logo

దడ పుట్టిస్తున్న డెంగీ

తాజాగా తిరుచ్చికి చెందిన కనగవల్లి (38) అనే మహిళ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతిచెందారు. చాలా రోజులుగా జ్వరం ఉండటానికి కారణాలేంటో వైద్యులు గుర్తించలేకపోయారు.

Updated : 18 Sep 2023 07:04 IST

రాష్ట్రంలో మొదలైన వ్యాప్తి
ఇప్పటికే ముగ్గురి మృతి
నియంత్రణ చర్యలు చేపట్టిన ఆరోగ్యశాఖ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు వైద్య వసతులపై ఆరా తీస్తున్న ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌

తాజాగా తిరుచ్చికి చెందిన కనగవల్లి (38) అనే మహిళ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతిచెందారు. చాలా రోజులుగా జ్వరం ఉండటానికి కారణాలేంటో వైద్యులు గుర్తించలేకపోయారు. రక్తపరీక్షల్లో డెంగీ నెగిటివ్‌ రావడంతో వైద్యులకు ఈ జ్వరమేంటనేది అంతచిక్కలేదు. చెన్నై నగరంలో ఈ మధ్యే డెంగీ బారినపడి 4 ఏళ్ల బాలుడు కూడా చనిపోయాడు. ఇదే సమయంలో తిరువళ్లూరులో శిక్షణ వైద్యురాలు మృతిచెందారు. ఈమె టైపాయిడ్‌తో మృతిచెందినట్లు తేల్చారు. ఈ తాజా ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలాచోట్ల జ్వరాలతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి.

ఈనాడు-చెన్నై: చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జ్వరాలతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి, కీల్పాక్కం వైద్య కళాశాల ఆసుపత్రి తదితర ఆసుపత్రుల్లో ఈ వారంలో జ్వరపీడితుల తాకిడి బాగా పెరిగినట్లుగా చెబుతున్నారు. అనుమానమున్న రోగుల నుంచి రక్తనమూనాలు తీసుకుంటున్నారు. డెంగీ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి డెంగీ పాజిటివ్‌ వచ్చినవారిపై వైద్యులు పర్యవేక్షణ ఉంచినట్లు వెల్లడిస్తున్నారు. ఈ ఏడాది డెంగీ జ్వరాలు నమోదైన దాన్నిబట్టి చెన్నైతో పాటు కోయంబత్తూరు, దిండుక్కల్‌, తెన్‌కాశి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాలవారిని అప్రమత్తం చేస్తున్నారు.

డిసెంబరు వరకు ఇంతే

జ్వరాల ప్రభావం రానున్న 3 నెలలు రాష్ట్రవ్యాప్తంగా ఉండొచ్చని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డెంగీ వైరస్‌ సోకితే 7 రోజుల పాటు శరీరంలో ఉంటుందని, తొలి 3 రోజుల పర్యవేక్షణ అత్యంత కీలకమని చెబుతున్నారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు మాసాల్లో డెంగీ, మలేరియా జ్వరాలు రాష్ట్రంలో సాధారణంగానే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ప్రభావం డిసెంబరు దాకా కూడా ఉండొచ్చని అంచనాలు వేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ చర్యలు ప్రారంభమయ్యాయని, అధికారులంతా అప్రమత్తంగా ఉన్నారని వివరిస్తోంది. గతేడాది ఇదే సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుందని వెల్లడిస్తోంది. తరచూ సమీక్షలు, అధికారుల పర్యవేక్షణతో ఇది సాధ్యమైందని చెప్పింది. కాబట్టే డెంగీ మరణాలు బాగా తగ్గేలా చేయగలుగుతున్నామని వివరిస్తోంది.

ప్రత్యేక వార్డులు సిద్ధం

చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 40 పడకలతో ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. 20 మగవారికి, 20 ఆడవారికి కేటాయించారు. మరో 10 పడకల్ని ఐసీయూలో ఉంచారు. ఇదే తరహాలో జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవగాహన కార్యక్రమాల్ని పెంచుతున్నారు. ప్రజల్లో భయాల్ని పోగొట్టేలా జ్వరాలు అదుపులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల్లోని యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు నిఫా వైరస్‌పై కూడా కేరళ సరిహద్దు జిల్లాల్లో అప్రమత్తంగా ఉన్నారు.

కలవరపెడుతున్న కేసులు

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్నిబట్టి 2017లో ఏకంగా 23,294 డెంగీ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ చెబుతోంది. ఇది దేశంలోనే పెద్ద రికార్డుగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3 డెంగీ మరణాలు చోటుచేసుకున్నాయి. మొత్తంగా 4,048 మందికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఈ ఏడాది జూన్‌లో 364, జులైలో 353 కేసులు నమోదవగా.. ఆగస్టులో మాత్రం 535కు పెరిగాయి. సెప్టెంబరు 15లోపు 204 కేసులు వచ్చినట్లుగా ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఈ గణాంకాల ప్రకారం రెండు మాసాలుగా డెంగీ జ్వరాల్లో పెరుగుదల ఉందని, ఇతర జ్వరాలూ పెరుగుతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. అదే 2022లో 6430 డెంగీ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని