logo

పట్టాలెక్కాం.. ఇక పరుగెడతాం...

పెదవాల్తేరు కరోనా ప్రభావం అన్ని రంగాలు.. సంస్థల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఈ జాబితాలో గిరిజన సహకార సంస్థ కూడా ఉంది. ఒకప్పుడు రూ. కోట్లలో వచ్చే ఆదాయం కరోనా సమయంలో దారుణంగా పడిపోయింది.

Published : 30 Nov 2022 03:21 IST

జీసీసీ ఆదాయం పెరుగుతోంది
‘న్యూస్‌టుడే’తో ఎండీ సురేష్‌కుమార్‌

న్యూస్‌టుడే, పెదవాల్తేరు కరోనా ప్రభావం అన్ని రంగాలు.. సంస్థల మీద తీవ్ర ప్రభావం చూపింది. ఈ జాబితాలో గిరిజన సహకార సంస్థ కూడా ఉంది. ఒకప్పుడు రూ. కోట్లలో వచ్చే ఆదాయం కరోనా సమయంలో దారుణంగా పడిపోయింది. సేకరణ, విక్రయాలు చాలాకాలం స్తంభించాయి. అన్ని సంస్థలు తిరిగి కోలుకుంటున్నట్లే ఈ సంస్థ కూడా మళ్లీ పట్టాలెక్కింది. ఆ వివరాలను  సంస్థ ఎండీ సురేష్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు.

రూ. కోట్ల నుంచి రూ. లక్షలకు: జీసీసీ ఆదాయం నెలకు సుమారు రూ. 2 కోట్లు ఉండేది. కరోనా మొదలయ్యాక అది రూ. లక్షలకు పడిపోయింది. పరిస్థితులు మెరుగుపడ్డాక క్రమంగా సేకరణ.. విక్రయాలు పెరిగేలా కార్యాచరణ వేగవంతం చేశాం. ఈ ఏడాది మే నెలలో జీసీసీ ఆదాయం రూ.46 లక్షలు. జూన్‌లో రూ.53 లక్షలు, జులైలో రూ.64 లక్షలు, ఆగస్టులో రూ.1.24 కోట్లు, సెప్టెంబర్‌-అక్టోబర్‌లో రూ.1.70 కోట్లు వచ్చింది. ఇన్‌స్టెంట్‌ కాఫీ అందుబాటులోకి వస్తే రూ.2 కోట్లు దాటేస్తాం.

త్వరలో ఇన్‌స్టెంట్‌ కాఫీ: రెండున్నరేళ్లుగా అందుబాటులో లేని ఇన్‌స్టెంట్‌ కాఫీని మళ్లీ తీసుకువస్తున్నాం. ప్రస్తుతం అరకు రైతుల వద్ద 30 టన్నుల కాఫీకి సంబంధించిన ముడి సరకు కొనుగోలు చేశాం. సేకరించిన కాఫీ విత్తనాలను పౌడర్‌ చేసే బాధ్యత ఏలూరులో ఓ సంస్థకు అప్పగించాం. డిసెంబర్‌ 15 నాటికి ఈ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది.

పెట్రోలు బంకు తెరుస్తాం: జీసీసీ ఆధ్వర్యంలో 14 పెట్రోలు బంకులు నడుస్తున్నాయి. కొన్ని కారణాలతో రంపచోడవరం, అడ్డతీగల ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు మూతపడ్డాయి. త్వరలో రంపచోడవరం పెట్రోలు బంకును తిరిగి తెరుస్తాం.

డిస్ట్రిబ్యూషన్లు ఇస్తాం: జీసీసీ తరఫున నగరంలో మూడు ఔట్‌లెట్లు ఉన్నాయి. సిరిపురం, ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఔట్‌లెట్‌ నష్టాల్లో ఉంది. త్వరలో తొలగిస్తాం. ఎవరైనా ఔట్‌లెట్‌ తీసుకుంటామంటే ఇస్తాం. ఆన్‌లైన్‌ ఆదాయం పెరిగింది: గిరిజన సహకార సంస్థ అందిస్తున్న ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో ఆన్‌లైన్‌లో నెలకు రూ. 30 వేల విక్రయాలు మాత్రమే జరిగేవి. ప్రస్తుతం రూ. లక్ష వరకు పెరిగాయి. తేనె మార్కెట్లోకి వచ్చిన తరువాత ఆదాయం పెరిగింది. ఎ.పి.గిరిజన్‌ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా జీసీసీ ఉత్పత్తులు తెప్పించుకోవచ్చు. కొన్ని రోజులు సర్వర్‌ సరిగా లేక ఆన్‌లైన్‌ సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం తిరిగి పనిచేస్తోంది.

ఆ ఉత్పత్తులు కూడా కొంటాం: రాజ్‌మా, పసుపు కొంతకాలంగా కొనుగోలు చేయడం లేదని పలువురు నాయకులు మా దృష్టికి తెచ్చారు. అయితే వాటిని కూడా కొనుగోలు చేయాలని మా సిబ్బందిని ఆదేశించాం.

సిబ్బంది కొరత వాస్తవమే: గిరిజన సహకార సంస్థలో 1,000 మంది అవసరం. 250 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. ఈ కొరతను అధిగమించడానికి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు లేఖ రాశాం. వారు భర్తీ చేసినా సంతోషమే. మాకు అనుమతులు ఇచ్చినా భర్తీ చేసుకుంటాం.

సురేష్‌ కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు