logo

‘స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను వక్రీకరిస్తున్న భాజపా’

స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడుందని వరంగల్‌, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 10 Aug 2022 04:21 IST

 


ఫాతిమానగర్‌లో చేపట్టిన ఆజాదీకా గౌరవ్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న దొంతి మాధవరెడ్డి,
చిత్రంలో పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నేతలు నమిండ్ల శ్రీనినవాస్‌, ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు

కాజీపేట, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర పోరాటంలో భాజపా ఎక్కడుందని వరంగల్‌, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ప్రశ్నించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ నవ సంకల్ప చింతన్‌ శిబిరంలో తీసుకున్న నిర్ణయం మేరకు హనుమకొండ జిల్లాలో నాయిని నేతృత్వంలో 75 కిలోమీటర్ల ఆజాదీకీ గౌరవ్‌ యాత్రను మంగళవారం కాజీపేట పట్టణం ఫాతిమానగర్‌లో ప్రారంభించారు. సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాయకులు మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్‌ తొలుత మదర్‌ థెరిస్సా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ యాత్ర వరంగల్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వరకు సాగింది. యాత్రలో 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ఈ నెల 15 వరకు స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ, కాంగ్రెస్‌ పార్టీ త్యాగాలను నినాదాలుగా చెబుతూ యాత్ర సాగనుంది. కాగా తొలి రోజు దారి పొడవునా కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఫాతిమానగర్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రను భాజపా వక్రీకరిస్తోందని, సర్దార్‌ వల్లభభాయిపటేల్‌ పేరును వాడుకుంటూ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 1885-1947 మధ్య కాంగ్రెస్‌ స్వాతంత్య్ర సంగ్రామం సాగించిందని, బాలగంగాధర తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ, మోతీలాల్‌ నెహ్రూ, పింగళి వెంకయ్య, పీవీ నరసింహరావు లాంటి ఎంతో మంది సమరయోధుల ఉద్యమ ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. పంచవర్ష ప్రణాళికలు, మిశ్రమ ఆర్థిక విధానాలు, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, గరీభీ హఠావో పథకాలతో దేశాన్ని కాంగ్రెస్‌ ముందుకు నడిపించిందన్నారు. భాజపా అకృత్యాలను చూస్తూ ఊర్కోబోమన్నారు. ఈ యాత్రలో పరకాల ఇన్‌ఛార్జి ఇనగాల వెంకట్రాంరెడ్డి, ఏఐసీసీ సభ్యులు బక్క జడ్సన్‌, కార్పొరేటర్లు తోల వెంకన్న, పోతుల శ్రీమాన్‌, సీనియర్‌ నాయకులు మహ్మద్‌ అంకూష్‌, గొట్టిముక్కుల రమణారెడ్డి, రామకృష్ణ, బంక సరళ, స్వప్న, సమత, భారతమ్మ విక్రమ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని