logo

పెంచుడేనా.. పంచుడేదీ..!

భూముల మార్కెట్‌ విలువను ఎప్పటికప్పుడు సవరిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.. అదే సమయంలో భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా స్థానిక సంస్థలకు సమకూరాల్చిన నిధులను విదల్చకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది.

Updated : 08 Jun 2023 06:21 IST

భూముల మార్కెట్‌ విలువ భారీగా పెంచిన సర్కారు
స్టాంప్‌ డ్యూటీ సర్‌ఛార్జీ విడుదలలో స్థానిక సంస్థలకు మొండిచేయి
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి, ఎలమంచిలి

భూముల మార్కెట్‌ విలువను ఎప్పటికప్పుడు సవరిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రాష్ట్ర సర్కారు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నారు.. అదే సమయంలో భూములు, స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా స్థానిక సంస్థలకు సమకూరాల్చిన నిధులను విదల్చకుండా ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుంటోంది. ఇప్పటికే పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకుంది. ఇతర మార్గాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను కూడా అడ్డుకోవడంతో గ్రామాల్లో ఎక్కడి పనులు అక్కడే పడకేశాయి. పంచాయతీల్లో చిన్నచిన్న అవసరాలను కూడా తీర్చలేకపోతున్నామని సర్పంచులు గగ్గోలు పెడుతున్నారు.

వద్దనబట్టేనా..?

సర్‌ఛార్జీ నిధుల్ని స్థానిక సంస్థల ఖాతాల్లో వేయకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. అందుకే జిల్లా రిజిస్ట్రార్‌ జానకీదేవిని వీటి వివరాలు గురించి పలుమార్లు అడిగినా స్పందించడానికి ఇష్టపడలేదు. డీపీవో శిరీషారాణిని అడిగితే ఆ నిధులు నేరుగా పంచాయ తీలకు జమవుతాయని, వాటి గురించి సమాచారం లేదని చెప్పారు.

బకాయిలు అధికంగా రావల్సిన నక్కపల్లి గ్రామం

రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి స్థానిక సంస్థలకు ఇలా..

పురపాలక సంఘం, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే ఇళ్లు, స్థలాలు, వ్యవసాయ భూములు, బహుళ అంతస్తుల భవనాలు క్రయవిక్రయాలు జరిగితే స్టాంప్‌ డ్యూటీ సర్‌ఛార్జీ కింద అమ్మిన ఆస్తి విలువలో 1.5 శాతం సొమ్మును ఆయా స్థానిక సంస్థల ఖాతాలో వేయాలి. ఈ నిధులను పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు వచ్చే వాటా ప్రకారం ట్రెజరీ ద్వారా ఆయా ఖాతాలకు సర్దుబాటు చేస్తుంటారు. సాధారణంగా నెల రోజుల్లో జరిగిన ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి చెల్లించాల్సిన స్టాంప్‌డ్యూటీ సర్‌ఛార్జీ వివరాలు ప్రతినెలా ఒకటో తేదీన రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి పంచాయతీల వారీగా ప్రొసీడింగ్స్‌ను ఖజానాకు పంపిస్తారు.

ఖజానా నుంచి పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు నిష్పత్తి ప్రకారం జమ చేస్తుంటారు. గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఈ నిధులను ఖర్చుచేసుకునే వెసులుబాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఉంటుంది.

రూ.కోట్లలో బకాయిలు..

అనకాపల్లి జిల్లాలో పది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో రోజుకు సుమారు 300 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. వీటి ద్వారా స్టాంప్‌ డ్యూటీగా 6.5 శాతం వసూలు చేస్తారు. అందులో 1.5 శాతాన్ని స్థానిక సంస్థలకు జమచేయాలి. ఈ మొత్తాన్ని గతేడాది డిసెంబర్‌ నుంచి ప్రభుత్వం విడుదల చేయలేదు. అనకాపల్లి జిల్లాలో ఈ బకాయిలు సుమారు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయని అంచనా.

* మేజర్‌ పంచాయతీ నక్కపల్లికి దాదాపు రూ. ఏడు లక్షల వరకు స్టాంప్‌ డ్యూటీ సర్‌ఛార్జీ బకాయి ఉంది. ప్రస్తుతం ఖాతాలో రూ. 20 వేలు మాత్రమే ఉంది. ఇక్కడ 14 మంది స్వీపర్లు పనిచేస్తున్నారు. వీరికి నెలకు వేతనాలకింద రూ. 1.7 లక్షలు ఇవ్వాలి. ఇలా మూడు నెలలుగా పెండింగ్‌ ఉంది. స్టాంపు డ్యూటీ నగదు ఖాతాకు చేరితే ఇలాంటి వారికి వేతనాలు చెల్లించడంతో పాటు, పారిశుద్ధ్య తదితర వాటికి వినియోగించే అవకాశం కలిగేది.

* ఎలమంచిలి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పరిధిలో గత ఏడాది డిసెంబరు నుంచి ఈ సొమ్మును ఖాతాలకు వేయడం మానేశారు. స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన సొమ్ములు రూ.50 లక్షలపైనే ఉందని అధికారులు చెబుతున్నారు.

సకాలంలో జమయ్యేలా చూడాలి: పంచాయతీలో నిధుల కొరత ఉంది. స్టాంపు డ్యూటీ కింద రావల్సిన సొమ్మును సకాలంలో ఇస్తే పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది జీతాలు తదితర అవసరాల నిమిత్తం వినియోగించగలం. దీనిపై ఎవరిని అడగాలో తెలియడంలేదు. ఉన్నతాధికారులు చొరవ చూపి సకాలంలో జమయ్యేలా చూడాలి.

పోతంశెట్టి రాజేష్‌, సర్పంచి, కాగిత

సొంత సొమ్ము పెట్టాల్సి వస్తోంది..: ఎలమంచిలి మండలంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీకి ఆరునెలుల సొమ్ము జమచేయలేదు.మాకు రావాల్సింది ఎంత అన్నది అడిగినా చెప్పడంలేదు. నలుగురుస్వీపర్లు ఉన్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వమే వాడేసుకుంది. పంచాయతీలో ఏపని చేద్దామన్నా నిధులు లేవు. సొంత సొమ్ము ఖర్చుపెట్టి పరిపాలన చేస్తున్నాం.

ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, సర్పంచ్‌, పోతిరెడ్డిపాలెం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని