logo

ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సమష్టి కృషి

తెదేపా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు విజయానికి సమష్టిగా కృషి చేయాలని పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ నేతలు పిలుపు నిచ్చారు.

Published : 07 Feb 2023 05:02 IST

తెదేపా నేతల పిలుపు

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న బండారు, పల్లా, చిరంజీవిరావు, బాబ్జీ, తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: తెదేపా ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావు విజయానికి సమష్టిగా కృషి చేయాలని పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ నేతలు పిలుపు నిచ్చారు. సోమవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ అధిష్ఠానం నిర్ణయానికి అనుగుణంగా అంతా నడుచుకోవాలని, ఇప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేటరు గాడు చిన్నికుమారి లక్ష్మి అంగీకారంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చామన్నారు. ఆమెకు అన్ని విధాలా న్యాయం చేస్తామన్నారు. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టభద్రుల ఓట్లు తెదేపా అభ్యర్థికి పడేలా కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ తనకు రాజకీయాలు పూర్తిగా కొత్త అన్నారు. జగన్‌ సర్కార్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులను పూర్తిగా మోసం చేసిందన్నారు. ఆయా వర్గాలకు న్యాయం చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధిష్ఠానం టికెట్‌ ఇచ్చిందని, అంతా సహకరించాలని కోరారు. తొలుత ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన చిన్నికుమారి లక్ష్మికి పార్టీలో సముచిత స్థానం ఇస్తామన్న హామీతోనే తాను పోటీకి ఒప్పుకున్నానని వివరించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు తనను సంప్రదించారని, వారి సూచనలు, తెదేపా అధిష్ఠానం విజ్ఞప్తి మేరకు బరిలోకి వచ్చానన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మాట్లాడుతూ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా అంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ నేతలు కోరాడ రాజబాబు, నజీర్‌, పాశర్ల ప్రసాద్‌, లలితకుమారి, పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని