logo

‘కస్తూర్బా’ టీచర్లతో ఓట్ల సమావేశాలు!!

విజయనగరం జిల్లాలోనే కాదు..విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు కూడా అధికార పార్టీ నేతల పట్ల స్వామిభక్తిని ప్రదర్శించారు.

Published : 07 Feb 2023 05:02 IST

కేజీబీవీ సిబ్బందికి వైకాపా అభ్యర్థి హామీలు?!

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలోనే కాదు..విశాఖ, అనకాపల్లి జిల్లాల అధికారులు కూడా అధికార పార్టీ నేతల పట్ల స్వామిభక్తిని ప్రదర్శించారు. ఏ సమావేశం నిర్వహిస్తుందీ ముందుగా చెప్పకుండా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌ పరిచయ కార్యక్రమాలను సమగ్రశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)అధికారులే దగ్గరుండీ ఏర్పాట్లు చేయడం విశేషం. ఆదివారం విజయనగరం జిల్లాలో జడ్పీ సమావేశ మందిరంలో  సిబ్బందితో సమావేశమైన అధికార పార్టీ అభ్యర్థి... తర్వాత విశాఖలోని ఓ హోటల్‌లో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన 24 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) బోధనా సిబ్బంది, ప్రిన్సిపాళ్లతో మీటింగ్‌ నిర్వహించారు. ఈ రెండు జిల్లాల  సిబ్బందికి కూడా శాఖాపరమైన సమావేశమేనని పిలిచి రాజకీయ సమావేశంగా మార్చడంతో బోధనా సిబ్బంది అవాక్కయ్యారు. ప్రైవేటు హోటల్‌లో సమావేశం పెట్టినప్పుడే ఇదేదో తమ పాఠశాలలకు సంబంధించిన మీటింగ్‌ కాదనుకున్నారు. వచ్చాక తిరిగి వెళ్లడం ఎందుకని మిన్నకుండి పోయారు. ముందుగా ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న ఓ సెక్టోరల్‌ అధికారిణి ఈ సమావేశంలో మాట్లాడారు. తర్వాత కేజీబీవీ ఉపాధ్యాయుల సంఘం నాయకురాలుగా చెప్పుకుంటున్న ఓ ఉపాధ్యాయిని వేదికపైకి వచ్చి సమావేశం ఏర్పాటు చేయడానికి కారణాలను వివరించారు. మనందరికీ టైం స్కేల్‌ వర్తింపజేస్తామన్నారని, బోధన, బోధనేతర ఉపాధ్యాయుల సమస్యలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి ఈయనే తీసుకువెళ్లి పరిష్కరించడానికి చొరవ తీసుకుంటున్నారని వైకాపా అభ్యర్థి సుధాకర్‌ను పరిచయం చేశారు. అనంతరం సుధాకర్‌ మాట్లాడుతూ ఇప్పటికే మీ సమస్యలను ముఖ్యమంత్రికి తెలియజేశానని, త్వరలోనే మీ జీతాలు పెరుగుతాయని చెప్పినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని గెలిపిస్తే... ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి కేజీబీవీ టీచర్లను పంపించేశారు. ఇంకేదో సమావేశమనుకుని రికార్డులతో సహా వచ్చేశామని తీరా ఎన్నికల మీటింగ్‌ పెట్టారని ముందు చెబితే నచ్చిన వాళ్లం వస్తాం, లేకుంటే ఉండిపోతాం కదా అని కొంతమంది సిబ్బంది రుసరుసలాడారు. ఈ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన సంఘం నాయకురాలు ఇప్పటికే అధికార పార్టీ నేతల సిఫార్స్‌తో తమ బంధువును నచ్చిన పాఠశాలకు బదిలీ చేయించుకోవడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని