logo

భూములు తీసుకున్నారు.. పరిహారానికి తిప్పుతున్నారు

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో  సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమానికి వివిధ సమస్యలపై ఏకంగా 124 వినతులు బాధితులు అందించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూకు 79 ఫిర్యాదులు రాగా..

Published : 07 Feb 2023 03:08 IST

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో  సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం(స్పందన) కార్యక్రమానికి వివిధ సమస్యలపై ఏకంగా 124 వినతులు బాధితులు అందించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూకు 79 ఫిర్యాదులు రాగా.. గృహ నిర్మాణ శాఖ 9, మున్సిపల్‌ 6, వైద్యారోగ్యశాఖ ఆరు ఉన్నాయి. పింఛన్లు, భూములకు పరిహారం, బియ్యం కార్డులు, ఉపాధి కల్పన తదితర వాటిపై ఎక్కువ మంది వినతులు అందించగా  కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్వో గణపతిరావు వాటిని పరిశీలించారు.

‘గిరిజన విశ్వవిద్యాలయం కోసం మా భూములు తీసుకున్నారు. పరిహారం అడిగితే ఇచ్చేశామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు రూపాయి కూడా మా ఖాతాల్లో జమకాలేదు. మండల అధికారులు, ఆర్డీవోను కలిశాం. అయినా స్పందన లేదు. మా పాసు పుస్తకాలు, భూ సంబంధిత కాగితాలన్నీ తీసేసుకున్నారు. మీరే న్యాయం చేయాలి’ అని మెంటాడ మండలం కుంటినవలస గ్రామస్థులు కలెక్టర్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో సుమారు 100 మంది ఉన్నామన్నారు.


 జాతర నిర్వహణకు అక్రమ వసూళ్లు

కలెక్టరేట్‌ వద్ద కుంటినవలస గ్రామస్థులు

జామిలో ఏటా జరిగే ఎల్లారమ్మ జాతర కోసం ఎన్నడూ లేని విధంగా వివిధ వర్గాల నుంచి అక్రమంగా రూ.లక్షలు వసూలు చేస్తున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు బీవీఎస్‌.ప్రకాశరావు ఫిర్యాదు చేశారు. గతంలో ఎవరూ డబ్బులిచ్చేవారు కాదని, ఈసారి డిమాండు చేసి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తగు చర్యలు తీసుకుని, ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.


ఇళ్లిచ్చి.. రద్దు చేస్తారా?

‘పేదలమని జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలిచ్చారు. సంతోషించాం. పొలాల మధ్యలో స్థలాలు చూపారు. అక్కడ నీరు, విద్యుత్తు, ఇతర మౌలిక సదుపాయాలేవీ లేవు. కనీసం వెళ్లేందుకు రహదారులు సైతం వేయలేదు. దీంతో నిర్మాణ సామగ్రిని తీసుకెళ్లలేక పనులు చేసుకోలేకపోతున్నాం. ఇంతలో అధికారులొచ్చి మీ పట్టాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు అంటూ రామభద్రపురం మండలం ఎస్‌.సీతారాంపురం వాసులు మొరపెట్టుకున్నారు.


ఆస్తులు అమ్ముకుని డబ్బులిస్తున్నాం..

కమీషన్‌కు ఆశపడి ఏజెంట్లుగా చేరి వేలాది మందితో పప్పుల చిట్టీలు కట్టించామని.. నిర్వాహకులు ఉడాయించడంతో ‘డబ్బులు కట్టిన బాధితులు రోజూ మా ఇళ్లకు వస్తున్నారు. ఏం చేయాలో తెలియక ఆస్తులు అమ్మి వారికి ఇస్తున్నాం. ఇప్పటికే ఇళ్లు, భూములు తాకట్టు పెట్టేశాం. మాకు న్యాయం చేయండి’ అని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు