

పొరునై సాహిత్య వేడుక అభినందనీయం

పొరునై సాహిత్య వేడుకలు అభినందనీయమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. తిరునెల్వేలి జిల్లా పాళైయంకోట్టైలో రెండు రోజుల ఈ వేడుకలు శనివారం ప్రారంభం అయ్యాయి.

Published : 27 Nov 2022 01:19 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌

జిన్నా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: పొరునై సాహిత్య వేడుకలు అభినందనీయమని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. తిరునెల్వేలి జిల్లా పాళైయంకోట్టైలో రెండు రోజుల ఈ వేడుకలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం శుభాకాంక్షల సందేశాన్ని విడుదల చేశారు. అందులో... సాహిత్య పరిపక్వత, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తమిళ సమాజం చేరుకుందని తెలిపారు. కీళడి, శివకళై, కొర్కైలోని పురావస్తు పరిశోధనలు మన ప్రాచీన ఔన్నత్యానికి శాస్త్రీయ నిదర]్శనాలని పేర్కొన్నారు. ఈ గొప్పతనాన్ని తర్వాతి తరాలకు తీసుకెళ్లి శాస్త్రీయ సమాజాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేడుకలు జరగనున్నాయని తెలిపారు. తమిళ జాతి సంపన్నమైన సాహిత్య విలువలను కీర్తించేలా పొరునై, వైగై, కావేరి, సిరువాణి, చెన్నై సాహిత్య వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. భారత ఉప ఖండం చరిత్ర తమిళ నేల నుంచి రాయాలని ఆకాంక్షించారు.  

పోరాటంలో ప్రాణత్యాగం వద్దు

చెన్నై, న్యూస్‌టుడే: పోరాటంలో ఇంకెవరూ ప్రాణత్యాగానికి పాల్పడొద్దని సీఎం స్టాలిన్‌ కోరారు. శనివారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో... హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాలకు వ్యతిరేకంగా సేలం జిల్లాలో తంగవేల్‌ ఆత్మాహుతికి పాల్పడినట్లు వచ్చిన సమాచారంతో దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. ఆయనకు వీర వందనాలని పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయ, ప్రజాస్వామ్య విధానంలో పోరాటం కొనసాగిద్దామని తెలిపారు. ఇప్పటికే పలువురు యోధులను కోల్పోయామని, ఇకపై కోల్పోకూడదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ హృదయాన్ని కదిలించే వరకు విశ్రమించబోమని చెప్పారు. తంగవేల్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కప్‌ను స్టాలిన్‌కు చూపుతున్న సమణ

ఇళంగోవన్‌ మనవరాలికి అభినందన

చెన్నై, న్యూస్‌టుడే: టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మనవరాలు సమణ గుర్రపుస్వారీలో కప్‌ సాధించిన నేపథ్యంలో ఆమెను ముఖ్యమంత్రి అభినందించారు. బెంగళూరులో గతవారం జరిగిన ఎఫ్‌ఈఐ వరల్డ్‌ ఇక్వెస్ట్రయిన్‌ డ్రెసెజ్‌ ఛాలెంజ్‌-2022 గుర్రపు స్వారీ పోటీల్లో జాతీయ స్థాయిలో జూనియర్‌ ఛాంపియన్‌గా సమణ నిలిచారు. ఆమె తన తాత, తండ్రియైన ఎమ్మెల్యే తిరుమగన్‌లతో కలిసి సీఎంను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిశారు. కప్‌ను చూపించగా, సీఎం అభినందించారు. వెంట సమణ తల్లి పూర్ణిమ, కోచ్‌ కిశోర్‌ ఉన్నారు.

దేశాన్ని నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దాం

చెన్నై, న్యూస్‌టుడే: దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దామంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రకటన విడుదల చేశారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం తదితర విలువలతో కూడిన రాజ్యాంగాన్ని ఉన్నతంగా నిలుపుదామని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్‌ అంబేడ్కర్‌ వంటి మేధావుల ఆకాంక్ష మేరకు దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిజ్ఞ చేద్దామని కోరారు.

మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతికి సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: నాగర్‌కోవిల్‌ మాజీ ఎమ్మెల్యే  బాలన్‌ సతీమణి వసంతా బాలన్‌ మృతికి ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. బాలన్‌ కుటుంబ సభ్యులు, బంధువులకు సానుభూతి తెలిపారు.

పుస్తకావిష్కరణ

చెన్నై, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ దివంగత జిన్నా జీవిత చరిత్ర పుస్తకాన్ని అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి శనివారం ఆవిష్కరించారు. ద్రావిడర్‌ కళగం అధ్యక్షుడు వీరమణి, మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఎంపీ టీఆర్‌ బాలు, మాజీ ఎంపీలు ఆర్‌ఎస్‌.భారతి, టీకేఎస్‌ ఇళంగోవన్‌, ఇదయతుల్లా జిన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని