logo

అకృత్యం... అమానుషం!!

విశాఖజిల్లాలో శుక్ర, శనివారం వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. చిన్నారులను, సొంత కూతురిని కూడా వదలని తీరు కలవరపెడుతోంది.

Published : 23 Jan 2022 05:37 IST

భయాందోళన రేపుతున్న అత్యాచార ఘటనలు

విశాఖజిల్లాలో శుక్ర, శనివారం వెలుగులోకి వచ్చిన అత్యాచార ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. చిన్నారులను, సొంత కూతురిని కూడా వదలని తీరు కలవరపెడుతోంది.


కంటి రెప్పే కాటేసే...

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే : రక్షణగా నిలవాల్సిన కన్నతండ్రే కూతురుపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడాది కాలంగా తండ్రి చేస్తున్న అకృత్యం భరించలేక ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. సభ్య సమాజం తలదించుకునే సంఘటన విశాఖ ఆరిలోవ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. దీనికి సంబంధించి ఆరిలోవ పోలీసులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వ్యక్తికి కిడ్నీలు పాడయ్యాయి. దీంతో భార్య కిడ్నీ దానం చేసింది. ఆ తర్వాత ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో పుట్టింటిలో ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తండ్రికి సేవ చేయడానికి తొమ్మిదో తరగతి చదువుతున్న కుమార్తె(15)ను తోడుగా ఉంచింది. సేవ చేసుకుంటూ చదువుకుంటున్న కుమార్తె మీద కన్నేసిన తండ్రి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది కాలంగా తండ్రి చేస్తున్న అకృత్యాన్ని భరించలేక పాఠశాల ఉపాధ్యాయినుల సహాయంతో ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీని ఆశ్రయించింది. వారి సాయంతో ఆరిలోవ పోలీసులను సంప్రదించారు. తండ్రిపై కేసు నమోదు చేసిన స్థానికు పోలీసులు దిశా పోలీసులకు అప్పగించారు. దిశా ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ బాలికను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కాపులుప్పాడలో..

గ్రామీణ భీమిలి, న్యూస్‌టుడే : విశాఖ నాల్గోవార్డు పరిధిలోని కాపులుప్పాడలో అయిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు(12) అత్యాచారానికి పాల్పడినట్లు భీమిలి సీఐ గంటా వెంకటరమణ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బయట ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి తన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని దిశ పోలీసుస్టేషన్‌ ఏసీపీ ప్రేమకాజల్‌ శనివారం సందర్శించారు. పాప తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆధారాలను సేకరించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని హోమ్‌కు పంపించారు.


రాజయ్యపేట ఘటనపై ఏఎస్పీ విచారణ

నక్కపల్లి, న్యూస్‌టుడే: రాజయ్యపేటలో పదకొండేళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లిన ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. అనంతరం అక్కడి నుంచి స్టేషన్‌కు చేరుకుని ఎఫ్‌.ఐ.ఆర్‌. పరిశీలించారు. కేసు దర్యాప్తులో భాగంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్‌కు వచ్చినా సిబ్బంది సరిగా స్పందించలేదనే దానిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఐ నారాయణరావు, మహిళా ఎస్సై శిరీష పాల్గొన్నారు.


విధుల్లో నిర్లక్ష్యం.. కానిస్టేబుల్‌ బదిలీ

విశాఖ గ్రామీణం, న్యూస్‌టుడే: రాజయ్యపేట అత్యాచార ఘటనపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నక్కపల్లి పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. బాధితురాలితో కలిసి తల్లిదండ్రులు ఘటన జరిగిన రోజు రాత్రి స్టేషన్‌కు వస్తే విధుల్లో ఉన్న శ్రీనివాసరావు మరుసటి ఉదయం రావాలని చెప్పి వెనక్కు పంపాడని బాధితులు వాపోయారు. ఈ విషయం పత్రికల్లో రావడంపై స్పందించిన ఎస్పీ కృష్ణారావు కానిస్టేబుల్‌ను చింతపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు