logo

కేంద్రం పక్షపాతం చూపలేదు: తమిళిసై

వైద్య కళాశాలల గుర్తింపు రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపలేదని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పుదుచ్చేరి జిప్మర్‌లో రోబో సహకారంతో 1,300 శస్త్రచికిత్సలు చేసిన వైద్యులకు గురువారం సన్మాన కార్యక్రమం జరిగింది.

Published : 02 Jun 2023 02:57 IST

ఓ వైద్యురాలికి ప్రశంసాపత్రం అందిస్తున్న తమిళిసై

చెన్నై, న్యూస్‌టుడే: వైద్య కళాశాలల గుర్తింపు రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతం చూపలేదని పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. పుదుచ్చేరి జిప్మర్‌లో రోబో సహకారంతో 1,300 శస్త్రచికిత్సలు చేసిన వైద్యులకు గురువారం సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో తమిళిసై సౌందరరాజన్‌ పాల్గొని వైద్యులను సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రోబోల సాయంతో శస్త్ర చికిత్స చేసే విధానం మొదట్లో విదేశాల్లో ఉండేదన్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో ఇలాంటి శస్త్ర చికిత్సలు ఎక్కువగా చేసిన ఆస్పత్రుల జాబితాలో జిప్మర్‌ ఉందని తెలిపారు. రోబో సాయంతో చేసే శస్త్రచికిత్సల్లో ఎక్కువ కోత, రక్తం వృథ ఉండవని, రోగి తక్కువ రోజుల్లోనే డిశ్చార్జి కావచ్చని పేర్కొన్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ... జిప్మర్‌లో 8 విభాగాల్లో 20 మంది వైద్యులు రోబోల సాయంతో శస్త్ర చికిత్సలు చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ పాఠ్యప్రణాళిక వ్యవహారంలో తమిళానికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే పాఠ్యప్రణాళిక మార్పునకు ఆమోదించినట్టు తెలిపారు. ఆ మేరకు పుదుచ్చేరి, కారైకాల్‌లో తమిళం, మాహేలో మలయాళం, యానాంలో తెలుగు ఉంటాయని పేర్కొన్నారు. వైద్య కళాశాలల గుర్తింపు రద్దు వ్యవహారంలో కేంద్రం పక్షపాతం చూపుతోందన్న తమిళనాడు ఆరోపణలను ఖండించారు. భాజపా, ఎన్నార్‌ కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉన్న పుదుచ్చేరిలోనూ వైద్య కళాశాలల గుర్తింపు రద్దయిందని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని