logo

బాలుడు ఎక్కడున్నాడో.. ఏమయ్యాడో..?

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఏడాదిన్నర బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి రెండు రోజులైనా పోలీసులు ఆచూకీ గుర్తించలేకపోయారు.

Published : 10 Jun 2023 03:26 IST

రెండు రోజులయినా లభ్యంకాని ఆచూకీ
పోలీసు బృందాలు గాలించినా కనిపించని
ప్రయోజనం కన్నీరుమున్నీరవుతున్న తల్లి
ఈనాడు, విశాఖపట్నం న్యూస్‌టుడే, రైల్వేస్టేషన్‌

విశాఖ రైల్వేస్టేషన్‌లో ఏడాదిన్నర బాలుడ్ని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి రెండు రోజులైనా పోలీసులు ఆచూకీ గుర్తించలేకపోయారు. బృందాలుగా ఏర్పడి గాలించినా శుక్రవారం రాత్రి వరకు ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. జీఆర్పీ, రైల్వే పోలీసులు కనీస సమాచారం కూడా సేకరించలేకపోయారు. ఇప్పటికే అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. బాలుడి ఫొటోలు పంపించి అప్రమత్తం చేశారు. పోలీసు బృందాలకు సవాల్‌గా మారిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
అంతటా నిర్లక్ష్యం: తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లికి చెందిన ఏడు నెలల గర్భిణి భవానీ బుధవారం రాత్రి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఆ రోజు రాత్రంతా తన 18 నెలల కుమారుడు విజయ్‌కుమార్‌తో ఎనిమిదో నెంబరు ప్లాట్‌ఫాం మీదే ఉంది. ఆ రాత్రంతా అక్కడే ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు. సాధారణంగా ప్లాట్‌ఫాంలకు రైళ్లు రాకపోతే అనధికార వ్యక్తులను అక్కడ ఉంచరు. అటువంటి వారిని రైల్వే పోలీసులు బయటకు పంపిచేస్తారు. భవానీ వచ్చిన రోజున 8వ నంబరు ప్లాట్‌ఫాం వైపు వచ్చే రైళ్లు ఏమీ లేవు. అయినప్పటికీ ఆమెను ఎవరూ ప్రశ్నించలేదు. కనీసం ప్రశ్నించుంటే వివరాలు తెలుసుకొని సురక్షితంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం జరిగేది. అలా జరగకపోవడంతో...ఆమె నిద్రలోకి జారుకున్న సమయంలో 18 నెలల కుమారుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. ఈ ఘటన నేపథ్యంలో...విశాఖ రైల్వే స్టేషన్‌లో జీఆర్పీ, రైల్వే పోలీసుల మధ్య సమన్వయలోపం కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. చిన్నారి తప్పిపోయినట్లు గురువారం ఉదయం సుమారు 10 గంటలకు జీఆర్పీ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తరువాత సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలించినా నిందితులు లోపలికి ఎలా వచ్చారు...ఎలా బయటకు వెళ్లారనే విషయాలను గుర్తించలేకపోయారు.

కేజీహెచ్‌లో దీనంగా: భవానీ ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. భావనగర్‌వార్డులో ఆమెను ఉంచి చికిత్స అందిస్తున్నారు. జీఆర్పీ పోలీసును సహాయంగా ఉంచారు. ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలియజేశారు. కుమారుడు కిడ్నాప్‌నకు గురైనప్పటి నుంచి ఆమె రోదిస్తూనే ఉంది. తన పక్కనే అప్పటి వరకూ నిద్రించిన బాబు కనిపించకపోయేసరికి కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ కలహాలు, భర్తతో ఉన్న గొడవలతో కుమారుడ్ని ఏమైనా చేయొచ్చనే భయంతో ఇంటి నుంచి దూరంగా వచ్చేస్తే.. ఇప్పుడిలా జరిగిందేమిటని ఆమె ఆసుపత్రిలో విలపిస్తోంది.

విలపిస్తున్న భవానీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని