logo

భారత్‌లో ఉన్నామా.. పాకిస్థాన్‌లోనా?

ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల గొంతు నొక్కేలా నిరంకుశంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశాఖ తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.

Updated : 18 Sep 2023 05:26 IST

బయటకొస్తే అరెస్టులు.. నిర్బంధాలు
పాలక పక్షం తీరు అప్రజాస్వామికం
ప్రతిపక్షాల గొంతు నొక్కేలా వ్యవహారం
సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నాయకులు

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సంఘీభావం తెలుపుతున్న నేతలు

ఈనాడు, విశాఖపట్నం : ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల గొంతు నొక్కేలా నిరంకుశంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విశాఖ తెదేపా పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరై ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలను ఖండిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు తీరును వ్యతిరేకిస్తూ సంఘీభావం తెలిపారు.

  • ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ‘వైకాపా నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి వ్వవస్థలను నిర్వీర్యం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా నాయకుల మీద కేసులు, అరెస్టులతో పాటు ఎటువంటి నోటీసులు లేకుండా భవనాలను కూల్చడం వంటివి చేశారు. అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అప్రజాస్వామికం. అప్పటి నుంచి తెదేపా నేతలపై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అయిదు రోజుల పాటు బయటకు రానీయలేదు. మూడు రోజులు రాత్రిళ్లు నిద్రపోనివ్వలేదు. పాకిస్థాన్‌లో ఉన్నామా.. భారతదేశంలో ఉన్నామా అన్నంతగా ఏపీలో పరిస్థితులు నెలకొన్నాయ’ని అన్నారు.
  • సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూ ‘విశాఖలో విలువైన భూములను కొట్టేసిన వైకాపా నేతలను అరెస్టు చేయాలి. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నగర శివారులో విలువైన భూమిని కొట్టేయడమే కాకుండా అక్రమంగా రోడ్డు వేయించుకున్నారు. ఆయన్ని అరెస్టు చేయాలి. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు నిరంకుశమైంది. అభియోగం వచ్చినపుడు చట్ట ప్రకారం వ్యవహరించకుండా బలవంతంగా అదుపులోకి తీసుకొని రకరకాలుగా గతంలో ఎన్నడూ జరగని విధంగా అరెస్ట్‌ చేశారు. వైకాపా నేతలే చంద్రబాబు అరెస్టు మీద అసంతృప్తిగా ఉన్నార’న్నారు.
  • ఇందులో జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ, సీపీఎం, ఇతర ప్రజా సంఘాలకు చెందిన నేతలు పాల్గొని వ్యతిరేకత వ్యక్తం చేశారు.

    సైకో పాలనతో ప్రజలు విసిగిపోయారు: సీఎం జగన్‌ది సైకో పాలన. తాను జైలుకు వెళ్లాడని మిగిలిన వారూ జైల్లో ఉండాలన్న పాశవిక ఆనందం ఆయనది. అందుకే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. ఇప్పటికే వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారు. తెదేపా నాయకులు ఎక్కడ కనిపించినా అరెస్టు, నిర్బంధాలకు పాల్పడుతున్నారు. ఇదంతా అత్యవసర పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఇప్పటికే బాబు అరెస్టుకు నిరసనగా ప్రజలు రోడ్లు ఎక్కుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు నూకలు చెల్లినట్లే. అన్ని పార్టీలు ఏకతాటి మీదకొచ్చి వైకాపా ఓటమికి కలిసికట్టుగా నడవాలి.

 ఎండీ నజీర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెదేపా


అరెస్టు దారుణం: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు దారుణం. భాజపా ప్రమేయం లేకుండా అరెస్టు జరిగుండదు. అసలు జగన్‌ మీద అన్ని కేసులుంటే లండన్‌ ఎలా పంపించారు. మిగిలిన ఎవరిమీదైనా కేసులుంటే అనుమతిస్తారా? రోజురోజుకీ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కనిపించడం లేదు. దేశం అంతటా ఇదే కనిపిస్తోంది. 

డా.సీతల్‌, జిల్లా అధ్యక్షులు, ఆప్‌


చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..: రాష్ట్రంలో ఎక్కడా సమన్యాయ పాలన కనిపించడం లేదు. చంద్రబాబు తప్పు చేస్తే అరెస్టు చేయొచ్చు. అరెస్టు విధానం సరికాదు. 73 ఏళ్ల వ్యక్తిని హింసాత్మకంగా అరెస్టు చేయడాన్ని అందరూ ఖండించాల్సిందే. న్యాయపరంగా విచారించేందుకు తగిన విధానాలు ఉన్నాయి. రాష్ట్రంలో న్యాయపాలన సాగడం లేదు. పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ సైతం అదే ఆందోళన వ్యక్తం చేశారు.

 ఎం.ఎస్‌.మూర్తి, జిల్లా కార్యదర్శి, లోక్‌సత్తా


ధర్నా చేసినా, నిరసన తెలిపినా అరెస్టులే...: జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ప్రజల బాధలు విన్నాను..వస్తున్నాను అన్నాడు. అధికారంలోకి వచ్చాక ప్రజలను హింసిస్తాడని అనుకోలేదు. తుగ్లక్‌ పరిపాలనను తలపిస్తోంది. ధర్నా చేసినా, నిరసన తెలిపినా అరెస్టులు చేస్తున్నారు. ప్రజా పోరాటాలు సాగించేవారిని అరెస్టు చేస్తున్నారు. చెల్లి సాయంతో గెలుపొందిన వ్యక్తి ఇప్పుడు చెల్లిని, తల్లిని బయటకు పంపేశాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ఏమి మేలు చేయగలడు?  

విమల, అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా సమాఖ్య


ప్రజాస్వామ్య వ్యవస్థేనా?: వైకాపా ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోంది. మనం ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలనలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోంది. ప్రజలు 151 సీట్లు ఇచ్చారని నెత్తిన కిరీటం పెట్టినట్లు కాదు. రాజ్యాంగ విలువలు పాటించాలి. అన్ని పార్టీలు కలిపి వచ్చే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించాలి. శత్రు దేశం పాకిస్థాన్‌లో కూడా ఇంత దుర్మార్గ పాలన ఉంటుందనుకోవడం లేదు. చెరగని చిరునవ్వుతో జగన్‌ ఏపీని సర్వనాశనం చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు.

 మూగి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన


ఎన్ని కేసులు పెట్టినా..: వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాల నోరు నొక్కుతోంది. అందుకు అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడుతోంది. చంద్రబాబు అరెస్టుతో పార్టీ కార్యకర్తలు అరెస్టులకు వెనుకాడడం లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోమంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారు. ఇక భరించలేరు.

మూర్తి యాదవ్‌, తెదేపా ప్రధాన కార్యదర్శి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని