logo

ఐటీలో అగ్రస్థానమే లక్ష్యం

దేశంలోనే అత్యంత కీలక ఐటీ నగరంగా మారేందుకు చెన్నై, రాష్ట్రవ్యాప్తంగా అవకాశాల్ని విస్తృతం చేసేందుకు ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

Published : 29 Mar 2023 00:25 IST

రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు
ప్రభుత్వం కీలక నిర్ణయాలు
చెన్నైలోని టైడల్‌ పార్క్‌

దేశంలోనే అత్యంత కీలక ఐటీ నగరంగా మారేందుకు చెన్నై, రాష్ట్రవ్యాప్తంగా అవకాశాల్ని విస్తృతం చేసేందుకు ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశ, విదేశీ ప్రముఖ సంస్థలతోనూ చేతులు కలుపుతోంది. తాజాగా యుమాజిన్‌ లాంటి ప్రఖ్యాత సదస్సుల్ని ఏర్పాటుచేసి తన సామర్థ్యాన్ని నిరూపించేలా ముందుకెళ్తోంది.

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-ప్యారిస్‌

దేశంలోని ఐటీ నేపథ్య ఉత్పత్తులు, ఇతర సంస్థల పరంగా తమిళనాడు భాగస్వామ్యం బాగా పెరుగుతూ వస్తోంది. సుమారు 10శాతం ఈ ఒక్క రాష్ట్రం నుంచే ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, హైదరాబాద్‌ తరహాలో చెన్నై నగరాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నట్లు చెబుతున్నారు. భారతదేశానికే టెక్‌ కాపిటల్‌గా మార్చాలనే దిశగా ప్రతిపాదనలు చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజ సంస్థలతోనూ ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తోంది. ఇక్కడ శాఖలు ఏర్పాటు చేసుకునేలా పలు అవకాశాల్ని ప్రతిపాదిస్తోంది.

సాంకేతిక పరిశోధనల్లో భాగంగా వాడే డ్రోన్‌లపై ఐఐటీ మద్రాస్‌ విద్యార్థుల ట్రయల్‌రన్‌

ఇజ్రాయిల్‌తో దోస్తీ

సాంకేతికతలో ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇజ్రాయిల్‌ దేశం చూపు ఇప్పుడు తమిళనాడుపై ఉంది. పలు సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఆ దేశం సుముఖత చూపింది. దేశంలోని పరిశోధక విద్యార్థులతో తమిళనాడులోని కార్యక్రమాలతో ముడిపెట్టాలని ఆలోచిస్తోంది. వివిధ సాంకేతిక అంశాలు, పరిశోధనరంగంలోనూ దోహదపడే పలు కంపెనీల్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ దేశానికి చెందిన రెండు విద్యుత్తు బ్యాటరీ స్టోరేజీ నేపథ్యం కంపెనీలతో తమిళనాడుతో ఒప్పందాలు కూడా అయ్యాయి. మరోవైపు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, ఐఐటీ మద్రాస్‌తోనూ కలిసి ఆ దేశ ప్రతినిధులు పనిచేస్తున్నారు. తాజాగా ముగిసిన యుమాజిన్‌ సదస్సులో ఈ దేశం తరపున పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

చకచకా నిర్ణయాలు

* ఐటీ కంపెనీలకు అనువైన నగరాల్ని చూపించడంలో భాగంగా తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్లో కొన్ని కీలక ప్రకటనలు చేసింది. చెన్నై, కోయంబత్తూరు, హోసూరు నగరాల్లో టెక్‌ సిటీల్ని తెస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు.

* రాష్ట్రవ్యాప్తంగా 7 నియో-టైడల్‌ పార్క్‌ల్ని ఏర్పాటు చేసేందుకు ఇంకో కీలక ప్రకటన చేశారు. గతంలో 2000లో చెన్నైలో ఒకటి కొలువుదీరింది. ఇప్పుడు రెండోశ్రేణి నగరాలపై దృష్టిపెడుతున్నారు.

* ఈరోడ్‌, తిరునెల్వేలి, చెంగల్పట్టు ప్రాంతాల్లో కొత్తగా ఐటీ పార్కుల్ని తెస్తూ ప్రకటన చేశారు. ప్రతిచోటా లక్ష చ.అడుగుల విస్తీర్ణంలో వసతులు వచ్చేలా ప్రతిపాదిస్తున్నారు. ఈ 3 ప్రాంతాలు కలిపి సుమారు 4వేల మందికి ఉపాధి లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

హోసూరు.. ప్రత్యేక ఆకర్షణ

కృష్ణగిరి జిల్లాలోని హోసూరు వివిధరకాల హబ్‌లకు వేదికగా మారుతోంది. ఇదివరకే అక్కడ విద్యుత్తు వాహనాల హబ్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పుడు ‘టెక్‌ సిటీ’ని అక్కడ ప్రతిపాదిస్తూ తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్ని వినూత్న రీతిలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా చూపాలని చూస్తోంది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం సుమారు 500 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టత ఇస్తున్నారు. ఈ ప్రాంతం బెంగళూరు, జాతీయ రహదారికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ సాంకేతిక నగరానికి అనుబంధంగా నివాసాలకు యోగ్యంగా అన్నిరకాల వసతుల్ని తెచ్చేలా చర్యలు తీసుకుంటామని యంత్రాంగం చెబుతోంది. వివిధరకాల ప్లాజాలు, షాపింగ్‌మాల్‌లు, కన్వెన్షన్‌ కేంద్రాలు, వినోదాన్ని పంచేవి తెస్తున్నట్లు తెలిపారు. దిల్లీ నగరానికి ఎన్‌సీఆర్‌ ఎలా అనుబంధ నగరంగా వృద్ధి చెందిందో.. ఇక్కడ బెంగళూరు నగరానికి కూడా అనుబంధంగా హోసూరు టెక్‌సిటీని తెస్తామని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారుల స్థాయిలో ఈ ప్రతిపాదనకు సంబంధించి చర్చలు సాగుతున్నాయి.

అంతర్జాల సేవల్లో వేగం

ఐటీ కంపెనీలు, వివిధ సంస్థలకు అవసరమైన ఇంటర్నెట్‌ వసతిని అనువైన ధరలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘యునిఫైడ్‌ డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ విభాగాన్ని తెరుస్తున్నారు. చెన్నై నుంచి రాష్ట్రంలోని ఐటీ నేపథ్య జిల్లాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవల్ని అందివ్వాలని చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థ ఏర్పాటుచేసేందుకు రూ.400కోట్లను కేటాయించారు. ఈ వ్యవస్థకు అనుబంధంగా టెలీమెడిసిన్‌, విద్య, వ్యవసాయ అనుబంధ రంగాల సేవలనూ తీసుకురానున్నారు.

మదురైలోని ఎల్కాట్ ఐటీ పార్క్‌లో మంత్రి మనోతంగరాజ్‌ తదితరులు (పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని