logo

మృత్యువులోనూ వీడని స్నేహం

వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. పనీపాటా చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా ఒకరికొకరు నిత్యం తోడుగా ఉండేవారు.

Published : 09 Jun 2023 05:45 IST

ముగ్గురు యువకుల దుర్మరణం
శ్రీరాంపురాన్ని ముంచెత్తిన విషాదం

కిరణ్‌కుమార్‌, శివ, వీరబాబు (పాత చిత్రం)

పాయకరావుపేట గ్రామీణం, తొండంగి, న్యూస్‌టుడే: వారు ముగ్గురూ ప్రాణ స్నేహితులు.. పనీపాటా చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నా ఒకరికొకరు నిత్యం తోడుగా ఉండేవారు. స్నేహితుడి బంధువు వివాహ వేడుక అన్నవరంలో జరుగుతోందని కలిసి ఒకే బైకుపై వెళ్లారు. ఉత్సాహంగా గడిపి ఊరుకు తిరిగి బయల్దేరారు. అనూహ్యంగా ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించడంతో తుదిశ్వాస విడిచారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి సమీపాన ట్రాక్టర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో పాయకరావుపేట మండలం శ్రీరాంపురానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన పోలవరపు కిరణ్‌కుమార్‌ (22), పసుపులేటి శివ (22), కాకర వీరబాబు (21) స్నేహితులు. ముగ్గురు యువకులు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న వారే. వీరిపైనే వారి కుటుంబ సభ్యులు ఆధారపడి జీవిస్తున్నారు. ఊహించని విధంగా అండ కోల్పోవడంతో ఆ కుటుంబాల వారు శోకసంద్రంలో మునిగిపోయారు.

* కిరణ్‌కుమార్‌ తల్లి లక్ష్మి, దివ్యాంగురాలైన చెల్లితో కలిసి ఉంటున్నాడు. తండ్రి కుటుంబానికి దూరంగా ఉండేవాడు. దీంతో కిరణ్‌ పెయింటింగ్‌ పనులు చేస్తూ తల్లికి చేదోడుగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అందొచ్చిన కొడుకును ప్రమాదంలో కోల్పోవడంతో తమకు దిక్కెవరంటూ లక్ష్మి కన్నీరుమున్నీరైంది.

* శివకు ఐదేళ్ల వయసుల్లోనే తల్లి, తండ్రి మృతి చెందారు. దీంతో మేనత్త రమణమ్మ దగ్గరే ఉంటూ కాంక్రీట్‌ మిక్సర్‌ యంత్రం ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అత్త, మామకు తోడుగా ఉంటూ పేద కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. శివ మృతితో ఆసరా కోల్పోయామని వారు రోదిస్తున్నారు.

* తల్లి ఉపాధి కోసం దుబాయి వెళ్లడంతో వీరబాబు గ్రామంలోనే తండ్రి దొరబాబు, చెల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ యువకుడిపై ఆధారపడి జీవిస్తున్నారు. అతడిక లేడని తెలిసి వీరు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబాలను తెదేపా నాయకురాలు చించలపు సన్యాసమ్మ, గుడబంటి శాంతమ్మ ఓదార్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని