logo

విద్యుదుత్పత్తిలో నూతన విధానాలతో రికార్డులు

సింహాద్రి ఎన్టీపీసీ’ స్థాపించిన నాటి నుంచి నూతన విధానాలు అమలు చేస్తుండటంతో విద్యుదుత్పత్తిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 08:23 IST

మాట్లాడుతున్న ఎన్టీపీసీ గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌. పాల్గొన్న జీఎంలు, ఏజీఎంలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: ‘సింహాద్రి ఎన్టీపీసీ’ స్థాపించిన నాటి నుంచి నూతన విధానాలు అమలు చేస్తుండటంతో విద్యుదుత్పత్తిలో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తున్నామని గ్రూప్‌ జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల విద్యుత్తు డిమాండ్‌ పెరిగిందని, అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేయడంతోపాటు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అత్యున్నత భద్రతా చర్యలు పాటిస్తుండటంతో 2017 ఆగస్టు 24 నుంచి భారీ ప్రమాదాలు జరగకుండా నివారించగలిగామని చెప్పారు. నగరంలోని  ఓ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడారు.
బీ ‘దేశంలో గ్రీన్‌ ఫీల్డ్‌ ప్రాజెక్టు అమలులో భాగంగా స్టేజ్‌-1 కింద 39 నెలల్లో యూనిట్లను అమర్చి రికార్డు సృష్టించాం. కండెన్షర్లను చల్లబరచడానికి, బూడిద నిర్వహణకు సముద్ర జలాలను వినియోగిస్తున్నాం. ఆసియాలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ అవార్డు అందుకున్నాం. విద్యుదుత్పత్తి, విజయాలను సాధించడంతోపాటు పర్యావరణం, ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నాం. సంస్థ సామాజిక బాధ్యత కింద పరిసర గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, శుద్ధిజలం సరఫరా, విద్య, మౌలిక వసతుల కల్పన, మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. 2022-23లో ఆయా కార్యక్రమాలకు రూ.4.45 కోట్లు కేటాయించాం. పర్యావరణం, ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత చర్యలకు సంబంధించి అంతర్జాతీయ విధానాలను అవలంభిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి అన్ని యూనిట్లలో ‘ఫ్లూ-గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ)’ టెక్నాలజీని వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నాం’  అని తెలిపారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్లు (జీఎం) బి.పి.పాత్ర్‌, వి.ఎం.చౌదరి, అదనపు జనరల్‌ మేనేజర్లు (ఏజీఎం) డాక్టర్‌ వి.జయన్‌, రుమా దే శర్మ, అర్జున్‌ ప్రదీప్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని