logo

లేని ఉద్యోగాలకు లక్షల వసూలు

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 31 మంది నుంచి సుమారు రూ. 56 లక్షలు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బలివాడ పద్మ, ఆమెకు సహకరించిన నిరంజన్‌, స్వరూపరాణి, దేవీరావు, నవీన్‌లకు రిమాండ్‌ విధించారు.

Published : 29 Nov 2022 03:29 IST

మధ్యవర్తులకు కమీషన్లు

రిమాండ్‌కు నిందితులు

రిమాండ్‌కు తరలించిన నిందితులు బలివాడ పద్మ, తదితరులు

విశాలాక్షినగర్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని 31 మంది నుంచి సుమారు రూ. 56 లక్షలు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న బలివాడ పద్మ, ఆమెకు సహకరించిన నిరంజన్‌, స్వరూపరాణి, దేవీరావు, నవీన్‌లకు రిమాండ్‌ విధించారు. ఆరిలోవ సీఐ ఇమ్మానుయేల్‌రాజు తెలిపిన వివరాలు ఇవి. ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రాంతానికి చెందిన బలివాడ పద్మ తన భర్త ఉమామహేశ్వరరావు అమరావతిలోని సెక్రటేరియట్‌లో ఉన్నత ఉద్యోగని.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాడని గుడ్ల స్వరూపారాణికి చెప్పింది. ఆమె తనకు తెలిసిన ఆరిలోవకు చెందిన సిరిపురపు జాన్‌ నిరంజన్‌ అనే పాస్టర్‌కు ఈ విషయం చెప్పింది. ఉద్యోగాల కోసం ఎవరినైనా తీసుకువస్తే ఒక్కో ఉద్యోగానికి రూ. 25 వేలు కమీషన్‌ ఇస్తామంది. దీంతో నిరంజన్‌ తన బంధువులు, స్నేహితులకు చెప్పి 25 మందితో రూ. 50 లక్షల వరకు వసూలు చేసి పద్మకు ఇచ్చాడు. అలాగే తగరపువలసకు చెందిన ఈతా గీతారావుకు కూడా స్వరూపరాణి ఇదే విషయం చెప్పి 14 మందితో రూ. రెండు లక్షల చొప్పున కట్టించి పద్మకు ఇవ్వగా ఆమెకు కూడా కమీషన్‌ దక్కింది. ఆరునెలలు అవుతున్నా ఉద్యోగాలు గానీ, కట్టిన డబ్బులు గానీ ఇవ్వక పోవటంతో బాధితులు నిలదీసి ఆరిలోవ పోలీసుల్ని ఆశ్రయించారు. తన దగ్గర ఇపుడు డబ్బులు లేవని.. ఆరునెలల్లో తీర్చేస్తానని పద్మ చెప్పి గొడవ సద్దుమణిగేలా చేసింది. ఆరునెలలు గడిచినా ఇవ్వకపోవటంతో పద్మను బాధితుల్లో ఒకరైన అన్సార్‌ వలి ఆమె నివాసానికి వెళ్లి నిలదీశాడు. అయితే తన వద్ద డబ్బులేదని కావాలంటే కారు తీసుకొని వెళ్లమని పద్మ చెప్పడంతో కారు తీసుకొని వచ్చి పెదగదిలికి చెందిన వైకాపా నాయకుడు దూళి రఘు వద్ద ఉంచాడు. ఆ కారు దూళి రఘు పన్నెండో వార్డు వైకాపా కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణికి ఇచ్చాడు.వలి తాను తెచ్చిన కారు ఏదని రఘును ప్రశ్నించగా.. అవసరమని చెపితే కార్పొరేటర్‌ రోహిణికి ఇచ్చానన్నారు. వలి రోహిణిని అడగ్గా.. అప్పటికే తాను ఆ కారు రఘుకు ఇచ్చేశానని చెప్పారు. ఇదేదో తేలని పంచాయతీలా ఉందని భావించిన వలి మిగిలిన బాధితులతో కలిసి ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. దీంతో డబ్బులు వసూలు చేసిన బలివాడ పద్మ, ఆమెకు సహకరించిన నిరంజన్‌, స్వరూపరాణి, దేవీ రావు, నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు తయారుచేసిన జిరాక్స్‌ సెంటర్‌ నిర్వాహకుడు నవీన్‌ను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. పంచాయతీ నిర్వహించి అసభ్యపదజాలంతో దూషించాడనే ఫిర్యాదు మేరకు దూళి రఘును అరెస్టు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చామని సీఐ తెలిపారు. అయితే ఈ వివాదాన్ని సెటిల్‌ చేయటంలో దూళి రఘు, కార్పొరేటర్‌ అక్కరమాని రోహిణి మధ్య ఆధిపత్య పోరు రావటంతోనే వివాదం పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లిందనే ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని