logo

ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్తు గండం

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, కార్మికుల ఉపాధికి జూట్‌, ఫెర్రో పరిశ్రమలే ఆధారం. జూట్‌ మిల్లులు చాలావరకు మూతపడగా...ఫెర్రో పరిశ్రమలు కొన్నేళ్లుగా సంక్షోభాల్ని ఎదుర్కొంటున్నాయి.

Published : 06 Feb 2023 04:29 IST

విద్యుత్తు గండం ఛార్జీల పెంపునకు డిస్కంల ప్రతిపాదనతో ఆందోళన

అదే జరిగితే మూసివేత తప్పదంటున్న యాజమాన్యాలు

ఈనాడు-విజయనగరం, న్యూస్‌టుడే, గరివిడి: జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, కార్మికుల ఉపాధికి జూట్‌, ఫెర్రో పరిశ్రమలే ఆధారం. జూట్‌ మిల్లులు చాలావరకు మూతపడగా...ఫెర్రో పరిశ్రమలు కొన్నేళ్లుగా సంక్షోభాల్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు విద్యుత్తు ఛార్జీల భారాన్ని మోపాలని డిస్కంలు ప్రతిపాదించడంతో యాజమాన్యాలు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ పరిస్థితి:

ఫెర్రో పరిశ్రమలకు గతంలో ఇచ్చిన రాయితీల్ని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోగా... ఇప్పుడు విద్యుత్తు పంపిణీ సంస్థలు 2023-24 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్‌)లో ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించాయి. దీనికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదిస్తే పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమే. అదే జరిగితే మూసివేయడం తప్ప మరోదారి లేదని ఇటీవల విజయనగరంలో విద్యుత్తు శాఖాధికారుల ఏఆర్‌ఆర్‌ సమావేశంలో యాజమాన్యాలు స్పష్టం చేసినట్లు సమాచారం.

జిల్లావ్యాప్తంగా 17 పరిశ్రమలుండగా.. ఇప్పటికే మూడు, నాలుగు మూతపడ్డాయి.

రోజుకు రూ.6.60 లక్షల భారం:

హెచ్‌టీ-1 పరిశ్రమలకు వర్తించే టారిఫ్‌నే అమలు చేయాలని ప్రతిపాదించడంతో ప్రస్తుతం యూనిట్‌కు రూ.6.01 చెల్లిస్తున్నారు. డిస్కంల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే యూనిట్‌ రూ.6.34 అవుతుందని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఫెర్రో కంపెనీలన్నీ కలిపి రోజుకు సుమారు 500 టన్నుల ఫెర్రో లోహాలను ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు 20 లక్షల యూనిట్ల వరకు వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రోజుకు రూ.6.60 లక్షల అదనపు భారం మోయాల్సి వస్తోంది. ఒక్క గరివిడి ఫేకర్‌ పరిశ్రమలోనే రోజుకు 230 టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఇందుకు 9.20 లక్షల యూనిట్ల విద్యుత్తును వాడుతున్నారు. వీరికి రోజుకు రూ.3 లక్షల భారం తప్పదు. ఈఆర్సీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ ప్రస్తుతం ఉన్న ధరలనే యథావిధిగా కొనసాగించాలని యాజమాన్యాలు కోరినట్లు తెలుస్తోంది.

ఇక్కడే ఎక్కువ..:

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే విద్యుత్తు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో యూనిట్‌కు రూ.4.34, జార్ఖండ్‌లో రూ.4.45లు వసూలు చేస్తున్నారని అంటున్నాయి. గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బొబ్బిలి, కొత్తవలస ప్రాంతాల్లో ఉన్న 17 వరకు ఉన్న పరిశ్రమల ద్వారా సుమారు పదివేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఉక్కు తయారీకి అవసరమైన ఫెర్రో క్రోమ్‌, సిలికో మాంగనీసు లోహాలను ఉత్పత్తి చేస్తున్న ఈ పరిశ్రమలు విద్యుత్తు ఛార్జీలు పెరిగినపుడు, అదనపు భారంతో సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ముడిసరకును ఒడిశా నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో రవాణాకు అదనపు భారమవుతోంది. హైకార్బన్‌ ఫెర్రోక్రోమ్‌ టన్ను ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.10 లక్షల నుంచి ఒక్కసారిగా రూ.90 వేలకు తగ్గినట్టు చెబుతున్నారు. ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని.. సరైన ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు.

రాయితీలు ఎత్తివేత:

ఫెర్రో లోహాలను ఉత్పత్తి చేసే కొలిమి (ఫర్నిస్‌)లు నిరంతరం కరెంటుతోనే పని చేస్తాయి. ఒకటన్ను ఫెర్రో లోహం తయారీకి నాలుగు వేల యూనిట్లు కావాలి. గతంలో ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించేవి. 2016-17లో యూనిట్‌కు రూ.1.50 ఇవ్వగా, 2017-18లో 75 పైసలకు తగ్గించారు. ఈ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తేసింది. రాయితీలు ఇవ్వాలని యాజమాన్యాలు ఓ వైపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతుంటే...తాజాగా డిస్కంల ప్రతిపాదన అందరికీ పెద్ద షాకిచ్చాయి.

ఫెర్రో పరిశ్రమల్లో విద్యుత్తుతో పనిచేసే కొలిమిలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని