logo

Odisha Train Accident: రైలు ప్రమాద బాధితుల్లో తమిళులు?

ఒడిశా వెళ్లిన రాష్ట్ర బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమావేశమయ్యారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారి వివరాలు గురించి తెలుసుకున్నారు.

Updated : 04 Jun 2023 10:01 IST

సర్కార్‌ సాయం ప్రకటన
ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు

ఒడిశాలో జరిగిన  రైలు దుర్ఘటన గురించి తెలియగానే రాష్ట్రం ఉలిక్కిపడింది. ప్రమాదంలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు అన్ని విధాల సహాయ చర్యలు అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చెన్నైలో జరుగుతున్న సహాయక సన్నాహాలను ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా పరిశీలించారు. కోరమండల్‌ రైలు దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను ఫోన్‌ ద్వారా స్టాలిన్‌ సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు వైద్య సహాయాలు అవసరమైతే రాష్ట్రం నుంచి వైద్య బృందం, ఇతర సహాయాలను పంపనున్నట్టు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందినవారికి అవసరమైన సహాయాలు అందించడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రవాణాశాఖ మంత్రి శివశంకర్‌, రవాణాశాఖ అదనపు ప్రధానకార్యదర్శి ఫణీంద్రరెడ్డి, రెవెన్యూ విపత్తు నిర్వహణశాఖ అదనపు ప్రధానకార్యదర్శి కుమార్‌ జయంత్‌, టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కమిటీ ఛైర్‌పర్సన్‌ అర్చనా పట్నాయక్‌లతో కూడిన బృందం   ఒడిశా వెళ్లింది. ప్రమాదంలోని రాష్ట్రానికి చెందిన బాధితుల గురించి వివరాల సేకరణ, సహాయక చర్యలకు టోల్‌ఫ్రీ నెంబరు 1070, 94458 69843 , 94458 69848, 044-2859 3990 నెంబర్లు ప్రకటించారు.  
- చెన్నై, న్యూస్‌టుడే

సహాయక చర్యలపై ముఖ్యమంత్రి ఆరా

వార్‌ రూంలో పరిశీలిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: ఒడిశా వెళ్లిన రాష్ట్ర బృందంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సచివాలయం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమావేశమయ్యారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలు, మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందినవారి వివరాలు గురించి తెలుసుకున్నారు. రాష్ట్ర బృందంలోని మంత్రి ఉదయనిధి, రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంద్రరెడ్డి తదితరులు వివరాలు వెల్లడించారు. స్టాలిన్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఉదయచంద్రన్‌ తదితరులు ఉన్నారు.

స్టాలిన్‌ పరిశీలన

దక్షిణ రైల్వే ప్రధాన కంట్రోల్‌ రూమ్‌కు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెళ్లి కోరమండల్‌ రైలు దుర్ఘటనలోని బాధితుల్లో రాష్ట్రానికి చెందినవారి వివరాలు, అక్కడ చేపడుతున్న సహాయక చర్యలు గురించి రైల్వే ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే సమాచారాన్ని సేకరించి చర్యలు చేపట్టేందుకు, ఒడిశా, తమిళనాడు ప్రభుత్వాలకు సహాయ పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా రెవెన్యూ అధికారి, పోలీసు ఉన్నతాధికారిని నియమించారు. సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల విచారణ, సహాయ కేంద్రానికి వెళ్లారు. ప్రమాదం గురించి అందిన ఫోన్‌కాల్స్‌కు సంబంధించి చేపడుతున్న చర్యలు గురించి తెలుసుకున్నారు. ఎళిలగంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ తరఫున కొనసాగుతున్న వార్‌ రూంనూ సందర్శించారు. అక్కడ చేపడుతున్న చర్యలను పర్యవేక్షించారు. ఫోన్‌ ద్వారా ఒడిశా ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని సంప్రదించి అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను తెలుసుకున్నారు.

బాధిత కుటుంబాలకు సాయం ప్రకటన

సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌లోని ప్రత్యేక సమాచార కేంద్రాన్ని పరిశీలిస్తున్న స్టాలిన్‌

విలేకర్లతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఒడిశాలోని దుర్ఘటనలో దేశాన్ని, దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రాష్ట్రానికి చెందినవారికి సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు, అవసరమైన సహాయాలు అందించడానికి ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను పంపినట్టు పేర్కొన్నారు. అక్కడి పోలీసు అధికారులతో కలిసి పని చేసేందుకు అదనపు ఏడీజీపీ సందీప్‌ మిట్టల్‌ను పంపినట్టు తెలిపారు. పలు రైళ్ల సేవల రద్దుతో ఇక్కడకు చేరుకోలేని ప్రమాద బాధితులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారని వెల్లడించారు. సహాయక చర్యల సమన్వయం, క్షతగాత్రుల కుటుంబాలను సంప్రదించడం, వారికి అవసరమైన సహాయాలు అందించడం గురించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ఒడిశాకు పంపిన మంత్రులు, అధికారులు అందించే వివరాలు ఆధారంగా క్షతగాత్రులు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాలు అందించనున్నట్టు పేరర్కొన్నారు. ఒడిశా రైలు దుర్ఘటన మృతులకు నివాళి అర్పించేలా శనివారం ఒకరోజు సంతాప దినంగా పాటిస్తున్నట్టు, ప్రభుత్వం తరఫున జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున అందించనున్నట్టు ప్రకటించారు. మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు లభించిన తర్వాతే సాయం అందించనున్నట్టు స్పష్టం చేశారు.

ప్రమాద తీరును వివరించిన ప్రయాణికులు

టీనగర్‌, న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాదంలో చెన్నైకి చెందిన బాధితులు కూడా ఉన్నారు. వారి వివరాలను చెన్నైలోని కుటుంబాలకు చేరవేసేందుకు వీలుగా ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో సహాయ కేంద్రాన్ని చెన్నై పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఆ మేరకు ఏర్పాటైన హెల్ప్‌ లైను నెంబర్ల ద్వారా వివిధ ప్రాంతాల నుంచి బాదిత కుటుంబికులు సంప్రదించారు. రైలులో ప్రయాణించిన తమ కుటుంబ సభ్యుల పేరు వివరాలు, సెల్‌ఫోన్‌ నెంబర్లు, ఫొటోలు సహా అందించి వారి ఆచూకీ తెలపాలంటూ ప్రాధేయపడ్డారు. సహాయ కేంద్రం సిబ్బంది కూడా వారి సందేహాలను నివృత్తి చేసే దిశగా ఎప్పటికప్పుడు వివరాలు అందించసాగారు. ఈ ప్రమాదం దృష్ట్యా చెన్నై నుంచి అనేక రైళ్ల సర్వీసులన యంత్రాంగం రద్దు  చేసిన విషయం తెలిసిందే. దీంతో చెన్నై నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించేందుకుగాను శుక్రవారం రాత్రి చేరుకున్న అనేకమంది ఇక్కడే ఉండిపోయారు. 

భయపడిపోయాం...

 పలు సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లోనే పడిగాపులు కాస్తున్న దృశ్యం సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో చెన్నై పోలీసు విభాగం

ప్రమాదాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కొన్న రైలు ప్రయాణికులు కొందరు ప్రత్యామ్నాయ మార్గం ద్వారా శనివారం ఉదయం చెన్నై రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఘటన గురించి వివరించారు. కోరమండల్‌ ఏసీˆ కోచ్‌ ప్రయాణికుడు ఒకరు మాట్లాడుతూ ప్రమాదం జరిగినపుడు తొలుత తమ రైలు  కోచ్‌ పెద్దగా ఊగుతూ ఆగిపోయిందన్నారు. అందులో ప్రయాణికులు చాలామంది సీˆట్ల నుంచి కిందపడ్డారన్నారు. వెలుపలికి చూడగా  విద్యుత్‌ తీగలన్నీ తెగి కిందపడసాగాయన్నారు. కొన్ని నిప్పంటుకోగా దాన్ని చూసి భయపడ్డామన్నారు. అదేసమయంలో ఇతర కోచ్‌లలోని ప్రయాణికులు తమను రక్షించండంటూ ఆర్తనాదాలు చేశారన్నారు. అప్పటికే తమ కోచ్‌కు నిప్పంటుకుంటుందన్న భయంతో ప్రయాణికులు కిందకు దిగారన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఇతర ప్రయాణికులను రక్షించేందుకు పరుగులు తీశామని చెప్పారు. చీకటి కమ్మిన ఆ ప్రదేశంలో అనేక రైళ్ల కోచ్‌లు అడ్డదిడ్డంగా పడిపోయి కనిపించాయన్నారు.  ప్రమాదం శుక్రవారం రాత్రి 6.30 గంటల నుంచి ఏడు గంటల మధ్య కాలంలో సంభవించి ఉంటుందన్నారు. అది జరిగిన సుమారు 20 నిమిషాల్లోపు అంబులెన్స్‌లు వచ్చాయన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని వరుసగా వైద్యశాలలకు తరలించసాగారన్నారు. జనరల్‌, సీˆ్లపర్‌ కోచ్‌లే ఎక్కువగా దెబ్బ తిన్నాయన్నారు. ఓ సీˆ్లపర్‌ కోచ్‌ అయితే ఎగిరి దూరంగా పడిపోయి ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని