logo

ముంపు ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలెలా

వర్షం పడితే జగనన్న కాలనీల్లో నీరు నిలుస్తోంది. ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 10 Jun 2023 03:26 IST

స్థలం ఎంపికపై విచారణ: కలెక్టర్‌

లబ్ధిదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ రవి

చోడవరం పట్టణం, న్యూస్‌టుడే: వర్షం పడితే జగనన్న కాలనీల్లో నీరు నిలుస్తోంది. ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదని పలువురు లబ్ధిదారులు కలెక్టర్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చోడవరం మండలంలో కలెక్టర్‌ రవి శుక్రవారం పర్యటించారు. తామర చెరువు వీధిలో పంప్‌హౌస్‌ సమీపంలోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. లేఅవుట్‌ వేసి ఏడాదికిపైగా అవుతున్నా.. ఇళ్లు ఎందుకు నిర్మించుకోలేదని లబ్ధిదారులను ప్రశ్నించారు. వర్షం పడిన్నప్పుడల్లా మోకాలి లోతున నీరు నిలుస్తోందని వారు వివరించారు. ఏడెకరాల ఆరు సెంట్ల పోరంబోకు స్థలంలో లేఅవుట్‌ వేసినట్లు తహసీల్దారు తిరుమలబాబు చెప్పగా.. లోతట్టు ప్రదేశంలో ఇళ్ల నిర్మాణానికి స్థలం ఎలా కేటాయించారని కలెక్టర్‌ ప్రశ్నించారు. మరోచోట స్థలం ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో ఇక్కడే ఇచ్చినట్లు తహసీల్దారు పేర్కొనగా.. ఆర్డీఓతోపాటు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌తో కమిటీ వేసి విచారణ చేపడతామన్నారు. అనంతరం కోమటి వీధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించి మెనూ అమలుపై ఆరా తీశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తూరు పెట్రోల్‌ బంకు వెనుక ఉన్న ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించిన కలెక్టర్‌ స్లాబు పెచ్చులూడుతున్నాయని, మరమ్మతు పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. చోడవరం మండలంలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఎంపీపీ గాడి కాసులమ్మ, ఎంఈఓ రవీంద్రబాబు, ఇన్‌ఛార్జి ఎంపీడీఓ సువర్ణరాజు, హౌసింగ్‌ ఏఈ అవతారం, ఆర్‌ఐ వెంకటగిరి, చోడవరం పంచాయతీ కార్యదర్శి నారాయణరావు వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని