logo

అనుమతి ఒక చోట.. తరగతులు ఇంకోచోట..!

ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్‌మీడియేట్‌ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి.

Published : 30 Jan 2023 03:40 IST

ఇంటర్‌లో ప్రైవేటు జూనియర్‌ కళాశాలల పరిస్థితి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్‌మీడియేట్‌ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి. కళాశాలల వైఖరి వల్ల మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కళాశాలలు 11 వరకూ ఉన్నాయని గుర్తించిన బోర్డు అధికారులు నోటీసులు జారీచేసినట్లు ధ్రువీకరించారు.

మండలం దాటి..: విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, ఎస్‌.కోట, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఇలా నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందుకున్న కళాశాలలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఉండడం గమనార్హం. గరివిడిలో అనుమతి పొందిన ఓ కళాశాల చీపురుపల్లి శివరాం కూడలిలో నిర్వహిస్తున్నట్లు నోటీసు జారీతో వెలుగులోకి వచ్చింది. విజయనగరం లంకవీధిలో నిర్వహించిన ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాల రెండుసార్లు పేర్లు మార్చుకొంది. ప్రస్తుతం అకాడమీగా నాయుడుతోటలో కొనసాగుతోంది. కె.ఎల్‌.పురంలో అనుమతి పొందిన మరొకటి ధనలక్ష్మి కాలనీ, నాయుడు కాలనీలో అనుమతిపొందినది తోటపాలెంలో తరగతుల్ని నిర్వహిస్తోంది. ఇటువంటి వాటికి నోటీసులు జారీచేశామని ఇంటర్మీడియేట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. తరలింపు అనుమతుల కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని,  లేకుంటే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.

నిబంధనలు ఇలా...:

* ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన ఉత్తర్వు ఇవ్వాలి.

* అనుబంధ గుర్తింపు పొందిన పత్రం అందజేయాలి.

* కార్పస్‌ఫండ్‌ కాపీని ఇవ్వాలి.

* కళాశాలను తరలించేందుకు కారణాలు సూచిస్తూ కళాశాల గవర్నింగ్‌ బాడీ తీర్మానం ఉండాలి.

* తరలించేందుకు ఒక కళాశాలకు తనిఖీ నిమిత్తం రుసుం రూ.27 వేలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,500 ప్రభుత్వానికి చెల్లించాలి.

* భూమి, భవనాలకు సంబంధించిన రిజిస్టర్డ్‌ ప్రణాళిక ఉండాలి.

* మెడికల్‌ అధికారి జారీచేసిన శానిటరీ ధ్రువపత్రం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి.


* విజయనగరంలోని శ్రీరాంనగర్‌ కాలనీలో అనుమతి పొందిన ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాల నగరానికి నడిబొడ్డున పదేళ్లకు పైగా నడుస్తోంది. రోడ్లు విస్తరణ నేపథ్యంలో కళాశాలను ఆరేళ్ల కిందట సమీపంలోని  వేరే చోటికి తరలించారు. బోర్డు నిబంధనల ప్రకారం తగిన రుసుం చెల్లించి, ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఇవేవీ  చేయకపోవడంతో తాజాగా ఈ ఏడాదీ ఆ కళాశాలకు ఇంటర్‌మీడియేట్‌ బోర్డు నోటీసు జారీ చేసింది.


* విజయనగరం పీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లో అనుమతిపొందిన రెండు ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ప్రస్తుతం తోటపాలెం, రింగురోడ్డులో తరగతులు నిర్వహిస్తున్నాయి. అయిదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ఇంటర్‌ బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో వాటికి నోటీసులు జారీ అయ్యాయి.


* పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బైపాస్‌కాలనీలో ఉండాల్సిన ఒక కళాశాల ఉన్న చోట కాకుండా వేరే చోట తరగతుల్ని నిర్వహిస్తోంది. ఎస్‌.కోట విశాఖరోడ్‌లో నిర్వహించాల్సిన ఓ కళాశాల గాయత్రినగర్‌లో తరగతులు కొనసాగిస్తుండటం గమనార్హం.


* చీపురుపల్లిలో ఓ కళాశాల కాంప్లెక్స్‌ పరిసరాల్లో అనుమతి పొంది,  శివరాంరోడ్డులో కొనసాగుతోంది.  అదే ప్రాంతంలో అనుమతి పొందిన ఇంకో కళాశాల వేరోచోట తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని