logo

విహారంలో ప్రమాదం

పరీక్షలు ముగియడంతో ఇద్దరు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Updated : 29 Mar 2023 05:38 IST

ఒకరి పరిస్థితి విషమం నీ మరొకరికి తీవ్రగాయాలు

గాయపడిన హరిదీప్‌, శ్యామ్‌కుమార్‌

గ్రామీణ భీమిలి, జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పరీక్షలు ముగియడంతో ఇద్దరు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు వేగంగా ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ముగియడంతో ఆరుగురు మిత్రులు మూడు ద్విచక్ర వాహనాల్లో విశాఖ నగరం నుంచి భీమిలి వైపు విహారానికి బయల్దేరారు. వీరిలో డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా కశాశాలలో చదువుతున్న ఎల్‌.శ్యామ్‌కుమార్‌(17), హరిదీప్‌ (17) ఒక వాహనంపై ఉన్నారు. వీరు భీమిలి బీచ్‌రోడ్డు చేపల తిమ్మాపురం కల్యాణ మండపం వద్దకు వచ్చేసరికి రోడ్డు దాటుతున్న పశువులను చూసి సడన్‌ బ్రేక్‌ వేశారు. దీంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి కొంతదూరం పల్టీలు కొట్టూకుంటూ డివైడర్‌ను ఢీకొంది. హరిదీప్‌ తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన శ్యామ్‌కుమార్‌ను 108లో నగరంలోని కేజీహెచ్‌కు తరలించారు. హెడ్‌కానిస్టేబుల్‌ బి.వెంకటరమణ ఘటనాస్థలికి వచ్చి వివరాలను సేకరించారు. దీనిపై ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని, ఎంఎల్‌సీ రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని భీమిలి సీఐ కె.లక్ష్మణమూర్తి తెలిపారు. క్షతగాత్రుల్లో శ్యామ్‌కుమార్‌ది మురళీనగర్‌ ప్రాంతం కాగా హరిదీప్‌ కూడా నగరంలోనే ఉంటున్నాడు.


కన్నవారికి కడుపుకోత

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

పీఎంపాలెం, న్యూస్‌టుడే: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకుని మృతి చెందడంతో వారింట తీవ్ర విషాదం నెలకొంది. నగర శివారులోని బోయపాలెం సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలోని వసతి గృహంలో విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భార్య ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తె మధురవాడ దరి బోయపాలెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివిస్తూ కళాశాల వసతి గృహంలోనే ఉంచుతున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఆ విద్యార్థిని మార్కులు తక్కువగా వస్తాయన్న భయంతో సోమవారం రాత్రి కళాశాల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నానని అందువల్ల పరీక్ష బాగా రాయలేదని దీనివల్ల మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కళాశాల నిర్వాహకుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని