logo

వివాదాస్పద స్థలంలోకి వెళ్లొద్దు

వేపగుంటలోని వివాదాస్పద ‘షిప్‌యార్డ్‌ లేఅవుట్‌’ స్థలంలోకి ఎవరూ వెళ్లవద్దని ఇరు వర్గాలను పోలీసులు హెచ్చరించారు.

Published : 02 Jun 2023 03:28 IST

‘షిప్‌యార్డ్‌ లేఅవుట్‌’ వద్ద పోలీసుల హెచ్చరిక

మహేష్‌ వర్గం వేసిన టెంట్లను తొలగిస్తున్న పోలీసులు

వేపగుంట, న్యూస్‌టుడే: వేపగుంటలోని వివాదాస్పద ‘షిప్‌యార్డ్‌ లేఅవుట్‌’ స్థలంలోకి ఎవరూ వెళ్లవద్దని ఇరు వర్గాలను పోలీసులు హెచ్చరించారు. సర్వే నెంబర్‌ 164/1లోని స్థలంలో ఉన్న షెడ్‌ను, ప్రహరినీ మంత్రి అమర్‌నాథ్‌, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అనుచరులమంటూ మంగళవారం అర్ధరాత్రి దాటాక రౌడీ మూకలు నేలమట్టం చేసిన విషయం కలకలం రేపింది. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు, రెవెన్యూ అధికారులు గురువారం స్పందించారు. పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు, తహసీల్దారు శ్యామ్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ అసిరితాత, వీఆర్వో ముత్యాలుశెట్టి, సచివాలయ కార్యదర్శులు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. అక్కడున్న మహేష్‌ వర్గాన్ని, లేఅవుట్‌లో ప్లాట్లు కొన్న వారిని వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకూ ఇక్కడ షెడ్‌ నిర్మించి, కాపలాదారులను ఉంచిన మహేష్‌ వర్గం గురువారం వేసిన టెంటును తొలగించారు. ఈ భూమి వివాదం న్యాయస్థానంలో కొనసాగుతున్నందున పూర్తి హక్కులు న్యాయస్థానం నుంచి ఎవరికి లభిస్తే వారు సంబంధిత పత్రాలను పోలీస్‌స్టేషన్‌లో చూపించి స్థలంలోకి వెళ్లాలన్నారు. అలాకాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వివాదంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి విచారిస్తున్నట్లు సమాచారం.

స్థలాన్ని పరిశీలిస్తున్న వీఆర్వో, సచివాలయ కార్యదర్శులు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని