logo

మూడోరోజూ ముప్పుతిప్పలు

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మూడోరోజు బుధవారం సర్వర్‌ పనిచేయక సేవలు నిలిచిపోయాయి.

Published : 01 Jun 2023 04:27 IST

ఎలమంచిలి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద నిరీక్షణ

ఎలమంచిలి, న్యూస్‌టుడే: సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మూడోరోజు బుధవారం సర్వర్‌ పనిచేయక సేవలు నిలిచిపోయాయి. వరుసగా సేవలు నిలిచిపోవడం గురువారం నుంచి మార్కెట్‌ విలువలు పెరగడంతో పెద్ద సంఖ్యలో క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 7 గంటలకే దస్తావేజు లేఖర్లను సంప్రదించి రిజిస్ట్రేషన్లకు సిద్ధం చేశారు. ఒక్కసారిగా విక్రయదారులు పోటెత్తడంతో కార్యాలయం అంతా రద్దీగా మారింది. ఈ కార్యాలయానికి వెళ్లే రోడ్డంతా వాహనాలతో నిండిపోయింది. దూరప్రాంతాల నుంచి కూడా కార్యాలయానికి వచ్చారు. ధరల పెంపుతో అదనపు భారం పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి పోటీపడ్డారు. రోజూ సగటున ఇక్కడ 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు అవుతాయి. రెండు రోజులుగా సర్వర్‌ పనిచేయకపోవడం ఒక్కసారిగా అందరూ రావడంతో కార్యాలయంపై ఒత్తిడి పెరిగింది. సర్వర్‌ నెమ్మదిగా ఉండటంతో అప్‌లోడ్‌ చేయలేకపోయారు. వచ్చిన వారందరికీ సమాధానం చెప్పలేక కార్యాలయం సిబ్బంది ఇబ్బంది పడ్డారు. అచ్యుతాపురంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులంతా ఎలమంచిలి కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. సరిగ్గా ధర పెరిగే ముందే సర్వర్‌ పనిచేయకపోవడంతో అంతా అయోమయంలో పడ్డారు. మూడు రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని, రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వెళ్లిపోదామని విమానం టికెట్లు తీసుకుని వచ్చి ఆర్థికంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తంచేశారు. చాలా మంది ఇదే పనికోసం సెలవులు పెట్టుకుని వచ్చి నిరాశకు గురయ్యారు. సాయంత్రానికి సర్వర్‌ పనిచేస్తుందని అధికారులు చెప్పినా చాలామంది రెండు రోజుల నుంచి ఇదే చెబుతున్నారంటూ తిరుగుముఖం పట్టారు.

ఎట్టకేలకు రిజిస్ట్రేషన్లు

నక్కపల్లి, న్యూస్‌టుడే: సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా రెండు రోజుల పాటు నిలిచిన రిజిస్ట్రేషన్‌ సేవలు బుధవారం మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో దాదాపు 70 డాక్యుమెంట్లు పెండింగ్‌లో ఉండగా, బుధవారం వచ్చిన వాటితో కలిపి 100కుపైగా చేరాయి. సాయంత్రానికి 50కుపైగా డాక్యుమెంట్లకు ఆమోదం లభించింది. కొనుగోలుదారులు అందుబాటులో ఉన్న మేరకు వీటిని పూర్తి చేసే వెళతామని నక్కపల్లి అధికారి బేగం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని