logo

కీలక తరుణంలో కరుణేది?

రాష్ట్రంలో ఐటీకి అత్యంత అనుకూలమైన నగరంగా విశాఖకు  గుర్తింపు ఉంది. తక్కువ వ్యయాల నేపథ్యంలో దిగ్గజ సంస్థలు కూడా ప్రస్తుతం విశాఖ వంటి టైర్‌-2 నగరాలవైపు చూస్తున్నాయి.

Published : 26 Nov 2022 02:32 IST

కేంద్రం వద్దే పెండింగులో పలు ప్రతిపాదనలు

ఎదురు చూస్తున్న ఐటీ రంగ సంస్థలు

ఈనాడు, విశాఖపట్నం

విశాఖలో ఐ.టి. రంగ అభివృద్ధికి ఉన్న అడ్డంకులు ఎప్పుడు తొలగిపోతాయా అని ఎన్నో సంస్థలు ఎదురుచూస్తున్నాయి.

రాష్ట్రంలో ఐటీకి అత్యంత అనుకూలమైన నగరంగా విశాఖకు  గుర్తింపు ఉంది. తక్కువ వ్యయాల నేపథ్యంలో దిగ్గజ సంస్థలు కూడా ప్రస్తుతం విశాఖ వంటి టైర్‌-2 నగరాలవైపు చూస్తున్నాయి. పలు సౌకర్యాల కల్పన నిమిత్తం కేంద్రం దగ్గర పరిశీలనలో ఉన్న ప్రతిపాదనల్లో కొన్నింటిని ఆమోదించినా ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

ఐ.టి. సంస్థలను ప్రోత్సహించడానికి వీలుగా కేంద్రం ఐ.టి. ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌(ఐ.టి.ఐ.ఆర్‌.) పథకాన్ని ప్రవేశపెట్టింది. సంస్థల ఏర్పాటుకు వీలుగా నిర్ణీత ప్రాంతాన్ని ఇందులో అభివృద్ధి చేస్తారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కొంత పెట్టుబడి రాయితీ కూడా ఇస్తుంది. ఇక్కడే పర్యాటకం, ఆతిథ్యం, హౌసింగ్‌, విద్య తదితర రంగాల్లోని అంతర్జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు.  దీనిని విశాఖలో అమలు చేయాలని కోరుతున్నారు.

ఆ పథకంతో: దేశంలో బి.పి.ఒ. (బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌) సేవల్ని ప్రోత్సహించడానికి కేంద్రం ‘ఇండియా బి.పి.ఒ. ప్రమోషన్‌ స్కీం’ను కొద్దికాలం కిందటి వరకు కొనసాగింది. పథకంలో భాగంగా ప్రతి ఉద్యోగానికి కేంద్రం రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాన్ని సంస్థలకు అందించేది. విశాఖలోని ఐ.టి. సంస్థలు ఈ పథక ప్రయోజనాలను భారీగా దక్కించుకున్నాయి. దీంతో  బి.పి.ఒ. కేటగిరీలో విశాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పథకం నిలిపివేయడంతో ప్రతికూల వాతావరణం నెలకొంది. దీన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు.

సీడాక్‌ ఏదీ: ‘సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌’(సీడాక్‌) విశాఖలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. కంప్యూటర్‌ రంగ పరిశోధనలకు ఈ కేంద్రం అత్యంత కీలకం.అదీ కార్యాచరణలోకి రాలేదు. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ’ (నీలిట్‌) సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారు. సుశిక్షితులైన మానవ వనరులను సిద్ధం చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోర్సులు నిర్వహిస్తుంది. అదీ ఏర్పాటు కాలేదు. యానిమేషన్‌, గేమింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ తదితర విభాగాల ఎగుమతులకు కేంద్రం ఐదుశాతం రాయితీ ఇస్తోంది. వాటినీ రెండేళ్ల నుంచి ఇవ్వడంలేదు. ఆయా రాయితీలు వేగంగా చెల్లించాలంటున్నారు.


కేంద్ర ప్రాజెక్టులతో మహర్దశ

-ఒ.నరేశ్‌కుమార్‌, సీఈవో, సింబయాసిస్‌, విశాఖపట్నం

విశాఖలో ఐ.టి.రంగ అభివృద్ధికి అవసరమైన పలు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్టులపై ఆ మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందిస్తోంది. 5జీ, మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే సంస్థలకు ఎంతో మేలు.


ప్రోత్సాహకాలను కొనసాగించాలి

-ఆర్‌.ఎల్‌.నారాయణ, ఐట్యాప్‌ ప్రతినిధి, విశాఖపట్నం

బీపీవో రంగానికి కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవడంలో విశాఖలోని సంస్థలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో ప్రస్తుతం దేశంలోని దిగ్గజ సంస్థల చూపంతా విశాఖ వైపే ఉంది. కేంద్రం గతంలో ఈ రంగానికి ఇచ్చిన రాయితీలను మరికొంతకాలం కొనసాగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని