logo

మాటల్లోనే...మెట్రో !

విశాఖ నగరంలో ‘మెట్రో రైలు ప్రాజెక్టు’ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ‘మెట్రో’ను పరుగులు పెట్టిస్తామని అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు చెప్పుకొస్తున్నా... ఇప్పటివరకు కేంద్రానికి ప్రతిపాదనలే అందకపోవడం గమనార్హం.

Updated : 04 Feb 2023 07:36 IST

 

కార్యాలయం ఏర్పాటుతో సరి!
కేంద్రానికి వెళ్లని ప్రతిపాదనలు

ఈనాడు, విశాఖపట్నం

విశాఖ నగరంలో ‘మెట్రో రైలు ప్రాజెక్టు’ ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. ‘మెట్రో’ను పరుగులు పెట్టిస్తామని అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు చెప్పుకొస్తున్నా... ఇప్పటివరకు కేంద్రానికి ప్రతిపాదనలే అందకపోవడం గమనార్హం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడలోని మెట్రో రైలు కార్యాలయాన్ని ఏకంగా విశాఖకు తరలించేశారు.

మొదటి దశ ప్రాజెక్టును 2020లో ప్రారంభించి 2024కు పూర్తి చేస్తామన్నారు. రెండో దశ పనులను 2023లో ఆరంభిస్తామని ఎక్కడికక్కడ ప్రచారం చేశారు. నగరం నలువైపులా మెట్రో కారిడార్‌ విస్తరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్ని చెప్పిన నేతలు ఇప్పటి వరకు ఒక్క అడుగైనా ముందుకు వేయలేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది.

ఎంపీలు అడగడంతో..

మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం ఏమైనా నిధుల సాయం అందిస్తుందా అని ఈ నెల 2న పార్లమెంటులో విశాఖ, అనకాపల్లి ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, వెంకట సత్యవతి లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు... మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిశోర్‌ సమాధానం ఇచ్చారు. అంటే మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం ఎంత నిర్లిప్తంగా ఉందో అనే విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను మెట్రో అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యంచేస్తూ వచ్చారు. తుది నిర్ణయం తీసుకొని కేంద్రం నుంచి నిధుల వచ్చేలా ఒత్తిడి చేయాలనే సూచనలు వస్తున్నాయి.్చ

ప్రభుత్వం మారాక కథ మొదటికి

గత ప్రభుత్వ హయాంలో డీపీఆర్‌ దాదాపుగా ఖరారైంది. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య(పీపీపీ) విధానంలో దీన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రణాళికతో రుణ సాయానికి విదేశీ బ్యాంకులు సిద్ధమయ్యాయి. టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం మారింది. పీపీపీ విధానంలో నిర్మించాలనుకున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఫైనాన్షియల్‌ బిడ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ కొత్త టెండరుకు వెళ్లాలని నిర్ణయించింది. అప్పట్లో ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చిన ఒకే ఒక్క బిడ్డరు ఎస్సెల్‌ ఇన్‌ఫ్రా అంగీకారాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దాంతో పాటు పాత డీపీఆర్‌ను రద్దు చేసింది. కొత్త డీపీఆర్‌ తయారీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మళ్లీ డీపీఆర్‌ తయారీ: వైకాపా పభుత్వం అధికారంలోకి వచ్చాక...విశాఖ మెట్రో కథ మొదటికి వచ్చినట్లయింది. మళ్లీ డీపీఆర్‌ తయారు చేసి...నిర్మాణ పనులకు టెండరుకు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం విస్తరించిన మార్గాలకు కలిపి డీపీఆర్‌ తయారు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం 42.5 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించగా.. దీన్ని ప్రస్తుత ప్రభుత్వం 140.13 కి.మీ.లకు చేర్చింది. 29 స్టేషన్లతో కొమ్మాది-స్టీలుప్లాంటు, ఏడు స్టేషన్లతో గురుద్వారా - పాతపోస్టాఫీసు, 9 స్టేషన్లతో తాటిచెట్లపాలెం-ఆర్‌కే బీచ్‌, 13 స్టేషన్లతో కొమ్మాది- భోగాపురం విమనాశ్రయం కారిడార్లను ప్రతిపాదించారు. డీపీఆర్‌ పరిశీలన పూర్తై, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే నాటికి ఎన్నేళ్లు అవుతుందో అనే చర్చ సాగుతోంది.

ట్రామ్‌ కారిడార్‌ డీపీఆర్‌ పరిశీలనకు కమిటీ

ఈనాడు, విశాఖపట్నం: వీఎంఆర్‌డీఏ పరిధిలో ప్రతిపాదిత ట్రామ్‌ కారిడార్‌ ప్రాంతానికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ముసాయిదా సిద్ధమైంది. అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌ (యూఎంటీసీ) తయారు చేసిన ముసాయిదాను పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరిశీలన అనంతరం మార్పులు, చేర్పులు చేసి తుది డీపీఆర్‌ను యూఎంటీసీ తయారు చేయనుంది. పురపాలక శాఖ మంత్రి ఛైర్మన్‌గా, పురపాలకశాఖ, ఆర్థికశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, విశాఖ జిల్లా కలెక్టరు, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కమిషనర్లు, విశాఖ ట్రాఫిక్‌ డీసీపీ, మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ కన్వీనర్లుగా ప్రభుత్వం కమిటీను ఇటీవల ఏర్పాటు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు