logo

టీకాల తయారీపై పట్టు

టీకాల తయారీ కోసం భారీ ఎత్తున ఖర్చుచేసి నిర్మించిన భవనాలు, సమకూర్చుకున్న వసతులు వినియోగంలోకి రావట్లేదు. రూ.కోట్లు ఖర్చుచేసినా ఉపయోగించుకునే దిశగా అడుగు పడటంలేదు.

Updated : 01 Apr 2023 06:16 IST

కేంద్రానికి పాలకుల వినతి
రాష్ట్రానికి దక్కని అవకాశం

కూనూరులోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్

ఈనాడు, చెన్నై : టీకాల తయారీ కోసం భారీ ఎత్తున ఖర్చుచేసి నిర్మించిన భవనాలు, సమకూర్చుకున్న వసతులు వినియోగంలోకి రావట్లేదు. రూ.కోట్లు ఖర్చుచేసినా ఉపయోగించుకునే దిశగా అడుగు పడటంలేదు. కరోనా టీకా తయారీకి తగిన సామర్థ్యం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సైతం చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి వినతిపత్రాలు పంపుతూనే ఉంది. వసతలును సద్వినియోగం చేసుకోవాలని తాజాగా పార్లమెంటులోనూ చర్చకు తెచ్చారు.  

చెంగల్పట్టు కేంద్రంగా సమీకృత టీకా కాంప్లెక్స్‌ (ఐవీసీ)ను అధునాతనంగా నిర్మించారు. 2012లోనే పనులు పూర్తయ్యాయి. అప్పట్లో ఏకంగా రూ.594 కోట్లు ఖర్చుపెట్టారు. వంద ఎకరాలలో ఇతర వసతులతో భవనాలున్నాయి. ఇప్పటివరకు వినియోగించలేదు. తాజాగా పార్లమెంటులో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ స్పందించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఈ భవనాలకోసం ఏకంగా రూ.804కోట్ల నిధుల్ని విడుదల చేసినట్లు చెప్పారు. ఎప్పటినుంచి వినియోగంలోకి తెస్తారనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు. పరిశోధన, తయారీ, అందుబాటు ధరల్లో టీకాలు సరఫరా చేసే ఉద్దేశంతో ఈ భవనాల్ని నిర్మించారు. యూనివర్సల్‌ ఇమ్యూనిజైషన్‌ ప్రోగ్రాం (యూఐపీ)లో భాగంగా వ్యాక్సిన్లను తయారుచేసివ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడున్న ప్రతిపాదనల ప్రకారం ఈ కేంద్రం టీకాల తయారీ సామర్థ్యం ఏకంగా 585 మిలియన్‌ డోసులుగా ఉంది. ఇదివరకు 408 పోస్టుల్ని కూడా ఈ కేంద్రానికి మంజూరు చేశారు. ఇందులో 251 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

టెండర్లకు స్పందన శూన్యం

ఐవీసీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న హెచ్‌బీఎల్‌ సంస్థ 2021లో టెండర్లను పిలిచింది. కొన్ని నెలల గడువు కూడా పెట్టింది. కానీ వ్యాక్సిన్‌ తయారీ సంస్థల నుంచి స్పందన రాలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీన్ని ఎలా వినియోగించాలనే దానిపై చర్చిస్తున్నామని తెలిపింది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతం నుంచి ఆ టీకాలను ఇక్కడే తయారుచేసేలా చొరవ చూపాలని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, రాజ్యసభసభ్యులు పి.విల్సన్‌ తదితరులు కేంద్రానికి లేఖలు రాశారు. తాజాగా పి.విల్సన్‌ స్పందిస్తూ.. ఈ కాంప్లెక్స్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ తయారీ కోసం ఎందుకు వాడట్లేదో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. ఈ భవనంపై పెట్టిన రూ.804 కోట్లు వృథా అయినట్లేనని వ్యక్తంచేశారు. కరోనా వ్యాక్సిన్‌లను తయారుచేసేందుకు అనుమతి పొందిన భారత్‌ బయోటెక్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా సంస్థల్ని చెంగల్పట్టుకు వచ్చి తయారుచేసుకునేలా అనుమతులు ఇవ్వాలని కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఇప్పటికీ చర్చిస్తూనే ఉంది. వ్యాక్సిన్‌ తయారీకి అనుమతులు పొందడంతోపాటు సంస్థల్ని రప్పించేలా చేయాలని పట్టుబడుతోంది. తమిళనాడులో చెంగల్పట్టు ఐవీసీతో పాటు మరో రెండు కేంద్రాలు అనువుగా ఉన్నాయి. చెన్నైలోని కింగ్స్‌ ఇనిస్టిట్యూట్, కూనూరులోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్లో వసతులను గుర్తుచేస్తున్నారు. గిండిలో కింగ్స్‌ ఇనిస్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు కేంద్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్‌ల తయారీకి సంబంధించిన సామర్థ్యం ఉందని చెప్పారు. డీపీటీ, హెచ్‌ఈపీ బి, హెచ్‌ఐబీ, మీజిల్స్‌, హెపటైటిస్‌ బి, యాంటీరేబీస్‌, జేఈ లాంటి వ్యాక్సిన్లను సైతం ఇక్కడ తయారుచేయవచ్చని తెలిపారు.

ఈ ఏడాదైనా వస్తుందా..?

కూనూరులోని పాశ్చర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాను ఆధునికీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రతిపాదిస్తూనే ఉంది. కరెంట్ గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (సీజీఎంపీ) వసతుల్ని 2019లోనే ఏర్పాటుచేస్తూ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. ఈ యంత్రాలతో అప్పట్లో ప్రయోగాత్మక పరీక్ష కూడా నిర్వహించారు. పరిశోధక, తయారీ యంత్రాల్ని ఇక్కడికి తరలించి ఉంచారు. వ్యాక్సిన్‌ను వివిధ ప్రక్రియల్లో పరీక్షించే పరికరాలూ ఉన్నాయి. ఇంతా చేసినా ఇప్పటికీ వ్యాక్సిన్‌ తయారీ అందుబాటులోకి రావడంలేదని రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ఈ భవానాల్ని అప్‌గ్రేడ్‌ చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.115.78 కోట్లు మంజూరుచేసింది. ఈ ఏడాది అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దీంతోనైనా వ్యాక్సిన్ల తయారీ మొదలవుతుందని ఆరోగ్యశాఖ ఆశగా ఎదురుచూస్తోంది.

చెంగల్పట్టులోని ఇంటిగ్రేటెడ్‌ వ్యాక్సిన్‌ కాంప్లెక్స్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు