logo

సర్కారు బడికి సమస్యల స్వాగతం

‘పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు వేసవి సెలవుల్లోనే పూర్తికావాలి.. బడులు తెరిచే నాటికి స్పష్టమైన మార్పు కనబడాలి’ నాలుగు నెలల క్రితం విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అన్నమాటలివి.

Updated : 10 Jun 2023 04:46 IST

పాఠశాలల్లో నాడు-నేడు అసంపూర్తే
విద్యార్థులకు తప్పని వసతి వెతలు
ఈనాడు, అనకాపల్లి - న్యూస్‌టుడే, నర్సీపట్నం గ్రామీణం, రావికమతం, జి.మాడుగుల, పాడేరు

రావికమతం బాలికల హైస్కూల్లో అదనపు భవనం ఇలా..

‘పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులు వేసవి సెలవుల్లోనే పూర్తికావాలి.. బడులు తెరిచే నాటికి స్పష్టమైన మార్పు కనబడాలి’ నాలుగు నెలల క్రితం విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి అన్నమాటలివి. నాలుగు నెలలు గడిచిపోయాయి.. రెండు రోజుల్లో పాఠశాలలు తెరుచుకోబోతున్నాయి. పనులు మాత్రం నత్తకు నడక నేర్పిన చందంగా సాగుతున్నాయి. నిధుల కొరత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, సిమెంట్‌, ఇసుక సరఫరా తగ్గిపోవడంతో ఈ పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. పాఠశాలలకు వచ్చే పిల్లలకు అసంపూర్తి పనులే దర్శనమివ్వబోతున్నాయి.

అనకాపల్లి జిల్లాలో 616 పాఠశాలు, అల్లూరి జిల్లాలో 945 స్కూళ్లు అంగన్‌వాడీ కేంద్రాలు, జూనియర్‌ కళాశాలల్లో రెండో విడత నాడు-నేడు పనులు మంజూరు చేశారు. సుమారు రూ.467 కోట్ల అంచనాతో ఈ పనులు చేపట్టారు. అయితే రివాల్వింగ్‌ ఫండ్‌ రూపంలో విడుదల చేసే నిధులు కొద్దికొద్దిగా ఇవ్వడంతో పనులు ఆగుతూ.. సాగుతూ జరుగుతున్నాయి. తాజాగా అదనపు తరగతి గదుల నిర్మాణాలను నిలిపేయాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారు. వాటి నిధులను ఇతర పనులకు వినియోగించాలని సూచించారు. నిధుల కొరతపై ఆలస్యంగా మేల్కోవడంతో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో చేపట్టలేకపోయారు.. అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే వదిలేస్తున్నారు. దీంతో ఆయా చోట్ల విద్యార్థులను చెట్ల కింద, వరండాల్లో కూర్చోబెట్టి బోధించే పరిస్థితి కనిపిస్తోందని ఉపాధ్యాయులంటున్నారు.

* నర్సీపట్నంలోని బలిఘట్టం జడ్పీ హైస్కూల్‌కు నాడు-నేడు రెండో విడత కింద రూ.1.24 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు పలు విడతలుగా రూ.34.02 లక్షలు మాత్రమే విడుదల చేశారు.. వాటితో  తలుపులు, కిటికీలు కొత్తవి అమర్చి గోడల మరమ్మతు చేయించారు. పాత గచ్చును తొలగించి నాపరాయి పరిచే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హైస్కూల్‌ తెరిచే నాటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరుగుదొడ్ల కోసం స్లాబ్‌ వరకు పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేపట్టలేదు. విద్యార్థులకు పాత మరుగుదొడ్లే దిక్కవుతున్నాయి.

* రావికమతం మండలంలోని 19 ప్రభుత్వ పాఠశాలలకు రూ.7.34 కోట్లు నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు రూ.2.28 కోట్లు విలువైన పనులు మాత్రమే జరిగాయి. గర్నికం కేజీబీవీలో సైన్స్‌ ల్యాబ్‌ సహా అదనపు తరగతి గదులకు 47.97 లక్షల నిధులు మంజూరయ్యాయి. పునాదుల వరకు కట్టి వదిలేశారు.

* పాడేరు మండలంలో 28 వరకు పాఠశాలలు, ఓ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పనులు జరుగుతున్నాయి. రోడ్డు రవాణా సదుపాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొన్ని గ్రామాలకు సామగ్రిని తరలించడం పెద్ద సమస్యగా మారింది. బోడిచెట్టు, పెద్ద పొలం వంటి గ్రామాలకు మండల కేంద్రం నుంచి ఓ సిమెంట్‌ బస్తా తరలించేందుకు అదనంగా రూ.50 నుంచి రూ.100ల వరకు అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఈ కారణంగా సకాలంలో పనులు పూర్తిచేయడం ఇబ్బందిగా మారింది.  

* జి.మాడుగుల మండలం పాలమామిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో నాడు-నేడు నిర్మాణాలకు రూ.68 లక్షలు కేటాయించారు. వీటితో పాఠశాల తరగతి గదులు, వరండాల్లో గచ్చులను తొలగించారు. కొత్తగా నాపరాయి పలకలు వేద్దామని పని మొదలుపెట్టి నిధుల లేమి కారణంగా అసంపూర్తిగా వదిలేశారు. విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చోడానికి వీలు లేకుండా చేశారు.

* ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ కొన్ని కళాశాలల పనులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా అనుకున్న లక్ష్యాలు చేరుకోలేదని, నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించని కారణంగా డీఐఈవో బెన్నాస్వామిపై వేటు వేశారు.

బలిఘట్టం హైస్కూల్లో మధ్యలో నిలిచిపోయిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు

ఇబ్బంది లేకుండా చేస్తాం..

పాఠశాలల్లో నాడు-నేడు పనుల వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. సెలవుల్లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా మానవ వనరుల కొరత కారణంగా అనుకున్న స్థాయిలో పనులు జరగలేదు. తరగతి గదిలో పిల్లలు కూర్చునే వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. మరుగుదొడ్ల పనులు పూర్తిచేయించాం. అదనపు తరగతి గదులు కొంతమేర నిర్మించాల్సి ఉంది.

సలీంబాషా, డీఈవో, అల్లూరి జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని