logo

కుట్టించుకునే వారున్నా పట్టించుకునే వారేరి!

మహిళలకు కుట్టు నేర్పడం, దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దశాబ్దం క్రితం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ సెంటర్లను నెలకొల్పారు.

Updated : 28 Jan 2023 04:23 IST

కనుమరుగైన శిక్షణా కేంద్రాలు
ఖరీదైన మిషన్లకు తుప్పు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, చోడవరం

చోడవరంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ కేంద్రం దుస్థితి

మహిళలకు కుట్టు నేర్పడం, దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దశాబ్దం క్రితం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ టెక్నాలజీ సెంటర్లను నెలకొల్పారు. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 80 వరకు అధునాతన కుట్టుమిషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక మహిళలకు తర్ఫీదు ఇవ్వడానికి నైపుణ్యమున్న శిక్షకులను నియమించారు. దీనికోసం ఒక్కో సెంటర్‌పై రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుచేశారు. కొన్నాళ్లు బాగానే నిర్వహించారు. ఇక్కడ శిక్షణ పొందినవారిలో కొందరు బ్రాండిక్స్‌ వంటి చోట్ల ఉపాధి పొందారు. తర్వాత కాలంలో వీటి నిర్వహణ గాడితప్పింది.
ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టేశారు. వారు కూడా వీటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పదిచోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఒకటి మాత్రమే మనుగడలో ఉంది. మిగతావన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం కె.కోటపాడులో ఓ ప్రైవేటు సంస్థ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా సుమారు 50 నుంచి 70 మంది ఉపాధి పొందుతున్నారు. ఉచిత పథకాలపై పెట్టిన ఖర్చు మూతపడిన ఫ్యాషన్‌ టెక్నాలజీ సెంటర్ల పునరుద్ధరణకు ఉపయోగిస్తే వందల మందికి ఉపాధి చూపించడానికి అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలంటున్నాయి.

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఉండే ఫ్యాషన్‌ టెక్నాలజీ కేంద్రం మూతపడింది. ఆ భవనంలోనే ఇప్పుడు డీఆర్‌డీఏ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇక్కడ కేంద్రాన్ని ఒప్పంద ప్రాతిపదికన ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. అతని వద్ద 60 కుట్టు మిషన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వ్యక్తి కేంద్రం ఎక్కడా పెట్టలేదు.

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పేటలో మహిళలకు కుట్టుమిషన్‌, దుస్తుల తయారీ శిక్షణకు ఏర్పాటు చేసి కేంద్రం దాదాపు ఐదేళ్లుగా మూతపడి ఉంది. గతంలో ఇక్కడ సుమారు 50 మందికి పైగా మహిళలకు శిక్షణ తీసుకుని ఉపాధి పొందారు. అప్పట్లో శిక్షణ పొందిన మహిళలు కుట్టిన దుస్తులు హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ వంటి నగరాలకు ఎగుమతయ్యేవి. నిధులు కేటాయింపు లేకపోవడం, నిర్వహణ గాలికి వదిలేయడంతో దీన్ని మూసివేశారు. ఈ భవనంలో విలువైన కుట్టు మిషన్లు, కట్టింగ్‌ యంత్రాలు, ఇతర సామగ్రి నిరుపయోగంగా ఉన్నాయి.

పేటలో మూతపడిన మహిళల శిక్షణ కేంద్రం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి పట్టణంలో 35 అధునాతన కుట్టుమిషన్లతో ఫ్యాషన్‌ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేవారు. తర్వాత వీటిని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, వారి నుంచి అద్దె వసూలు చేయడం ప్రారంభించారు. వీరు కూడా కొద్ది రోజులు బాగా నడిపారు. గతంలో ప్రభుత్వ పాఠశాల ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యత వీరికి అప్పగించేవారు. కరోనా కారణంగా ఇవి మూతపడ్డాయి. కొవిడ్‌లో మూతపడిన కాలానికి అద్దె మాఫీ చేయమని వీరు కోరినా అధికారులు స్పదించలేదు. లీజుదారులు అద్దె చెల్లించలేదని డీఆర్‌డీఏ వాళ్లు తాళం వేశారు.

కేంద్రాల దుస్థితి ఇదీ..

కోటవురట్ల, న్యూస్‌టుడే : కోటవురట్లలో దశాబ్దం కిందట ఫ్యాషన్‌ టెక్నాలజీ కేంద్రాన్ని పౌర సరఫరాల గిడ్డంగి గోదాములో ఏర్పాటు చేశారు. రెండేళ్ల పాటు వెలుగు అధికారులు మహిళలకు శిక్షణ ఇప్పించి బ్రాండిక్స్‌ వంటి కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించారు. తర్వాత నిధులు లేక, పని చేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకలేక మూసేశారు. దీంతో మహిళలు ఉపాధికి దూరమవడంతోపాటు 80 కుట్టు మిషన్లు తుప్పుపట్టి పాడైపోతున్నాయి.

వినియోగంలోకి తెస్తాం..

కొవిడ్‌ కారణంగా ఫ్యాషన్‌ టెక్నాలజీ కేంద్రాల నిర్వహణ దెబ్బతింది. ప్రైవేటు ఏజెన్సీలకు నష్టాలు రావడంతో వాటిని తెరవడం లేదు. అలాంటి వాటిని మరలా వినియోగంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. కోటవురట్ల కేంద్రంలో మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయడానికి పరిశీలిస్తున్నాం. అనకాపల్లి శిక్షణా కేంద్రం త్వరలో ఏర్పాటు జరుగుతుంది.

రమేష్‌కుమార్‌, ఏపీడీ, డీఆర్‌డీఏ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని