logo

కొలువులు వదిలి కోరుకున్న జీవితం

మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట.

Updated : 29 Jan 2023 05:33 IST

సహజ ఎరువుల తయారీలో యువజంట

సేంద్రియఎరువుల తయారీ కేంద్రం వద్ద అనిత

ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, చోడవరం పట్టణం: మనసుకు నచ్చని కొలువు చేయడం కంటే ఇష్టమైన రంగంలో చక్కని ప్రణాళికలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు రాబట్టవచ్చు అంటున్నారీ యువ జంట. తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు. సేంద్రియ ఎరువుల తయారీ చేపట్టి కొత్త ఉపాధికి తాము బాటలు వేసుకున్నారు. తమతో పాటు మరో పది మందికి పని కల్పిస్తున్నారు. వారే అనకాపల్లికి చెందిన రావూరి అనిత, జయచంద్ర.

వ్యవసాయంలో మితిమీరిన రసాయన ఎరువుల వాడకం భూసారాన్ని దెబ్బతీస్తోంది. ప్రజల ఆరోగ్యంపైనా ప్రభావాన్ని చూపుతోంది. వీటి స్థానంలో సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే సేంద్రియ పంటలు పండించే రైతుల సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అనిత, జయచంద్ర సహజ ఎరువుల తయారీకి పూనుకున్నారు. తక్కువ పెట్టుబడితో వ్యర్థాలను ముడి పదార్థాలుగా చేసుకుని ఎరువుల ఉత్పత్తి మొదలుపెట్టి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వీటి వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా పలు ప్రదర్శనల్లోను పాల్గొంటున్నారు.

చిన్నచిన్న పొట్లాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన సేంద్రియ ఎరువు

కరణం జయచంద్ర బయో టెక్నాలజీలో పీహెచ్‌డీ చేశారు. అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో చెరకు పరిశోధన విభాగంలో పదేళ్లు పనిచేశారు. ఆయన భార్య అనితా ఎం.ఫార్మసీ పూర్తిచేసి హైదరాబాదులోని జీవీకే సంస్థలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. సేంద్రియ ఎరువుల తయారీపై ఉన్న మక్కువతో సొంతగా ఓ యూనిట్‌ ప్రారంభించాలనుకున్నారు. దాంతో చేస్తున్న కొలువులకు స్వస్తి చెప్పి వారికి నచ్చిన రంగంలోకి అడుగుపెట్టారు. ఎరువుల తయారీకి కావాల్సిన షెడ్‌ను అనకాపల్లి లక్ష్మీదేవిపేటలో నిర్మించారు. పాడి బాగుంటే పంటలు లాభదాయకంగా పండించొచ్చని అనుకున్నారు. దీనికోసం ముందుగా పశువుల పెంపకాన్ని ప్రారంభించారు. వాటి మూత్రం, పేడ, కొబ్బరి పీచు కలిపి వర్మీ కంపోస్టు, కోకోఫిట్‌ వంటి ఎరువుల తయారీ మొదలుపెట్టారు. సొంతగా ఓ నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో పూర్తిగా సేంద్రియ ఎరువులతోనే మొక్కలను పెంచి విక్రయిస్తున్నారు.


రైతులకు  అవగాహన కల్పిస్తూ..

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నా ఆచరించే రైతులు తక్కువగానే ఉంటున్నారు. దీంతో ఈ యువ జంట కూడా సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించి వారిని అటువైపుగా మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బయట కొనుక్కోవల్సిన అవసరం లేకుండా సొంతంగా సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవచ్చో అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ రకాల పంటలను సాగుచేయడం, అంతర పంటల సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నారు. రైతులను తమ క్షేత్రాలకు తీసుకువచ్చి సహజ ఎరువులతో పండే పంటలను చూపించి ప్రోత్సహిస్తున్నారు.


భవిష్యత్తు అంతా సేంద్రియమే..

భవిష్యత్తు తరాలకు మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడానికి సేంద్రియ వ్యవసాయమే ఏకైక మార్గం. ఇప్పటికే సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన రైతులతో కొన్ని సంస్థలు ఒప్పందం చేసుకొని వారికి గిట్టుబాటు ధర చెల్లించి పూర్తి పంటలను కొనుగోలు చేస్తున్నాయి. సేంద్రియ పంటలు పండాలంటే సహజసిద్ధమైన ఎరువులు అవసరం అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాం.

జయచంద్ర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని