logo

రైలెక్కాలన్నా.. దిగాలన్నా గోడే దిక్కు!

ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాలన్నా.. దిగాలన్నా గోడ ఎక్కాల్సిందే. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా ఇటు రైల్వే అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు.

Updated : 10 Jun 2023 05:26 IST

ఎలమంచిలిలో ప్రమాదకరంగా మారిన ప్రయాణం

రైలు ఎక్కాలంటే పాట్లు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎలమంచిలి రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కాలన్నా.. దిగాలన్నా గోడ ఎక్కాల్సిందే. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నా ఇటు రైల్వే అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదు. చాలా కాలంగా ఈ సమస్య ఎదుర్కొంటున్నా పరిష్కారం దిశగా అడుగులు పడటంలేదు.

స్టేషన్‌లో రెండో నంబరు ప్లాట్‌ఫాం దెబ్బతింది. కొత్తగా మూడోలైన్‌ వేయడంతో రెండు, మూడు లైన్లకు కలిపి కొత్త ప్లాట్‌ఫాంల నిర్మాణం చేపట్టి ఇటీవల ఈ పనులు నిలిపివేశారు. విశాఖ వైపు వైళ్లే రైళ్లు రెండు, మూడు లైన్లలో ఆగుతాయి. హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ దిగాలన్నా, ఈ రైళ్లు ఎక్కాలన్నా ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్‌ఫాం నిర్మాణం పనుల్లో భాగంగా గోడకట్టారు. మధ్యలో ఖాళీలు వదిలిపెట్టారు. రైలు ఎక్కాలంటే ఏదోలా కష్టపడి ముందు ఈ గోడ ఎక్కాలి. దీనిపై నిలబడి రైలు బోగీలోకి ప్రవేశించాలి. యువకులకే ఇది సాహసంగా మారిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలకు మరింత కష్టమవుతోంది. దూరంగా వెళ్లి అక్కడ మట్టిదిబ్బపై నుంచి గోడ ఎక్కి బోగీలు ఆగే స్థలానికి గోడపై నుంచి నడిచి రావాల్సి వస్తోంది. పిల్లల్ని తీసుకెళ్లడం ఇబ్బందిగా మారింది. వృద్ధులైతే అనకాపల్లి స్టేషన్‌లో దిగి ఇక్కడికి బస్సుల్లో వస్తున్నారు. రాత్రి సమయంలో ఈ స్టేషన్లో దిగాలన్నా, ఎక్కాలన్నా ప్రాణాలతో చెలగాటంగా మారింది. చీకట్లో గోడ సరిగా కనిపించదు. ఏమాత్రం పట్టుతప్పినా కింద పడిపోతారు. ఇలా రోజూ ఇద్దరు, ముగ్గురు గాయాలపాలవుతున్నారు. ఇక్కడ విద్యుత్తు దీపాలు పూర్తిస్థాయిలో లేవు. ప్రయాణికులు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. సెజ్‌, ఎన్‌ఏఓబీ వచ్చాక ఎలమంచిలి రైల్వేస్టేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. చాలా రైళ్లు ఇక్కడ ఆగుతున్నాయి. ప్రమాదాలు జరక్క ముందే అధికారులు మేల్కోవాలని పలువురు కోరుతున్నారు.

రైలు దిగి స్టేషన్‌లోకి రావడానికి ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని