logo

ఇంటి తేజం ఆరిపోయింది.. పుట్టెడు శోకం మిగిలింది!

ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మెడ చుట్టూ చేతులు వేసి నాన్నా.. అంటూ అల్లుకుపోయే కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.

Updated : 10 Jun 2023 05:50 IST

పల్లా తేజ (పాతచిత్రం)

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రతిరోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మెడ చుట్టూ చేతులు వేసి నాన్నా.. అంటూ అల్లుకుపోయే కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి చీర చెంగు పట్టుకుని తిరిగే చిన్ని కృష్ణుడి వంటి కన్న కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరైన ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామంలో అయిదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, బాలుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పల్లా కనకరాజు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య నారాయణమ్మ, డిగ్రీ చదువుతున్న కుమార్తె కృష్ణవేణి, కుమారుడు తేజ(5) ఉన్నారు. కనకరాజుకు కుమార్తె పుట్టిన చాలాఏళ్ల తర్వాత తేజ జన్మించడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్తూ సందడిగా ఉండేవాడు. గురువారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తేజ రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ అసిరితాత గ్రామానికి వచ్చి బాలుడి బంధువులతో కలిసి అర్ధరాత్రి వరకూ పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం తెల్లవారుజామున తేజ బంధువులు మరోసారి వెతుకులాట ప్రారంభించారు. ఇంటికి సమీపంలోనే లారీ షెడ్డు దరి చెట్టు కింద బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. వెస్ట్‌జోన్‌ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి, గోపాలపట్నం సీఐ ఇ.నరసింహారావు సంఘటన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ నరసింహమూర్తి మాట్లాడుతూ బాలుడి ఎడమ చేతిపై రెండు గాట్లు ఉండటంతో పాము కాటుకు గురయ్యాడా..? అన్న అనుమానాలు ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామన్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలుడి మృతిపై స్పష్టత వస్తుందన్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వివరించారు. గ్రామంలో ఓ వివాదానికి సంబంధించి జరిగిన తగాదాకు వచ్చిన నగరంలోని రాంనగర్‌ ప్రాంతానికి చెందిన యువకులు తన కొడుకును ఏమైనా చేసి ఉండొచ్చని తేజ తల్లి నారాయణమ్మ అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి మృతదేహం దొరికిన చోట గురువారం రాత్రి వెతికినా కనిపించలేదని, శుక్రవారం ఉదయానికి కనిపించడం అనుమానాలకు తావిస్తోందని వాపోయారు.

చేతిపై గాట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని