logo

వీఎంఆర్‌డీఏలో పని విభజన!

విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇంజినీరింగ్‌ విభాగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 07 Feb 2023 05:02 IST

గందరగోళంగా ఇంజినీరింగ్‌ విభాగం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఇంజినీరింగ్‌ విభాగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం  ఇటీవల వీఎంఆర్‌డీఏకు అదనంగా ఒక ఎస్‌ఈ పోస్టు మంజూరు చేసింది. దీంతో ఈ పోస్టుల సంఖ్య రెండుకు చేరింది. ఒక పోస్టులో భవానీశంకర్‌ ముందునుంచి కొనసాగుతున్నారు. ఈఈ బలరామరాజుకు ఎస్‌ఈగా పదోన్నతి కల్పించి అదనపు పోస్టు కేటాయించారు. ఎస్‌ఈలు ఏ బాధ్యతలు నిర్వహించాలి, ఏ విభాగాలపై పర్యవేక్షణ చేపట్టాలో స్పష్టీకరిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విభాగంలో కొందరిని మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సెంటు ప్లాటు లేఅవుట్లలో ఇప్పటి వరకు పనిచేసిన ఏఈలను మార్చారు.

కొత్త వారికి అక్కడ బాధ్యతలు అప్పగించడంపై పలువురు విమర్శిస్తున్నారు. ఈ చర్యల వల్ల హద్దుల నిర్ణయం, ఇతర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇదే అంశాన్ని సీఈ దృష్టికి పలువురు ఇంజినీర్లు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు ఎస్‌ఈల సమక్షంలో ఈఈలు, డిప్యూటీ డీఈలు, ఏఈలకు  విధులు అప్పగించారు.


* ఎస్‌ఈ బలరామరాజుకు... బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్‌, సమీకృత తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు, జి-20 సన్నాహక సమావేశాల నేపథ్యంలో కైలాసగిరి మీద చేపడుతున్న పనులు అప్పగించారు. విజయనగరం జిల్లాలోని ఎంఐజీ లేఅవుట్లను పరిశీలించాలి. సబ్బవరం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ మండలాల్లో ఒక సెంటు ప్లాట్‌ లే అవుట్లను కూడా పర్యవేక్షించాలి. వీటితో పాటు వీఎంఆర్‌డీఏకు చెందిన అన్ని కార్యాలయాల నిర్వహణ పనులు, వాణిజ్య దుకాణాలు, ఉద్యానవనాల నిర్వహణ, పర్యవేక్షణ, అన్ని డివిజన్లలో అన్ని రకాల ఎలక్ట్రికల్‌ పనులు, ఐటీ విభాగాన్ని అప్పగించారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల్లోని నాణ్యత నియంత్రణ బలరామరాజు ఆధ్వర్యంలోనే జరగనుంది.

* ఎస్‌ఈ భవానీశంకర్‌... పెందుర్తి, పద్మనాభం మండలాల్లో అన్ని రకాల పనులతో పాటు ఒక సెంటు ప్లాట్ల లేఅవుట్ల అభివృద్ధి పనులు పర్యవేక్షించాలి. భీమిలి మండంలో చేపడుతున్న పనులు, విజయనగరంలో జరుగుతున్నవి చూడాలి. ఎంపీ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు, జాతీయ చారిత్రక సందర్శనాలయ ప్రాజెక్టు పనులు ఈయనకు అప్పగించారు. వీటితో పాటు అనకాపల్లి, ఆనందపురంలో ఒక సెంటు ప్లాట్‌ లేఅవుట్లు చూసుకోవాలి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ కింద చేపడుతున్న ఎంఐజీ లేఅవుట్ల పనులు పర్యవేక్షించాల్సి ఉంటుంది.


మిగిలిన ఉద్యోగులకు ఎప్పుడో?: వీఎంఆర్‌డీఏలో పలువురు ఉద్యోగులు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. కొందరికి డిపార్టుమెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించకపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌ఈ పోస్టుకు మాత్రం వీఎంఆర్‌డీఏలోనే డీపీసీ సమావేశం నిర్వహించి పదోన్నతి కల్పించారు. మిగిలిన ఉద్యోగుల విషయంలో మాత్రం స్పందించడానికి అధికారులు ఆసక్తి చూపడం లేదనే  విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని