logo

సీబీసీఎన్‌సీ భూ వివరాలు వెల్లడించాలి

విశాఖలోని సీబీసీఎన్‌సీకి చెందిన భూ వివరాలు అందజేయాలని తెదేపా సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు.

Published : 06 Jun 2023 04:59 IST

తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు

విశాఖ కలెక్టర్‌ మల్లికార్జునకు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు అందజేస్తున్న తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు

వన్‌టౌన్‌ (విశాఖపట్నం), న్యూస్‌టుడే: విశాఖలోని సీబీసీఎన్‌సీకి చెందిన భూ వివరాలు అందజేయాలని తెదేపా సీనియర్‌ నేత, పొలిట్‌ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ మేరకు సోమవారం తెదేపా న్యాయ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎస్‌.నాయుడుతో కలిసి విశాఖ కలెక్టరేట్‌లో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కలెక్టర్‌ ఎ.మల్లికార్జునకు దరఖాస్తు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సీబీసీఎన్‌సీ భూ విస్తీర్ణం ఎంత? యుఎల్‌సి మిగులు భూమి అయితే ప్రైవేటు వ్యక్తులకు కేటాయించే అధికారం ఉందా? తదితర వివరాలు, జీవోలు ఇవ్వాలని ఆ దరఖాస్తులో కోరినట్లు అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ భూముల్లో 18వేల చదరపు గజాల్లో విపరీత తవ్వకాలు సాగిస్తున్నారని, అవి దేనికని ప్రశ్నిస్తే అధికారులెవ్వరూ చెప్పడం లేదన్నారు. ఆ స్థలం ఎవరిదో తెలియకుండా బహుళ అంతస్థు భవనాలు కట్టడానికి ప్రైవేటు వారికి ఏ రకంగా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. బీ పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి చేయడాన్ని అయ్యన్నపాత్రుడు ఖండించారు. ప్రజాస్వామ్యంలో గొంతునొక్కే హక్కు ఎవరికీ లేదన్నారు. ప్రజలను వైకాపా ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తోందని, అటువంటప్పుడు ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు. తన మీద 14 కేసులు పెట్టారని, ప్రభుత్వ దౌర్జాన్యాల వల్ల ప్రజల నుంచి తిరుగుబాటు వస్తోందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పీఎస్‌ నాయుడు, పి.జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని