logo

Vizag: ఉత్కంఠ రేపిన కళాకారిణి అదృశ్యం.. ఆచూకీ కోసం పరుగులు పెట్టిన పోలీసులు

విశాఖ నగరంలో ప్రముఖ కళాకారిణి, స్వరరంజని సంస్థ అధ్యక్షురాలు జవ్వాది లక్ష్మి(54) అదృశ్యమైన ఘటనతో పోలీసులు పరుగులు తీశారు. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న నేర ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించారు. 

Updated : 25 Sep 2022 08:59 IST

ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లినట్లు గుర్తింపు

జవ్వాది లక్ష్మి(54)

ఈనాడు, విశాఖపట్నం, పీఎంపాలెం, న్యూస్‌టుడే: విశాఖ నగరంలో ప్రముఖ కళాకారిణి, స్వరరంజని సంస్థ అధ్యక్షురాలు జవ్వాది లక్ష్మి(54) అదృశ్యమైన ఘటనతో పోలీసులు పరుగులు తీశారు. నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న నేర ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో అన్వేషించారు.  చివరికి ఆమె క్షేమంగా ఉన్నట్లు తేలింది. ఇంట్లో భర్తకు చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లినట్లు శనివారం రాత్రి 9.30 గంటలకు నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం ఓ యువతి విశాఖ తీరంలో సాగరంలో మునిగి గల్లంతయిందని భావించిన నావికాదళ బృందం ప్రత్యేకంగా హెలీకాప్టర్‌లతో గాలించింది. అయితే...ఆమె సముద్రంలో మునిగిపోలేదని, భర్తను మోసగించి బెంగళూరులో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో..పోలీసుల దర్యాప్తుతో జవ్వాది లక్ష్మి సంఘటన కూడా నగరంలో చర్చనీయాంశమయింది.

* విశాఖ ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయంలో శుక్రవారం రాత్రి జవ్వాది లక్ష్మిని ఓ సంస్థ ఘనంగా సన్మానించింది. కార్యక్రమం అనంతరం రాత్రి 8.45 గంటల సమయంలో మరో కళాకారిణి చంద్రకళతో కలిసి షేర్‌ ఆటోలో ఇంటికి బయలుదేరారు. చంద్రకళ ఆదర్శనగర్‌ కూడలిలో దిగిపోయారు. అనంతరం ఆటో మధురవాడ వైపు వెళ్లింది. కానీ లక్ష్మి ఇంటికి చేరలేదు. బీ శుక్రవారం సాయంత్రం బయటకు వచ్చే సమయంలో భర్త వేణుగోపాల్‌ ఇంట్లో లేకపోవడంతో ఆయన సెల్‌కు ఆమె వాట్సప్‌లో మాటల సందేశం పంపారు. మరో మహిళతో కలిసి ఆటోలో వెళ్తున్నానని, 9.30గంటలకల్లా వచ్చేస్తానని అందులో పేర్కొన్నారు. ఆమె వస్తుందన్న ఉద్దేశంతో భర్త తలుపులకు గడియ కూడా పెట్టలేదు. ఆమె కోసం ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు మెలకువ వచ్చి ఇంట్లో చూడగా భార్య కనపడకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడు సాయిరాం సాగర్‌కు, స్వరరంజని సభ్యులకు ఫోన్‌ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి వెళ్లిన తరువాత తమతో మాట్లాడలేదని చెప్పారు. ఆమెతో ప్రయాణించిన చంద్రకళతో మాట్లాడగా ఆదర్శనగర్లో తాను దిగిపోయానని చెప్పారు. లక్ష్మి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండడంతో ఎవరైనా కిడ్నాప్‌ చేశారేమోనన్న అనుమానంతో వేణుగోపాల్‌ శనివారం ఉదయం పి.ఎం.పాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీపీ శ్రీకాంత్‌ పోలీసు అధికారులందరితో సమావేశం ఏర్పాటుచేశారు. నగరంలోని పలు నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ప్రయాణించిన ఆటోను గుర్తించినా దానిపై రిజిస్ట్రేషన్‌ నెంబరు కనపడలేదు. ఇతర మార్గాల్లో ఆమె ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పి.ఎం.పాలెం సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో గాలించారు.
రాత్రి 9.30గంటలకు ఫోన్‌: లక్ష్మి  కనిపించడం లేదన్న విషయాన్ని వేణుగోపాల్‌ హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడికి తెలియజేశారు. దీంతో అతను విశాఖకు బయలుదేరారు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో విజయవాడ వచ్చేసరికి.. లక్ష్మి హైదరాబాద్‌లోని కుమారునికి ఇంటికి వచ్చినట్లు సమాచారం అందింది. ఆమె క్షేమంగా ఉందని తెలియడంతో పోలీసులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో భర్తకు చెప్పకుండా...కుమారునికి కూడా ముందుగా చెప్పకుండా హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


శుక్రవారం రాత్రి సన్మానం అందుకున్న జవ్వాది లక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు