logo

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

Published : 07 Feb 2023 05:02 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాట్లాడుతున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. వేదికపై రేఖాశర్మ, ముద్దాడ రవిచంద్ర

ఈనాడు, విశాఖపట్నం: చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం ఉన్న వారి సంఖ్య సరిపోదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో మహిళా ప్రజాప్రతినిధుల కోసం మూడు రోజులుగా విశాఖలో జరుగుతున్న కార్యశాలలో సోమవారం ‘ షీ ఈజ్‌ ఏ ఛేంజ్‌ మేకర్‌’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల్లో వారి సంఖ్య మరింత పెరగాలి.  మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు రాజ్యసభలో ఆమోదం లభించినా... లోక్‌సభలో కొన్ని పార్టీలు అడ్డుకున్నాయి. అందుకు గల కారణాలను సదరు పార్టీలే విశ్లేషించుకోవాలి. దీనిపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రాజకీయ పార్టీలు త్వరలో ఈ బిల్లును తీసుకురావాలి. రాజకీయాల్లో పురుషులతో సమానంగా స్త్రీలు ఎదగాలి. అలాగే సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. సమస్యల పరిష్కారానికి, సమాజాభివృద్ధిలో మహిళా నేతలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారు, భవిష్యత్తులో వచ్చేవారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మాతృభాష, క్రమశిక్షణ, దేశభక్తి, శారీరక ఆరోగ్య ప్రాధాన్యాన్ని వివరిస్తూ తాను ఏడు పదుల వయసులోనూ రోజూ గంట పాటు బ్యాడ్మింటన్‌ ఆడుతానని చెప్పారు. మహిళా సాధికారితతోనే అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనలో మహిళలు కీలకంగా వ్యవహరించాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల్లో సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, లాల్‌బహదూర్‌ శాస్త్రి జాతీయ పరిపాలన సంస్థ ఉప సంచాలకులు దిశా పన్ను, వివిధ రాష్ట్రాల మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని