logo

అర్జీల పరిష్కారంలో జాప్యం సహించం

స్పందన అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ రవి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు అర్జీదారులు పోటెత్తారు.

Published : 28 Mar 2023 04:16 IST

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి, జేసీ కల్పనాకుమారి, డీఆర్వో వెంకటరమణ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారంలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ రవి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనకు అర్జీదారులు పోటెత్తారు.  రసీదు తీసుకుని కలెక్టర్‌ రవి, సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణను కలిసి వినతులు అందజేశారు. భూ అక్రమాలు, వివాదాలపై పలువురు ఫిర్యాదు చేశారు. జిల్లా నలుమూలల నుంచి 175 వినతులు వచ్చాయి. వీటిని శాఖల వారీగా విభజించి సంబంధిత జిల్లా అధికారులకు పంపించారు. ఎండకు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు.

* సర్వశిక్షా అభియాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి సమాచారం     ఇవ్వకుండా భర్తీ చేశారని దివ్యాంగులు    రాపేటి భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. డీఆర్వో వెంకటరమణను కలసి వినతిపత్రం అందజేశారు. ఉపాధి కల్పించాలని 11 నెలలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు.

* దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం దుర్మార్గమని పేర్కొంటూ భాజపా జిల్లా దళిత మోర్చా నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు అప్పారావు, భాజపా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వర్మ, ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు, రామకృష్ణ, నాగేశ్వరరావు, కొండలరావు, కలెక్టర్‌ రవిని కలిసి వినతిపత్రం అందజేశారు.  

* రేబాకలో సర్వే నంబరు 99లో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారని, తక్షణమే చర్యలు చేపట్టాలని కె.శంకరరావు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

* రోలుగుంట మండలం గుండుబాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 392-5లో 4 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, కొంతమంది వ్యక్తులు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించి భూమిని ఖాళీ చేయాలని దౌర్జన్యానికి దిగుతున్నారని రోలుగుంట మండలం జె.నాయుడుపాలెంకు చెందిన వడ్డాది కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

* మునగపాక మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో వీధిదీపాల నిర్వహణకు హెల్పర్లను నియమించాలని పలువురు సర్పంచులు కలెక్టర్‌ను కలసి విన్నవించారు. గత ప్రభుత్వంలోని ఆర్‌ఈసీఎస్‌ బకాయిలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు.

* బుచ్చెయ్యపేట: రాజాం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 233లో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయి అమ్మకాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీటీసీ మాజీ సభ్యుడు సతీశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు జేసీని కలసి వినతి పత్రం అందజేశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

* చోడవరం గ్రామీణం: చోడవరం-వెంకన్నపాలెం బీఎన్‌రోడ్డులో దెబ్బతిన్న కల్వర్టుపై వెంటనే రక్షణ గోడను నిర్మించాలని సీపీఎం నాయకులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కలెక్టర్‌ రవికి వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల నిరసన తెలియజేస్తే కల్వర్టుకు ఇరువైపులా ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా కర్రలతో దడిని  కట్టించారన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు ఎస్‌.వి.నాయుడు, జి.దేముళ్లు తదితరులు పాల్గొన్నారు.


స్పందన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్పీ గౌతమి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: స్పందనలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 40 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎక్కువగా భూ తగాదాలు, ఛీటింగ్‌ కేసులు ఉన్నాయి. ఫిర్యాదుదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలకు వివరాలు పంపి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని