logo

ఏఎంసీకి 15 పీజీ సీట్ల మంజూరు

ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలోని నాలుగు విభాగాలకు కొత్తగా 15 పోస్టుగ్రాడ్యుయేట్‌ (పీజీ) సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌.ఎం.సి) ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 06 Feb 2023 04:45 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఆంధ్ర వైద్య కళాశాల పరిధిలోని నాలుగు విభాగాలకు కొత్తగా 15 పోస్టుగ్రాడ్యుయేట్‌ (పీజీ) సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌.ఎం.సి) ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాలలోని 26 విభాగాల్లో 131 పీజీ సీట్ల పెంపునకు వీలుగా వైద్య కళాశాల గతంలో ప్రతిపాదనలను కేంద్ర ఆరోగ్యశాఖ, ఎన్‌.ఎం.సి.కి పంపింది. ఈ క్రమంలో మూడు విభాగాలు మినహా 23 విభాగాల్లో వసతుల పరిశీలనకు గతంలో ఎన్‌.ఎం.సి. బృందం కళాశాలకు వచ్చింది. ఆయా తనిఖీ బృందాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా తొలి విడతగా నాలుగు విభాగాల పరిధిలో 15 సీట్ల పెంపునకు అనుమతులు మంజూరయ్యాయి. ఎనస్తీషియా విభాగానికి సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ అందజేశామని, ఆ సీట్లూ మంజూరవుతాయని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జి.బుచ్చిరాజు తెలిపారు. ఆర్థోపెడిక్‌ 4, రేడియాలజీ విభాగం 6, బయో కెమిస్ట్రీ 4, నెఫ్రాలజీ విభాగాలకు ఒకటి చొప్పున తొలి విడతలో పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఆయా సీట్లలో రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు కల్పించనున్నారు.

* ఏఎంసీలో పీజీ సీట్ల పెంపునకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.151 కోట్లు ఇటీవల మంజూరు చేశాయి. తొలి విడతగా కేంద్రం రూ.25 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో కలిపి పీజీలకు రెండు వసతి గృహ సముదాయాలను నిర్మించనున్నారు. రెండింటిలో కలిపి దాదాపు 600 మందికి వసతి కల్పించనున్నారు. జనవరి నెలలో ఆయా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని