logo

వయా విశాఖ!

మహా విశాఖనగరం గంజాయి అక్రమ రవాణా, మత్తు ఇంజక్షన్లకు కేంద్ర బిందువుగా మారటం ఆందోళన రేపుతోంది. యువత బలహీనతలను అసరాగా చేసుకుని, ఈ తరహా నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు, సరఫరా సాగుతుండటం గమనార్హం.

Published : 07 Feb 2023 05:02 IST

గంజాయి అక్రమ రవాణా
భారీగా మత్తు ఇంజక్షన్లు దిగుమతి

* 2021లో 2,115 కిలోలు;  2022లో 6,010 కిలోల గంజాయి పట్టుకున్నారు.
* 2021లో 1,500; 2022లో 3,803 నిషేధిత మత్తు ఇంజక్షన్లు, 8,290 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
* 2023 జనవరి నెలలో 209 కిలోల గంజాయి.. 480 ఇంజక్షన్లు, కిలో నల్లమందు  పట్టుకున్నారు.


న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: మహా విశాఖనగరం గంజాయి అక్రమ రవాణా, మత్తు ఇంజక్షన్లకు కేంద్ర బిందువుగా మారటం ఆందోళన రేపుతోంది. యువత బలహీనతలను అసరాగా చేసుకుని, ఈ తరహా నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు, సరఫరా సాగుతుండటం గమనార్హం. ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు విశాఖ ప్రధాన వేదికగా చేసుకుని ఈ తరహా వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

* కొరాపుట్‌ నుంచి గంజాయి: ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో పండే శీలావతి రకం గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. గతంలో స్థానికంగా ఉన్న గంజాయి విక్రయదారులు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి వ్యాపారులు నేరుగా నగరానికి వచ్చి ఏజెన్సీకి వెళ్లి.. తమకు పరిచయం ఉన్నవారి నుంచి గంజాయి  కొనుగోలు చేసి తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇటీవల  విశాఖ ఏజెన్సీతో పాటు.. ఒడిశాలోని కొరాపుట్‌ నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొరాపుట్‌ నుంచి విశాఖకు 204 కి.మి. దూరం. దీంతో వ్యాపారులు విశాఖకు వచ్చి.. ఇక్కడే ఉంటూ కొరాపుట్‌ వెళ్లి అక్కడ బేరసారాలు సాగించి తమ రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాల్లో తరలించేస్తున్నారు.

* కొరాపుట్‌, విశాఖ ఏజెన్సీల నుంచి విశాఖ వరకు తీసుకువచ్చిన గంజాయిని ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పాటు కేరళకు సరఫరా చేస్తున్నారు. గత ఏడాది ఇతర రాష్ట్రాలకు చెందిన గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 220 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సహకరించిన ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన వారు అనేకమంది ఉన్నారు. ఉమ్మడి విశాఖ ఏజెన్సీ, కొరాపుట్‌లో కిలో రూ.1500 నుంచి రూ.2000 వరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో కిలో రూ.4వేల నుంచి రూ.6వేల వరకు విక్రయిస్తున్నారు.

* విశాఖ నగరం ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా మారడమే కాకుండా స్థానికంగా గంజాయిని వినియోగించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. యువత నిర్మానుష్య ప్రాంతాలు, శ్మశానాలు, తీర ప్రాంతాలను మత్తుపదార్థాల స్వీకరణకు వేదికగా మార్చుకుంటున్నారు.

పశ్చిమబెంగాల్‌ నుంచి దిగుమతి: నిషేధిత మత్తు కలిగించే ఇంజక్షన్లు, మాత్రలు పశ్చిమ బెంగాల్‌ నుంచి విశాఖకు దిగుమతి అవుతున్నట్లు పోలీసులు, సెబ్‌ అధికారులు గుర్తించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి వీటిని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అక్కడ ఒక్కో ఇంజక్షన్‌ రూ.50కు కొని, నగర పరిధిలో వీటిని రూ.200 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. గతంలో ఒడిశా నుంచి దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ నుంచి దిగుమతి కావటం విశేషం. వీటిని విక్రయించేవారు నగరంలో సుమారు 10 మంది వరకు ఉండి ఉంటారని భావిస్తున్నారు.

నెంబరు ప్లేట్‌లను మార్చి: గంజాయి రవాణాకు  నిందితులు కొత్త ఎత్తుగడలేస్తున్నారు.  తమ రాష్ట్రాలకు చెందిన వాహనాల్లో నగరానికి వచ్చి, ఇక్కడ వాటి నెంబరు ప్లేట్లను మార్చేస్తున్నారు. ప్రత్యేకంగా నెంబరు బోర్డులు తయారు చేయించి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


విశాఖ కుచెందిన రాజేశ్‌  అనే వ్యక్తి సరఫరా చేసిన రూ. 10 లక్షల విలువైన గంజాయిని హైదరాబాద్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని