logo

కాలంతో పోటీ.. ఐఐఎంలో మేటి

విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 04:34 IST

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే
స్నాతకోత్సవంలో ‘బంగారు పతకాల’ బహూకరణ

ఐఐఎం ఏడో స్నాతకోత్సవానికి హాజరైన విద్యార్థులు

విశాఖపట్నంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో (ఐఐఎం)లో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు పేర్కొన్నారు. ఇక్కడ నేర్చుకున్నవాటితో భవిష్యత్తుకు బాటలు వేసుకుంటామని తెలిపారు. ఈ పతకాలు సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ ఐఐఎం ఏడో స్నాతకోత్సవం సందర్భంగా పీజీపీ, పీజీపీఎక్స్‌, పీజీపీడీజీఎం కోర్సుల్లో తొలి రెండు ర్యాంకులు, బెస్ట్‌ ఆల్‌రౌండ్‌, వాణిరావు మెమోరియల్‌ అవార్డు (అమ్మాయిల్లో తొలి ర్యాంకు) సాధించిన వారు బంగారు పతకాలు అందుకున్నారు. ఆ సంతోషాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు.


కష్టపడితే సాధించగలం..

- అయాన్‌ వర్మ, పీజీపీ తొలి ర్యాంకు, బెస్ట్‌ ఆల్‌రౌండ్‌ పెర్‌ఫార్మర్‌

నా స్వస్థలం దిల్లీ. జర్నలిజం చదివాను. ఆ అనుభవమే మెరుగైన ఫలితాలు సాధించేలా నన్ను ముందుకు నడిపిస్తుంది. కొంచెం కష్టపడితే ఏదైనా సాధించగలం. రెండు బంగారు పతకాలు సాధిస్తానని ఊహించలేదు. నా కుటుంబంతోపాటు సమాజానికి మంచి చేయాలి. ఎప్పటికైనా అది సాధిస్తాను. విశాఖ అద్భుతమైన నగరం. విద్యాపరంగానే గాక పర్యాటక పరంగానూ ఆహ్లాదం కలిగించే ఈ ప్రాంతాన్ని అందరూ సందర్శించాలి.


వారి సహకారంతోనే..

- ప్రాప్తి అలోక్‌, పీజీపీ రెండో ర్యాంకు, వాణిరావు మెమోరియల్‌ అవార్డు గ్రహీత

మాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌. రెండు బంగారు పతకాలు రావడం చాలా గర్వంగా ఉంది. ఇన్‌స్టిట్యూట్‌, ఆచార్యులు, బోధన సిబ్బంది సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీటెక్‌ తర్వాత రెండేళ్లు ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేశాను. ఉద్యోగం మానేసి ఉన్నత చదువులకు వెళ్తానంటే కుటుంబ సభ్యులు ప్రోత్సహించారు. విశాఖలో గడిపిన రెండేళ్ల కాలాన్ని మరచిపోలేను. ఐఐఎంలో డైరెక్టర్‌ నుంచి విద్యార్థి వరకు ఒకే కుటుంబంలా ఉన్నారు. భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలని భావిస్తున్నాను.  


స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తూ..

- కునాల్‌ రంజన్‌, పీజీపీఎక్స్‌ తొలి ర్యాంకు

స్టీల్‌ప్లాంట్‌లో 2005 నుంచి పనిచేస్తున్నాను. సంస్థ సహకారం మరచిపోలేను. బంగారు పతకం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. ఉక్కు కర్మాగారం అభివృద్ధికి వీలైనంత కృషి చేస్తాను. భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్తాను. నేను సంపాదించిన జ్ఞానం, నేర్చుకున్న అంశాలు సమాజానికి ఉపయోగపడేలా పనిచేస్తాను. ముంబయి రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇక్కడ ఇంటర్వ్యూకు వచ్చాను. ఈ ప్రాంతం చాలా నచ్చడంతో అక్కడ ఉద్యోగం మానేసి స్టీల్‌ప్లాంట్‌లో చేరాను.


దేశానికి ఉపయోగ పడేలా

- మినాజ్‌ అహ్మద్‌, పీజీపీ డీజీఎం తొలి ర్యాంకు

మాది బిహార్‌లోని పట్నా. ప్రస్తుతం రక్షణ రంగం (డిఫెన్స్‌)లో విధులు నిర్వర్తిస్తున్నాను. బంగారు పతకం రావడం గర్వంగా ఉంది. కోర్సులో నేర్చుకున్న అంశాలతో దేశానికి మరింత మెరుగ్గా సేవ చేస్తాను. గతంలో పలుమార్లు విశాఖ వచ్చాను. అన్ని సమయాల్లోనూ ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తాను. ఇన్‌స్టిట్యూట్‌ స్థాపించిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ బోధన ఎంతో బాగుంది. కొత్తగా నిర్మిస్తున్న నూతన ప్రాంగణాన్ని ఇటీవల సందర్శించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు