logo

Andhra News: చదువుల తల్లిని చిదిమేసిన పేదరికం.. ఫీజులు కట్టలేక బాలిక ఆత్మహత్య

‘అమ్మా.. నేను బీఎస్సీ నర్సింగ్‌ చదివి మన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాన’ని ఆ చదువుల తల్లి ధైర్యంగా చెప్పేది.

Updated : 29 Jan 2023 12:12 IST

ధనలక్ష్మి పాతచిత్రం

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ‘అమ్మా.. నేను బీఎస్సీ నర్సింగ్‌ చదివి మన కుటుంబాన్ని పేదరికం నుంచి బయటకు తీసుకొస్తాన’ని ఆ చదువుల తల్లి ధైర్యంగా చెప్పేది. ఆర్థికంగా అవకాశం లేకపోయినా ఆ పేద తల్లిదండ్రులు అచ్యుతాపురంలోని ఓ కశాశాలలో చేర్పించారు. అయితే ఫీజులు కట్టలేక చదువు మానేయాలని ఒత్తిడి చేయడంతో జీవితంపై ఆశలొదులుకున్న బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం మళ్లవరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అచ్యుతాపురం సీఐ మురళీరావు, ఎస్సై సన్యాసినాయుడు వివరించారు.

అచ్యుతాపురం మండలం మళ్లవరానికి చెందిన కర్రి రమణ, సన్యాసమ్మ దంపతులకు కర్రి ధనలక్ష్మి (16), కర్రి శ్రీను అనే 13 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ధనలక్ష్మి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. తల్లిదండ్రులను ఒప్పించి అచ్యుతాపురంలోని నర్సింగ్‌ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్లూ కోర్సులో చేరింది. పేదరికంతో ఫీజులు చెల్లించలేమని తల్లిదండ్రులు భయపడినా బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేసి కుటుంబ కష్టాలను తీర్చుతానని తల్లిదండ్రులను ఒప్పించి ఈ బాలిక చదువు ప్రారంభించింది. ఈ బాలిక చదువుకు విధి ఫీజుల రూపంలో అడ్డు తగిలింది. రోజువారీ కూలీపనులపై జీవితాన్ని నెట్టుకొస్తున్న పేద దంపతులు కళాశాలకు ఫీజులు చెల్లించలేమని, చదువు మానేయాలని గట్టిగా చెప్పారు. దీంతో ధనలక్ష్మి చదువులేని జీవితం వృథా అనుకొంది.

ఈనెల 26న తల్లిదండ్రులు కూలీపనుల కోసం పక్క గ్రామానికి వెళ్లిన తరువాత చీమలమందు తాగింది. తమ్ముడు శ్రీను చూసి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు లబోదిబోమంటూ ఇంటికొచ్చి కొనఊపిరితో ఉన్న కుమార్తెను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించి బతికించుకునేందుకు యత్నించారు. బాలిక పరిస్థితి విషమంగా మారడంతో విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. పరిస్థితి విషమించి శనివారం ధనలక్ష్మి కన్నుమూసింది. చదువుల తల్లి మృతిచెందడంతో కళాశాలలోని తోటి విద్యార్థినులు, మళ్లవరం గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ‘ఫీజు కట్టలేక చేతులారా చంపేసుకున్నామా!’ అంటూ ఆ తల్లి సన్యాసమ్మ రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. అచ్యుతాపురం అదనపు ఎస్సై ప్రసాద్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని