logo

ఉందిగా సైకిల్‌.. కార్యాలయానికి చల్‌చల్‌!

బైకులు, కార్లు అంతగా లేనప్పుడు సామాన్యుడి వాహనం సైకిలే. కార్యాలయాలకూ దీనిపైనే దర్జాగా వెళ్లేవారు. ఇప్పుడు వీరి సంఖ్య చాలా తగ్గింది.

Published : 27 Nov 2022 05:21 IST

బైకులు, కార్లు అంతగా లేనప్పుడు సామాన్యుడి వాహనం సైకిలే. కార్యాలయాలకూ దీనిపైనే దర్జాగా వెళ్లేవారు. ఇప్పుడు వీరి సంఖ్య చాలా తగ్గింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ పాత విధానాన్ని పాటిస్తున్నారు కొందరు ఔత్సాహిక సైక్లిస్టులు. ‘సైకిల్‌ టు వర్క్‌’ అనే విధానాన్ని తీసుకొస్తున్నారు. తాము పనిచేసే చోటుకు సైకిల్‌పైనే వెళుతూ మంచి సందేశాన్ని  ఇస్తున్నారు.

అందరిలోనూ అవగాహన రావాలి

ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర అధికారులు కనీసం వారానికోసారైనా సైకిల్‌పై తమ కార్యాలయాలకు వస్తే మిగతా వారికి స్ఫూర్తిగా ఉంటుంది.
* చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ పలుమార్లు కౌన్సిల్‌ సమావేశానికి సైకిల్‌పై హాజరయ్యారు. ః బల్దియా కమిషనర్‌గా  పనిచేసిన సమయంలో గౌతమ్‌ (ప్రస్తుతం  ఖమ్మం పాలనాధికారి) అప్పుడప్పుడు కార్యాలయానికి సైకిల్‌పై వచ్చేవారు.
వరంగల్‌ నరగపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల సైకిల్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఔత్సాహికులు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

హనుమకొండ అలంకార్‌ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఫసియుద్దిన్‌ హసన్‌పర్తి పాఠశాలలో పనిచేస్తున్నారు. రోజూ బడికి 20 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లొస్తారు.

ఈనాడు, వరంగల్‌, న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌

అనేక ప్రయోజనాలు..

పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ః రహదారులపై రద్దీ సమస్య ఉండదు.  * కార్యాలయాల్లో పార్కింగ్‌ సమస్య తలెత్తదు* ఇంధనం ఎంతో ఆదా కావడం వల్ల ఆర్థికంగా గిట్టుబాటు అవుతుంది. * సమయం లేని వారు వ్యాయామానికి ప్రత్యేక సమయం కేటాయించాల్సిన అవసరం ఉండదు.

ఆరోగ్యానికి..

* ఒత్తిడి తగ్గుతుంది.* కండరాలు దృఢమవుతాయి. * గుండె జబ్బులు దూరమవుతాయి. * అరగంటపాటు సైక్లింగ్‌ చేస్తే సుమారు 300 కేలరీలు కరుగుతాయి.

మధుమేహం, రక్తపోటు.. లాంటి ఎన్నో వ్యాధులు సైక్లింగ్‌ వల్ల అదుపులోకి వస్తాయని వైద్యులు చెబుతున్నారు..

వరంగల్‌కు చెందిన మాకినేని శ్రీధర్‌ మూడేళ్లుగా సైకిల్‌పైనే నిత్యం కార్యాలయానికి వెళ్లి వస్తుంటారు. గతంలో రెవెన్యూశాఖలో వీఆర్‌వోగా చేసేవారు. వరంగల్‌ సీకేఎం కళాశాల దగ్గర నుంచి గీసుకొండ వరకు కార్యాలయానికి నిత్యం 30 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లొచ్చేవారు. వీఆర్‌వోల బదలాయింపు తర్వాత ఇప్పుడు మామునూరులో సెంట్రల్‌ జైల్‌ కార్యాలయంలో జూనియర్‌ సహాయకులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా రోజు ఇంటి నుంచి 25 కిలోమీటర్లు సైకిల్‌పైనే వెళ్లొస్తున్నారు.

ప్రభుత్వం పాలసీ తీసుకురావాలి :

మాకినేని శ్రీధర్‌, సైక్లిస్టు, వరంగల్‌

నిత్యం సైక్లింగ్‌ చేస్తే ఊపిరితిత్తులు బాగుంటాయి. మన దేశంలో సైకిల్‌ తయారీ పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తే సైక్లింగ్‌ చేసేవారి సంఖ్య పెరుగుతుంది.

హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌రెడ్డి ధర్మసాగర్‌ మండలం మల్లక్‌పల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. ‘ట్రై సిటీ రైడర్స్‌’ పేరుతో సైక్లింగ్‌ గ్రూపు ఏర్పాటుచేసి, నగరంలో సైక్లిస్టులను ప్రోత్సహిస్తున్నారు. వారానికి రెండు రోజులు పాఠశాలకు సైకిల్‌పై వెళ్లొస్తుంటారు. పాఠశాల విద్యార్థులు కూడా ఆయనతోపాటు సైక్లింగ్‌ చేస్తుంటారు.

ఉద్యమం చేస్తున్నాం : 

చంద్రశేఖర్‌రెడ్డి, ట్రైసిటీ రైడర్స్‌ వ్యవస్థాపకుడు

ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పనిచేసే వారు వారానికి కనీసం రెండు రోజులైనా పని ప్రదేశానికి సైకిల్‌పై వెళ్లి రావాలి. ఈ విధానం అమలు చేయాలని త్వరలో మా సంస్థ తరఫున కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని