logo

ఉన్నా.. పనిచేయవ్‌!

కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగంలో కీలకమైన రెండు వైద్య పరికరాలు మూలకు చేరాయి. ఆయా వైద్య పరీక్షల నిమిత్తం రోగులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లకతప్పడం లేదు.

Published : 02 Jun 2023 03:28 IST

మూలకు చేరిన వైద్య పరికరాలు

పని చేయని ఈఈజీ పరికరాలు

న్యూస్‌టుడే, వన్‌టౌన్‌:  కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగంలో కీలకమైన రెండు వైద్య పరికరాలు మూలకు చేరాయి. ఆయా వైద్య పరీక్షల నిమిత్తం రోగులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లకతప్పడం లేదు. నరాలు, మెదడు పనితీరును పరిశీలించేందుకు వినియోగించే ఎన్‌సీవీ, ఈఈజీ పరికరాలు రెండు నెలల నుంచి ఇక్కడ చేయడం లేదు. ఈ పరికరాలు మరమ్మతుకు గురై మూలకు చేరాయి. ఈఈజీ ద్వారా మెదడు పనితీరును అంచనా వేస్తారు. ముఖ్యంగా మూర్ఛతో బాధపడే వారికి ఈఈజీ పరీక్షలు చేస్తారు. నిత్యం 10 మంది వరకు బాధితులు వస్తారు. ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు కేజీహెచ్‌లో పరిస్థితి తెలుసుకొని ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. బయట ఈ పరీక్షలు చేయించుకోవాలంటే రూ.1500 నుంచి రూ.2వేల వరకు ఖర్చవుతుంది. నరాల పనితీరును అంచనా వేయడం, వ్యాధి నిర్ధరణ కోసం ఎన్‌సీవీ పరీక్ష చేస్తారు. ఈ పరికరం కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. కేజీహెచ్‌లో పరికరాలు మరమ్మతుకు గురైతే పునరుద్ధరించే బాధ్యతను ఒక గుత్తేదారు సంస్థకు అప్పగించారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు ఈ రెండు పరికరాలను పరిశీలించారు. పునరుద్ధరణ తమవల్ల కాదని బయోమెడికల్‌ ఇంజినీర్లకు తెలిపారు. వారు వస్తేకాని ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఎన్సీవీ పరీక్షలు రోజుకు 10 నుంచి 15 మందికి చేస్తారు. బయట ఈ పరీక్ష చేయించుకోవాలంటే రూ.1000 నుంచి రూ.1500 వరకు అవుతుందని రోగులు వాపోతున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఈఈజీ, ఎన్‌సీవీ పరికరాలతో పేదలకు కేజీహెచ్‌లో సేవలందిస్తున్నారు. పరికరాల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కొనుగోలు చేసి ఎక్కువ కావడంతో ప్రస్తుతం మూలకు చేరాయి. వీటి పరిస్థితిపై ఇప్పటికే ఆసుపత్రి వైద్యాధికారులు డీఎంఈ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో అందుబాటులోకి వస్తాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని