ఆ నలుగురు... అనంత లోకాలకు!

ఓ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. తమ తమ వృత్తుల్లో రాణిస్తున్న  నలుగురిని బలితీసుకుంది.

Updated : 02 Dec 2022 06:43 IST

విశాఖ వాసులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
ఒడిశాలో దుర్ఘటన


మరియాఖాన్‌  కబీర్‌  రాకేష్‌కుమార్‌  లక్ష్మీ

ఎం.వి.పి.కాలనీ, ఎండాడ, పెదవాల్తేరు, విశాలాక్షినగర్‌, కటక్‌, న్యూస్‌టుడే: ఓ ప్రమాదం అంతులేని విషాదం నింపింది. తమ తమ వృత్తుల్లో రాణిస్తున్న  నలుగురిని బలితీసుకుంది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో 16 నెంబర్‌ జాతీయ రహదారిపై జంకియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బోడోపోకోరి గ్రామం వద్ద గురువారం వేకువ జామున జరిగిన  రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరందరూ విశాఖపట్నం వాసులు.

ప్రమాదానికి గురైన కారు

మరమ్మతులకు గురైన ఒక లారీని రోడ్డు పక్కన ఆపి ఉంచారు. వేగంగా వచ్చిన వీరి కారు... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖుర్దా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతిచెందిన వారిలో విశాఖ నగరం ఎండాడకు చెందిన బ్యుటీషియన్‌ మరియాఖాన్‌   (24), విశాలాక్షినగర్‌కు చెందిన స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ రాకేష్‌కుమార్‌ అలియాస్‌ రాఖీ (35), ఎండాడకు చెందిన ఫొటోగ్రాఫర్‌ కబీర్‌ (28), మరియాఖాన్‌ సహాయకురాలు లక్ష్మీ (28) ఉన్నారు. పూరీలో జరగనున్న పెళ్లిలో పాల్గొనేందుకు వీరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మంచు కురుస్తుండడంతో రోడ్డు సరిగా కనిపించకపోవడం, కారు వేగంగా నడపడం ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

పేరున్న బ్యుటీషియన్‌గా: ఈ నలుగురిలో మరియాఖాన్‌ పేరున్న బ్యుటీషియన్‌. ప్రముఖ ఈవెంట్స్‌లో మేకప్‌ కాంట్రాక్టులు తీసుకుంటుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగే వేడుకలకూ వెళ్తుంటుంది. ఈమె కుటుంబం విశాఖ బీచ్‌రోడ్డులోని పాండురంగాపురంలో ఉంటుంది. మరియాఖాన్‌ మాత్రం ఎండాడలోని బహుళ అంతస్తుల భవనం ఎం.కె.గోల్డ్‌ కోస్ట్‌లో ఉంటోంది. పాండురంగాపురంలో కూడా ఓ బ్యూటీపార్లర్‌ నడుపుతున్నట్లు సమాచారం. బ్యుటీషియన్‌ కోర్సులో శిక్షణ కూడా ఇస్తుంది. తండ్రి మన్సూర్‌ఖాన్‌ స్థానికంగా వ్యాపారం చేస్తుంటారు. ఫొటోగ్రాఫర్‌ కబీర్‌ ఆఫ్ఘనిస్తాన్‌కు చెందినవాడు. ఏయూలోనే చదువుకొని ఇక్కడే ఉంటున్నారు. ఫొటోలు తీయటం అలవాటుగా చేసుకొని ఈవెంట్స్‌లో వీరితో కలిసి వెళ్తుంటాడు. ఇతను కూడా ఎండాడలోని ఎం.కె.గోల్డ్‌ కోస్ట్‌లో ఉంటున్నాడు.

అతనే ఆధారం:  విశాలాక్షినగర్‌ బీవీకే కళాశాల ఎదురుగా ఓ అపార్టుమెంట్‌లో తల్లి మీనాకుమారి(60)తో కలిసి రాకేష్‌కుమార్‌ నివాసం ఉంటున్నారు. తండ్రి లేరు. అక్కకు వివాహం అయింది.  కుటుంబానికి ఇతనే ఆధారం. డిగ్రీ వరకు చదువుకున్న రాకేష్‌ హెచ్‌ఎస్‌బీసీ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్నాడు. ఫొటోగ్రఫీ హాబీ కావటంతో నగరంలో పలువురు స్నేహితులతో కలిసి ఈవెంట్‌లకు వెళ్తుంటాడు. తనకు పరిచయం ఉన్న మరియా ఖాన్‌, కబీర్‌, లక్ష్మీలతో కలిసి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం స్వామి మాలలో ఉన్నారు.

* ఈ ప్రమాదంలో మృతిచెందిన లక్ష్మీ స్వగ్రామం ఎస్‌.కోట మండలం పోతనాపల్లి. భర్త పూర్ణామార్కెట్‌లో ప్లాస్టిక్‌ హోల్‌సేల్‌ దుకాణం నడుపుతున్నాడు. ప్రస్తుతం కారుషెడ్డు దగ్గర నివాసం ఉంటున్నారు. కూతురు ఎంసెట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటుండగా, కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు