logo

పిలుస్తోంది.. పోలీసు కొలువు!

పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించడం ఎందరో కల. ఆ అవకాశం యువతకు మరోసారి ఎదురొచ్చింది.సత్తాచాటితే కొలువు చేజిక్కినట్లే.

Published : 30 Nov 2022 03:21 IST

ఎంవీపీకాలనీ, న్యూస్‌టుడే: పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించడం ఎందరో కల. ఆ అవకాశం యువతకు మరోసారి ఎదురొచ్చింది. సత్తాచాటితే కొలువు చేజిక్కినట్లే. ప్రణాళికాయుతంగా సాధన చేస్తే విజయతీరాలకు చేరుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

పోలీసు శాఖలో వేలాది ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఆశావహులు తమ సన్నద్ధతను వేగవంతం చేస్తున్నారు. ఈసారి పోటీ భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఎస్‌.ఐ., కానిస్టేబుల్‌ పోస్టులకు ఒకేసారి భర్తీ నోటిఫికేషన్‌ విడుదల చేయటంతో రెండింటికి   సన్నద్ధమయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు. అత్యధికులు రెండు విభాగాల్లోను పోటీ పడే అవకాశాలున్నాయి.

మెలకువలు తెలుసుకొని: ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఈవెంట్స్‌ (లాంగ్‌జంప్‌, పరుగు) ఉంటాయి. ఇక్కడి విజేతలకు మెయిన్స్‌ నిర్వహిస్తారు. సివిల్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్‌ఐలకు  ఫిబ్రవరిలో, కానిస్టేబుళ్లకు జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. రెండు, మూడు నెలలే సమయం ఉంది. ఎలాగైనా విజేతలవ్వాలనుకునే వారు ఇటు ప్రిలిమ్స్‌, అటు మెయిన్స్‌కు ఒకేసారి సిద్ధం కావాలి. క్రమం తప్పకుండా పరుగు, వ్యాయామం, నడక సాధన చేయాలి. నిత్యం పరుగెత్తే వేగం, దూరం పెంచుకుంటూ సమయాన్ని పరిశీలించుకోవాలి సాధనలో మెలకువలు తెలుసుకునేందుకు నిపుణులను సంప్రదించాలి.

పట్టున్న అంశాల్లో ఎక్కువగా:

మయం తక్కువుగా ఉంది. రాత పరీక్షకు సంబంధించి పట్టున్న అంశాల్లో ఎక్కువ మార్కులు సాధించటానికి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా అర్థమెటిక్‌, రీజనింగ్‌లపై ఎక్కువ సాధన చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ మార్కులకు అవకాశం ఉంటుంది. గణితంపై పట్టు సాధించాలి.

కె.శంకరరావు, ఎస్‌.ఐ.(టాస్క్‌ఫోర్స్‌)

బృంద చర్చలతో ప్రయోజనం..

ముందుగా సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. చాలా మంది ఈవెంట్స్‌ తరువాత మెయిన్స్‌కు చదువుదామని అనుకుంటారు. అలా కాకుండా ముందు నుంచి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు సన్నద్ధమవ్వాలి. ఈవెంట్స్‌ పూర్తయ్యే సరికి రివిజన్‌ పూర్తి చేయాలి. సాధ్యమైనంత ఎక్కువ సార్లు సిలబస్‌ పునశ్చరణ సాగాలి. ఒక్కరే కాకుండా బృందంగా సన్నద్ధమవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఈవెంట్స్‌ నిమిత్తం నిత్యం ఉదయం దాదాపు రెండు గంటల సమయం కేటాయించాలి. మిగిలిన సమయంలో రాత పరీక్షకు సిద్ధం కావాలి. అర్థమెటిక్‌, రీజనింగ్‌లపై ఎక్కువగా దృష్టికేంద్రీకరించాలి.

కె.భాస్కరరావు, ఎస్‌.ఐ. (గాజువాక)


పొరపాట్లకు తావివ్వకూడదు..

పోలీసు పరీక్షలకు సంబంధించి సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను గుర్తించాలి. గణితంతో పాటు జీకేకు  ప్రాధాన్యం ఇవ్వాలి. మెయిన్స్‌లో తెలుగు, ఆంగ్లం పరీక్షలు ఉంటాయి. చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తారు. తెలిసిన మాధ్యమమే కదా అనే ధీమా  వ్యక్తం చేస్తుంటారు. ఏ మాత్రం అతివిశ్వాసం వద్దు. పొరపాట్లకు తావివ్వకుండా వీటిపైనా దృష్టిసారించాలి.  అర్థమెటిక్‌, రీజనింగ్‌లలో ఎంత సాధన చేస్తే అంత మంచిది. గతంలో పోలిస్తే ఈవెంట్స్‌కు భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా సాధన చేసినా విజయం సాధించవచ్చు. 5 కి.మి. సాధన ద్వారా ఈ పరీక్షకు పేర్కొన్న నిర్ణీత దూరం విజయవంతంగా అధిగమించొచ్చు. ఈవెంట్స్‌ ఏ క్షణమైనా  నిర్వహించొచ్చు అనుకొని సాధన చేయాలి.  

లక్ష్మీ, ఎస్‌.ఐ.


విశాఖ జిల్లాలో దాదాపు 187 మంది కానిస్టేబుల్‌ పోస్టులు భర్తీ చేయొచ్చని సమాచారం. అలాగే జోన్‌ పరిధిలో దాదాపు 50 ఎస్‌ఐ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని