logo

స్వచ్ఛతలో మన పల్లెలు బంగారం

డోర్నకల్‌ మండలంలో బొడ్రాయితండా పంచాయతీ జనాభా 1050. తడి, పొడి చెత్త సేకరణలో ఆదర్శంగా నిలుస్తోంది. సర్పంచి తేజావతు గమ్మి, కార్యదర్శి ప్రవీణ కృషితో తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు.

Published : 05 Oct 2022 02:17 IST

జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు సాధించిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలు
ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ విభాగంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పల్లెలు జాతీయ స్థాయిలో మెరిశాయి. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని స్వచ్ఛత అంశాలను పరిగణనలో తీసుకొని జిల్లాల ర్యాంకులను విడుదల చేసింది. జనగామ టాప్‌-10లో స్థానం సంపాదించుకుని ఆదర్శంగా నిలిచింది. మిగిలిన ఐదు జిల్లాలు రెండంకెల స్థానంలో నిలిచాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకుల కృషి వల్లనే జాతీయ స్థాయిలో ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయి.


తడి చెత్త, పొడి చెత్త సేకరణలో భేష్‌


డోర్నకల్‌: డోర్నకల్‌ మండలంలో బొడ్రాయితండా పంచాయతీ జనాభా 1050. తడి, పొడి చెత్త సేకరణలో ఆదర్శంగా నిలుస్తోంది. సర్పంచి తేజావతు గమ్మి, కార్యదర్శి ప్రవీణ కృషితో తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు 300 కిలోల సేంద్రియ ఎరువు విక్రయించి రూ.3 వేల ఆదాయం సంపాదించారు. పొడి చెత్తతో రూ.7600 ఆదాయం లభించింది.


మూడు విభాగాలుగా సర్వే

సర్వీస్‌ లెవల్‌ ప్రోగ్రెస్‌
మొదటి విభాగంలో స్వచ్ఛత తీరుపై సాధించిన ప్రగతిపై డాక్యుమెంట్‌ రూపంలో జిల్లా పాలనాధికారులు నివేదికను సమర్పించారు. ఎంఐఎస్‌ రిపోర్టును ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించారు. ఇందులో మన జిల్లాలు 350కి పూర్తి మార్కులు సాధించాయి.

ప్రత్యక్ష పరిశీలన
రెండో విభాగంలో స్వచ్ఛతకు సంబంధించి కేంద్ర బృందం ప్రత్యక్ష పరిశీలన చేసింది. ఇందుకు  ఉమ్మడి జిల్లాలోని 1693 పంచాయతీల్లో వారికి నచ్చిన పంచాయతీలను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకుని  పరిశీలించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకం, బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ,  తాగునీటి సరఫరా తదితర అంశాల్లో పరిశీలిస్తూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన జిల్లాలు 300 మార్కులకు కొద్ది తేడాతో వెనకబడ్డాయి.

పౌరుల అభిప్రాయం
మూడో విభాగంలో  స్వచ్ఛ సర్వేక్షణ్‌ ఫీడ్‌ బ్యాక్‌ అనే యాప్‌లో స్వచ్ఛత అంశాలపై పంచాయతీల పనితీరు ఎలా ఉందనే 5 నుంచి 6 ప్రశ్నలకు ప్రజలు తమ అభిప్రాయాలను నమోదు చేశారు. ప్రత్యక్ష పరిశీలనకు వచ్చిన బృంద సభ్యులు కూడా వాటిపై ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ విభాగంలో మన జిల్లాలు ఒకటి నుంచి ఆరు మార్కుల తేడాతో వందశాతం ఫలితానికి దూరమయ్యాం.


పరిశుభ్రతలో ‘దీక్ష’కుంట

గ్రామంలో ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మితమైంది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఇంకుడు గుంతల నిర్మాణంతో గ్రామంలో భూగర్జ జలాల మట్టం పెరిగింది.  గ్రామంలో పరిశుభ్రత నెలకొనడంతో రోగాలు కూడా తగ్గినట్లు స్థానికులు తెలిపారు.


టాప్‌-10 లక్ష్యంగా

- శశాంక, జిల్లా కలెక్టర్‌, మహబూబాబాద్‌

స్వచ్ఛతలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయటం వల్లనే గతేడాది కంటే మెరుగైన ర్యాంకును సాధించాం. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది టాప్‌-10లో నిలిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని