logo

‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నా ఏం ఒరిగింది?

అనకాపల్లి జిల్లా కేంద్రమై ఏడాది పూర్తయింది. కానీ రవాణాపరంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు ఎన్నేళ్లయినా ఎదురుచూపులే మిగులుతున్నాయి.

Updated : 27 Mar 2023 05:34 IST

అనకాపల్లిలో ఆగని ముఖ్య ఎక్స్‌ప్రెస్‌లు  
విశాఖ వెళ్తేనే దూరప్రాంతాలకు ప్రయాణం
లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే

స్టేషన్‌లో పర్యటిస్తున్న డీఆర్‌ఎం (పాత చిత్రం)

అనకాపల్లి జిల్లా కేంద్రమై ఏడాది పూర్తయింది. కానీ రవాణాపరంగా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా రైలు ప్రయాణికులకు ఎన్నేళ్లయినా ఎదురుచూపులే మిగులుతున్నాయి. దక్షిణ మధ్యరైల్వేలో ‘ఎ’ గ్రేడ్‌ హదాలో ఉన్న ఈ స్టేషన్‌ల వసతుల పరంగా కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ అందరికీ కావాల్సిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపడానికి మాత్రం చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగావిశాఖపట్నమో, దువ్వాడ వెళ్లక తప్పడం లేదు.

అనకాపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ఈ జిల్లాతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రయాణికులు సైతం రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో ఈ స్టేషన్‌ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. విజయవాడ-విశాఖపట్నం ప్రధాన రైలుమార్గంలో ఉండటంతో 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా ఇక్కడ ఆగుతున్నవి పదుల సంఖ్యలోనే ఉంటున్నాయి.

ప్రయాణికుల రద్దీ, లభిస్తున్న ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు సదుపాయాలు కల్పించారు. ఒకటి, రెండు ప్లాట్‌ఫాంలపై ఎస్కలేటర్లు, వైఫై, అదనపు బుకింగ్‌ కౌంటర్లు, సోలార్‌ పవర్‌, సీసీ కెమెరాలు, నిరంతరం ఆర్పీఎఫ్‌ పహారా, శుద్ధ జల ప్లాంట్‌, అధునాతన బెంచీలు, వెయిటింగ్‌ రూమ్‌లు ఇలా పలు రకాల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ విషయంలో ప్రయాణికులు మన్ననలు అందుకుంటున్న రైల్వే అధికారులు ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హాల్ట్‌ ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారు. ‘ఎ’ గ్రేడ్‌ హోదా ఉన్నా కావల్సిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగక పోవడంపై ఉసూరుమంటున్నారు. దీనిపై డైలీ పాసింజర్‌ అసోసియేషన్‌ సభ్యులు, ప్రజాహిత బ్రహ్మకుమారీలు, ప్రజాసంఘాల నాయకులు పలుమార్లు రైల్వే జీఎం, డీఆర్‌ఎం, ఎంపీలకు వినతి పత్రాలు అందజేశారు. ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనకాపల్లిలో హాల్ట్‌ ఇవ్వాలని కోరారు. ఏళ్లు గడుస్తున్నా.. కొత్తగా రైళ్లు పట్టాలెక్కుతున్నా ఏవీ అనకాపల్లిలో ఆగడం లేదు. దూరప్రాంతాలకు వెళ్లేవారంతా వ్యయప్రయాసలు భరించి దువ్వాడ, విశాఖపట్నం వెళ్లాల్సి వస్తోంది. విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్‌ల్లోనూ కొన్నింటికి హాల్టు లేకపోవడం గమనార్హం.

ఆదాయం కళకళ: అనకాపల్లి రైల్వేస్టేషన్‌ను ఆనుకొని నిత్యం 8500లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక పండగలు, సీజన్‌ సమయాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. రోజూ ప్రయాణికుల నుంచి 7 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. కావల్సిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపితే రిజర్వేషన్‌, జనరల్‌ టిక్కెట్లు ద్వారా ఆదాయం సైతం రెట్టింపు అవుతుంది. రైల్వే నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు హాల్ట్‌కు తప్పనిసరిగా 40 టిక్కెట్లు అమ్ముడుపోవాలి. కానీ ఈ స్టేషన్‌ నుంచి ప్రతి రైలుకు తప్పనిసరిగా 100 నుంచి 150 టిక్కెట్లు ఉంటాయి. డిమాండ్‌ ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అనుగుణంగా సర్వే చేపడితే తప్పనిసరిగా వంద టిక్కెట్లు వస్తాయనేది స్థానిక ప్రయాణికుల మాట.

వీటికి హాల్టులిస్తే మేలు

ఫలక్‌నుమా, యశ్వంత్‌పూర్‌-టాటా, హటియా యశ్వంత్‌పూర్‌, తిరుపతి-సంత్రాగచ్చి, యశ్వంత్‌పూర్‌-హావ్‌డా, విల్లుపురం-ఖరగ్‌పూర్‌, కన్యాకుమారి-దిబ్రూగఢ్‌, చెన్నై-షాలిమర్‌, విశాఖ-ఎల్‌టీటీ, కోరమండల్‌, అమరావతి, కొల్లాం, తిరుపతి హమ్‌సఫర్‌, నాగావళి రైళ్లకు హాల్ట్‌ ఇవ్వడం లేదు. వీటితోటు విపరీతమైన డిమాండ్‌ ఉన్న విశాఖపట్నం-నాందేడ్‌, అమరావతి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-గాంధీధాం, భువనేశ్వర్‌-బెంగుళూరు, భువనేశ్వర్‌-తిరుపతి, నిజాముద్దీన్‌ స్వర్ణజయంతి, హౌరా-కన్యాకుమారి రైళ్లు సైతం స్టేషన్‌లో ఆపడం లేదు.

స్టేషన్‌లో రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు


దువ్వాడలో దిగి రావాల్సి వస్తోంది

అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో డిమాండ్‌ ఉన్న రైళ్లు ఆపకపోవడం దుర్మార్గం. ఏ గ్రేడ్‌ హోదా ఉన్నా చాలా ఎక్స్‌ప్రెస్‌లు ఆపడం లేదు. కావల్సిన రైళ్ల కోసం విశాఖపట్నం, దువ్వాడ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. దువ్వాడలోనో, విశాఖపట్నంలోనో దిగి తిరిగి వేరే రైలు పట్టుకొని అనకాపల్లి రావాల్సి వస్తోంది. అనకాపల్లి జిల్లాగా ఏర్పడినా స్టేషన్‌కు ప్రాధాన్యం పెరగకపోవడం సరికాదు.

ఎం.గణేష్‌, అనకాపల్లి


ఉన్నతాధికారులకు పంపాం

కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని ప్రయాణికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ముఖ్యంగా యశ్వంత్‌పూర్‌, సంబల్‌పూర్‌, గాంధీధాం, ఎల్‌టీటీ, కొల్లం, కోరమండల్‌ వంటి రైళ్లకు హాల్ట్‌ ఇవ్వాలని ప్రయాణికులు  అడుగుతున్నారు. కొంతమంది ప్రయాణికులు వినతి పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులు ఏ రైళ్ల్లు ఆపాలని కోరుతున్నారో వాటి వివరాలను ఉన్నత అధికారులకు పంపించాం. దీనిపై నిర్ణయం ఉన్నతాధికారులే తీసుకోవాల్సి ఉంది.

వెంకటేశ్వరరావు, స్టేషన్‌ సూపరింటెండెంట్‌


రైల్వే అధికారులతో చర్చిస్తున్నా

అనకాపల్లి స్టేషన్‌లో ప్రయాణికులు కోరుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ ఇవ్వడంపై రైల్వే జీఎం, మంత్రితో చర్చించాను. దీనిపై ప్రయాణికులు, ప్రజాసంఘాల నాయకులు స్వయంగా కలసి వినతి పత్రాలు ఇచ్చారు. ప్రయాణికులు ఏ రైళ్లు ఆపాలని కోరుతున్నారో వాటి వివరాలను ఇప్పటికే రైల్వే అధికారులకు అందించాను. త్వరలో కావాల్సిన రైళ్లు ఆపేలా చర్యలు చేపడతాం.

సత్యవతి, ఎంపీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని