Satya Kumar: ఇంత పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు: సత్యకుమార్‌

అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

Updated : 25 Sep 2022 13:58 IST

విశాఖపట్నం: అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్‌ చెప్పేవన్నీ అసత్యాలేనని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘ఎన్టీఆర్ వర్సిటీ పేరు మారుస్తూ కొత్త నాటకం ఆడుతున్నారు. ఇంత పేర్ల పిచ్చి పార్టీని నేనెక్కడా చూడలేదు. పుట్టబోయే బిడ్డ పేరు కూడా మార్చాలని చెబుతారేమో. అభివృద్ధి అంటే పేర్లు.. ఊర్లు మార్చడమేనా?అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతమవుతోంది. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే వైకాపా నాటకాలు ఆడుతోంది. పాదయాత్రకు భాజపా సంఘీభావం తెలిపింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ మాది. పాదయాత్రలో రైతులపై దాడికి కుట్ర చేస్తే భాజపా గట్టిగా ఎదుర్కొంటుంది. 

ఈ మూడున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో వైకాపా నేతలు చెప్పాలి. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? కొత్తవి రాకపోగా.. జూట్‌ మిల్లు, షుగర్‌ ఫ్యాక్టరీని కూడా మూసివేయించారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. మూడున్నరేళ్లు దోచుకున్నారు.. ఇకనైనా దోపిడీ ఆపండి’’ అని సత్యకుమార్‌ మండిపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని