logo

Vizag: నాడు లైన్‌మెన్‌.. నేడు రూ.కోట్లలో ఆస్తులు

అవినీతి నిరోధక శాఖ అధికారులు విద్యుత్తు శాఖ డీఈఈ సన్ని రాంబాబు నివాసంతో పాటు పలు చోట్ల శనివారం సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు.

Updated : 21 May 2023 09:27 IST

డీఈఈ కార్యాలయంలో అనిశా సిబ్బంది సోదాలు

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే, పరవాడ: అవినీతి నిరోధక శాఖ అధికారులు విద్యుత్తు శాఖ డీఈఈ సన్ని రాంబాబు నివాసంతో పాటు పలు చోట్ల శనివారం సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు. పరవాడ ఫార్మాసిటీలో ఉన్న ఏపీఈపీడీసీఎల్‌ అనకాపల్లి సబ్‌ డివిజన్‌ ఎంఆర్‌టీ-సిటీ మీటర్స్‌ కార్యాలయం డీఈఈగా ఉన్న రాంబాబు పాతగాజువాక మెహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.  అదనపు ఎస్పీ శ్రావణి నేతృత్వంలో సిబ్బంది ఇక్కడ తనిఖీ చేపట్టారు. అలాగే అనిశా సీఐ కిషోర్‌కుమార్‌ తన సిబ్బందితో శనివారం ఉదయం  10 గంటలకు ఎంఆర్‌టీ-సిటీ మీటర్స్‌ కార్యాలయానికి చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటల వరకు సోదాలు చేశారు. బీరువాల్లో సన్ని రాంబాబుకు చెందిన ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, బీమాబాండ్లు, నగదు లావాదేవీలకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీటిల్లో గాజువాక అపార్ట్‌మెంట్‌ విలువ బహిరంగ సుమారు రూ.10కోట్ల పైమాటే. రాంబాబు నివాసం ఉంటున్న మూడంతస్తుల భవనం విలువ రూ.2-3 కోట్లుపైగానే ఉంటుందని అంచనా.  మల్కాపురంలోని రెండు భవనాల విలువ రూ.3కోట్లు. శివాజీపాలెంలో ఫ్లాట్‌ రూ.70లక్షలు పలుకుతుంది. ఇక భోగాపురంలో స్థలం విలువ కూడా భారీగానే ఉంటుంది. కేవలం ఇళ్ల అద్దెల ద్వారా ప్రతినెలా రూ.4లక్షలు ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ దాడుల్లో దొరికిన బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.60 లక్షల వరకు ఉంటుందని అంచనా.

అలా మొదలెట్టి: సన్ని రాంబాబు తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలో మొదట లైన్‌మెన్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత పదోన్నతిపై పెదగంట్యాడలో ఏఈగా 2016 అక్టోబర్‌లో బాధ్యతలు చేపట్టి మూడేళ్లపాటు పనిచేశారు. ఆ తర్వాత మల్కాపురం డివిజన్‌ ఏడీఈగా 2019 నవంబరులో బాధ్యతలు చేపట్టి 2022 జులై వరకు పని చేశారు. ప్రస్తుతం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా అనకాపల్లి కార్యాలయంలో కొనసాగుతున్నారు. రాంబాబు భార్య పెదగంట్యాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని